AP Medical Colleges: ఏపీలోని కొత్తగా 17 మెడికల్ కళాశాల నిర్మాణం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై హైకోర్టు తలుపు తట్టింది వైసీపీ. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలని, ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండరాదని అందులో ప్రధానంగా ప్రస్తావించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దీంతో తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.
ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల వ్యవహారం కొత్త రగడ
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించనున్న 17 మెడికల కాలేజీల వ్యవహారం మరో మలుపు తిరిగింది. వీటిని పీపీపీ పద్దతిలో నిర్మించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే తొలి విడత టెండర్లను ఆహ్వానించింది. కేవలం ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఓ సంస్థ ముందుకొచ్చింది. వారితో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇదిలా వుండగా ఈ వ్యవహారంపై ఇప్పటికే మాజీ సీఎం జగన్.. ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మాణం చేసినవారిని మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే జైలుకి పంపిస్తామని ఘాటు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో మరోసారి టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం. పరిస్థితి గమనించిన వైసీపీ.. నేరుగా హైకోర్టు తలుపు తట్టింది.
హైకోర్టు తలుపు తట్టిన వైసీపీ, ఆరువారాలకు వాయిదా
మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించాలని కోరుతూ న్యాయస్థానంలో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పిల్ దాఖలు చేసింది. టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది. ఇంకా చాలా విషయాలు అందులో ప్రస్తావించింది.
అందులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఏపీఎంఎస్ఐడీసీ, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్లను చేర్చింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.
ALSO READ: దూసుకొస్తున్న అల్పపీడనం.. ఆ జిల్లాలకు భారీ వర్షాలు
దీనిపై కొద్దిరోజులుగా అధికార టీడీపీ-వైసీపీ మధ్య రగడ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ కమిటీలో వైసీపీ చెందిన ఎంపీ కూడా ఉన్నారు. ఆయన వ్యతిరేకించిన సందర్భం ఆ నివేదికలో లేదు.
కొద్దిరోజుల కిందట ఓ కేసు విషయంలో పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ విధంగా స్పందించబోతోందనే చర్చ మొదలైంది. ఇన్నాళ్లుగా తాము 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశామంటూ వైసీపీ పదేపదే చెప్పుకుంటూ వచ్చిన విషయం తెల్సిందే.