Ysrcp Roja: వైసీపీ కీలక నేతలకు ఇబ్బందులు తప్పవా? ఒకొక్కరు కేసులో ఉచ్చులో చిక్కుకుంటున్నారా? నేతల జాబితాలోకి మాజీ మంత్రి రోజా కూడా చేరిపోనున్నారా? ‘ఆడుదాం-ఆంధ్ర’ ఉచ్చులో ఆమె చిక్కుకుంటుందా? ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడంతో కదలిక మొదలైందా? ఈ విషయంలో మాజీ మంత్రి ఎందుకు ధీమా ఉన్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రోజా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
ఏపీలో చంద్రబాబు సర్కార్ వచ్చిన వైసీపీ చేసిన అవినీతిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే లిక్కర్, అటవీ భూముల కబ్జా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆడుదాం-ఆంధ్ర ప్రొగ్రాం వంతైంది. ఇందులో భారీగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకపోతే ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా తయారైంది.
కూటమి అధికారంలోకి రాగానే సీఐడీతో విచారణకు ఆదేశించింది. ఒక్క రోజు విచారణ సరిపెట్టి మమా అనిపించింది. దీనిపై పార్టీ నేతలు ఆగ్రహంతో రగిలిపోయారు. విచారణకు ఎందుకు ఒక్కరోజుతో ముగిసింది? దీని వెనుక కారణాలు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీనిపై ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో రెండు లేదా మూడు సార్లు ఎమ్మెల్యేలు పదేపదే ప్రస్తావించారు.
స్పీకర్ మొదలు సభ్యుల వరకు
ఈ అంశంపై స్వయంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు సైతం జోక్యం చేసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ. 120 కోట్లను కేవలం 47 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఎలా ఖర్చు చేసిందో మంత్రి రాంప్రసాద్ కళ్లకు కట్టినట్టు వివరించారు. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ను ఆదేశించామని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత సభలో అవినీతి చేసిన అధికారులు, నేతలు పేర్లను బయటపెడతామన్నారు.
ALSO READ: అన్ని కేసుల్లో పోసానికి బిగ్ రిలీఫ్
నేతల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ‘ఆడుదాం ఆంధ్రా’లో అసలు ఏం జరిగింది? అన్నదానిపై వాస్తవాలు బయటికి తీసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏసీబీ విచారణకు ఆదేశిస్తున్నట్లు మంగళవారం మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు.
ఇదీ అసలు కారణం?
దీనిపై ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ విచారణ సరిగా జరగకుండా ఉండటానికి బలమైన కారణం ఉందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆ ఒక్క కారణంతో మాజీ మంత్రి రోజా ఇన్నాళ్లు ధీమాగా ఉన్నారని అంటున్నారు. ‘ఆడుదాం- ఆంధ్ర’ కార్యక్రమానికి నిర్వహించినప్పుడు ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న ఓ ఐఏఎస్ ఉన్నారు.
ఇప్పుడు ఆయన చంద్రబాబు టీమ్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగానే దానిపై అధికారులు ఫోకస్ చేయలేదని అంటున్నారు. ఆ ఐఏఎస్ ఉన్నంత వరకు తనకేమీ కాదన్న ధీమాతో రోజా ఉన్నట్లు తెలుస్తోంది. సీఐడీ విచారణ ఒక్కరోజు జరగడానికి ఇదే కారణమని అంటున్నారు.
అందుకే ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు వద్ద ప్రస్తావించినా ఫలితం లేదు. దీంతో నేరుగా అసెంబ్లీలో ప్రస్తావించేలా కొందరు నేతలు పావులు కదిపినట్టు ప్రచారం జరుగుతోంది. సభలో ఒకసారి చర్చకు వస్తే ఎవరూ అడ్డుపడరని, రోజా విషయంలో అటు నుంచి స్కెచ్ వేసినట్టు టీడీపీలోని ఓ వర్గం ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి ఏసీబీ విచారణ పూర్తి జరుగుతుందా? సీఐడీ విచారణ మాదిరిగా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి చందంగా సాగుతుందా? అనేది చూడాలి.