E85 and E100 Fuels Explained: దేశంలో ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ విధానాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఇప్పటికే E20 ఇంధనం దేశ వ్యాప్తంగా అమల్లోకి రాగా, తాజాగా E85 అమ్మకాలు ప్రారంభం అయ్యింది. త్వరలో E100 ఇంధనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడుతోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం ఈ కొత్త ఇంధనాలను ప్రవేశపెట్టడం ద్వారా చమురు దిగుమతుల భారం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
E85, E100 అనేది అధిక శాతం ఇథనాల్ కలిగిన ఇంధన మిశ్రమాలు. E85లో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ ఉంటుంది. ఇక E100లో 93 నుంచి 95 శాతం వరకు ఇథనాల్ ఉండగా, మిగిలిన భాగంలో కొద్దిపాటి పెట్రోల్, ఇతర రసాయనాలు ఉంటాయి. ఇవి చల్లని వాతావరణంలో ఇంజిన్ సులభంగా స్టార్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అయితే, ప్రస్తుతం E20కు అనుకూలంగా ఉన్న సాధారణ వాహనాలు E85, E100 ఇంధనాలతో నడవవు. వీటి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లు అవసరం. ఎందుకంటే ఇథనాల్ లక్షణాలు పెట్రోల్ తో పోలిస్తే భిన్నంగా ఉంటాయి.
E85, E100 ఇంధనాలను ఉపయోగించే వాహనాల్లోని ఇంజిన్లలో కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇథనాల్ లో శక్తి సాంద్రత తక్కువగా ఉండటంతో, అదే పనితీరు కోసం ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. అందుకే పెద్ద ఇంధన ఇంజెక్టర్లు, అధిక సామర్థ్యం కలిగిన ఫ్యూయల్ పంపులు అమర్చాలి. ఇథనాల్ వల్ల తుప్పు పట్టే అవకాశం ఉండటంతో, ఫ్యూయల్ ట్యాంక్, పైపులు, సీల్స్ లాంటి భాగాలను ప్రత్యేక పదార్థాలతో తయారు చేయాలి. వాహనంలో ఇథనాల్ శాతాన్ని గుర్తించే ప్రత్యేక సెన్సార్ కూడా ఉంటుంది. ఇది ఇంధనంలోని ఇథనాల్ స్థాయిని గుర్తించి, ఇంజిన్ పనితీరును దానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది.
ఇథనాల్ ఇంధనాల వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. దేశం చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. ఇథనాల్ కు హై ఆక్టేన్ రేటింగ్ ఉండటంతో ఇంజిన్ పనితీరు మెరుగుపడే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా పెట్రోల్ తో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. దీంతో పర్యావరణానికి కూడా కొంత మేలు జరుగుతుంది.
ఇథనాల్ ఫ్యూయల్స్ లో కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మైలేజ్ తగ్గిపోతుంది. E85 ఉపయోగిస్తే పెట్రోల్ తో పోలిస్తే సుమారు 20 నుంచి 30 శాతం వరకు ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. E100లో ఈ తేడా మరింత ఎక్కువగా ఉండవచ్చు. అంటే వాహనదారులు తరచూ ఇంధనం నింపాల్సి ఉంటుంది.
ధర విషయానికి వస్తే, ప్రస్తుతం ఢిల్లీలో E85 ఇంధనం లీటరుకు సుమారు రూ.82 వరకు లభిస్తోంది. పెట్రోల్ కంటే దాదాపు రూ.20 తక్కువ. అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటంతో వాటి ధరలు సాధారణ మోడళ్ల కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో E85 ఫ్యూయల్ స్టేషన్లు పరిమిత సంఖ్యలో ఉన్నప్పటికీ, 2027 నాటికి ప్రధాన నగరాల్లో వేల సంఖ్యలో ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో E85, E100 ఇంధనాల వినియోగం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: ఇథనాల్ ఫ్యూయల్ వద్దట.. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!