Ambati Rambabu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంబటి రాంబాబుపై నల్లపాడు సహా రాష్ట్ర వ్యాప్తంగా 16 క్రిమినల్ కేసు నమోదు అయ్యాయి. సీఎంపై వ్యక్తి దూషణలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనల్లో నల్లపాడు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. సెక్షన్లు 126(2), 196(1), 352, 351(2), 292r/w 3(5), 132 బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో రెండేళ్ల వరకు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు. అయితే ముఖ్యమంత్రిని అభ్యంతరకరంగా దూషిస్తే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు, గత తీర్పుల ఆధారంగా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసులకు బెయిల్ మంజూరు చేయవచ్చు. అభ్యంతర వ్యాఖ్యల కేసుల్లో అరెస్టు అయిన తర్వాత బెయిల్ పై బయటకు వస్తారు. ఈ తరహా కేసుల్లో కోర్టు ఎక్కువగా జరిమానా లేదా 3-6 నెలల జైలు విధిస్తుంటుంది. జైలు శిక్ష సస్పెండ్ చేసి రిలీజ్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. 3 సంవత్సరాల వరకు శిక్ష వచ్చే సెక్షన్లు (153A, 505) ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ మందికే పూర్తి జైలు శిక్ష విధించారు.
Also Read: వ్యాఖ్యల తంటా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబు, రెండువారాలు అక్కడే
సుప్రీంకోర్టు, హైకోర్టుల గత తీర్పుల ప్రకారం.. కేవలం బూతులు తిట్టడం, అవమానించడం వల్ల రాజద్రోహం(124A) కిందకు రాదు. అలాగే కేవలం అసభ్య భాష వల్ల 294 సెక్షన్ కింద శిక్ష పడదని తీర్పులు ఇచ్చాయి. అందుకే అభ్యంతర వ్యాఖ్యల కేసుల్లో ఎక్కువగా 504 + 153A + 505 సెక్షన్లు పెట్టి అరెస్టు చేస్తున్నారు. కానీ చాలా కేసుల్లో బెయిల్ త్వరగానే వస్తుంది. నిర్దిష్ట కేసులో ఏ సెక్షన్లు అమలు అవుతాయనేది పోలీసులు, ప్రభుత్వం, కంప్లైంట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది.