Ranya Rao Protocol Misuse| సినీ నటి రన్యారావు ప్రముఖ అక్రమ బంగారు రవాణా కేసులో కీలక నిందితురాలిగా నిలిచింది. ఈ కేసు లోతుగా దర్యాప్తు చేసేందుకు సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటనతో పాటు.. వీఐపీ ప్రొటోకాల్ దుర్వినియోగంతో పాటు ఆమె సవతి తండ్రి ఓ పోలీస్ ఉన్నతాధికారి కావడంతో ఆయన ప్రమేయం గురించి కూడా విచారణ జరపాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.
ఈ కేసులో పోలీసులు కూడా ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే, తన విదేశీ పర్యటనల సమయంలో పోలీసులు తనను హెచ్చరించారని రన్యారావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కూడా సీఐడీ దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం, వీలైనంత త్వరగా నిజం తేల్చి నివేదిక సమర్పించాలని దర్యాప్తు ఏజెన్సీకి ఆదేశించింది.
Also Read: మహిళలు ఒక హత్య చేసినా శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్య
మరోవైపు.. నటి రన్యారావు ఎయిర్పోర్ట్లో వీఐపీ ప్రొటోకాల్ని దుర్వినియోగం చేసి బంగారం అక్రమ రవాణా చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. కెంపగౌడ విమానాశ్రయంలో ప్రొటోకాల్ దుర్వినియోగం అంశంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను సీనియర్ ఐఏఎస్ అధికారి, అదనపు సీఎస్ గౌరవ్ గుప్తాకు అప్పగించారు. అలాగే.. ఈ కేసులో ఆమె సవతి తండ్రి మరియు డీజీపీ కె. రామచంద్రరావు పాత్రపై కూడా దృష్టి పెట్టాలని, అవసరమైతే ఆయనను కూడా విచారణ చేయాలని నిర్దేశించింది. ఈ విషయంలో రామచంద్రరావు పాత్ర ఉందా లేదా అనేది తేల్చాలని గౌరవ్ గుప్తాకు ఒక వారం గడువు ఇవ్వబడింది.
మార్చి 3వ తేదీన.. 14.8 కిలోగ్రాముల అక్రమ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకువస్తున్న రన్యారావు, బెంగళూరు ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు చిక్కింది. ఈ కేసు దర్యాప్తు లోతుకు వెళ్తున్న కొద్దీ, కీలక విషయాలు బయటపడుతున్నాయి.
రన్యారావు వివాహ వీడియో దర్యాప్తు!
దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా (గోల్డ్ స్మగ్లింగ్) కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. స్మగ్లింగ్ లో ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఆమె వివాహానికి సంబంధించిన వీడియోలను (వెడ్డింగ్ ఫుటేజ్) పరిశీలిస్తున్నట్లు సమాచారం వెల్లడైంది.
రన్యారావు నివాసం.. ఆమెకు సంబంధించిన ప్రాంతాలు, నటి వివాహం జరిపిన హోటల్కు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఈ వేడుకకు హాజరైన వారు, అతిథులు తీసుకువచ్చిన ఖరీదైన కానుకలపై కూడా దృష్టి పెట్టారు. ఈ విషయంలో పెళ్లికి సంబంధించిన వీడియోను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో రన్యారావుని పట్టించేందుకు ఆమె భర్తనే స్వయంగా డిఆర్ఐ అధికారులకు సమాచార మందించారని ప్రచారం జరుగుతోంది. వివాహం జరిగిన రెండు వారాల నుంచే తన భర్తను తరుచూ దుబాయ్ వెళుతుండడంతో నవదంపతుల మధ్య గొడవలు జరిగేవని తెలిసింది.
మరోవైపు, రన్యారావు బెయిల్పై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. అయితే ఆమెకు బెయిల్ ఇవ్వడంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని డీఆర్ఐ అధికారులను కోర్టు ఆదేశించింది.
అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఒక రాజకీయ నాయకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నాయకుడి కోసం రన్యారావు కమీషన్ బేసిస్ పై బంగారం స్మగ్లింగ్ చేసేదని తెలుస్తోంది.