ఫ్యూచర్ సిటీపై చెలరేగుతున్న రాజకీయ మంటలు ఇప్పుడప్పుడే ఆరేలా లేవు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై బీఆరెస్ గందరగోళం సృష్టించాలనుకుంటుకున్నది. జనాలను అయోమయానికి గురి చేయడం ద్వారా ప్రభుత్వం క్రెడిబిలిటీని దెబ్బ తీసి.. రావాల్సినంత ప్రతిష్ట రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నది. దీని కోసం రాజకీయంగా కయ్యానికి కాలు దువ్వుతున్నది. మొదట హరీశ్ దీనిపై వివాదస్పద కామెంట్స్ చేశారు మొన్న. మేము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించి కలకలం రేపారు. ఇదే అంశాన్ని కేటీఆర్ కూడా మీట్ ది ప్రెస్లో.. హరీశ్ ప్రకటనతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని ప్రకటించారు.
అది ఫ్యూచర్ సిటీ కాదని, అక్కడ ఫార్మా కంపెలీ కోసం భూములు సేకరించామని అన్నారు.ఈ విషయంలో కోర్టులో కూడా సర్కార్ అవును అక్కడ ఫార్మా కంపెనీలుంటాయని చెప్పి.. అవి రద్దు కాకుండా ఆపుకున్నదని, మరి ఏనాటికైనా అక్కడే ఫార్మాకంపెనీలు వస్తాయని వివరణ ఇచ్చారు. ఫార్మా కంపెనీల మధ్య జనాలు ఎలా నివసిస్తారని, పైగా జర్నలిస్టులకు కూడా అక్కడ ఓ 500 ఎకరాలు కేటాయిస్తామన్నారని, మీరు వెళ్తారా? అక్కడ ఉంటారా? అని మీడియానే ప్రశ్నించాడు కేటీఆర్. దీనిపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఫ్యూచరే లేని నాయకులు చెబితే వాటిని పట్టించుకోవద్దని జనాలను కోరారు. రద్దు చేస్తామంటే నమ్మొద్దని, వారే రద్దయిన నోట్లతో సమానమని జనంలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఫ్యూచర్ సిటీ భావితరాల బంగారు భవిష్యత్తుకు తోడ్పాటునందిస్తుందని, ఇక్కడి భూములు బంగారుమయం అవుతాయని స్పష్టం చేశారు. కానీ, ఇవాళ మళ్లీ దీనిపైనే మాట్లాడేందుకు హరీశ్ మీడియాతో చిట్ చాట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి దీనిపైనే మాట్లాడారు.
ప్రభుత్వాన్ని మరింత రెచ్చగొట్టేలా .. వందశాతం ఆ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. అక్కడ ఫార్మా కంపెనీ కోసం కేటాయించిన భూములను తిరిగి ప్రజలకు ఇప్పిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతో వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి గుంజుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కూడా ఈ ఫ్యూచర్ సిటీని లైట్గా తీసుకున్నారు. అది రియల్ ఎస్టేట్ దందా కోసం చేస్తున్న పనిగా అభివర్ణించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు.. పనిగట్టుకుని ఈ ముగ్గురూ దీనిపైనే పదే పదే మాట్లాడటం మూలంగా దీన్ని ముందుకు సాగనివ్వకుండా బ్రేకులు వేయాలని చూస్తున్నారనేది అందరికీ అర్థమవుతూనే ఉంది.
ఇదిప్పుడు మొన్నటి వరకు ఉన్న అమరావతి ఇష్యూలా మారింది. చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి అని అన్నీ పోగోసుకుంటున్న తరుణంలో.. జగన్ రావడం .. దాన్ని పడావు పెట్టడం.. తరువాత అక్కడ భూములు కొన్న వారు అయోమయంలో పడటం.. చూశారు జనం. ఆ తరువాత మళ్లీ చంద్రబాబు రావడం.. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రమే అధికారికంగా ఉత్తర్వులు వెలువర్చడంతో … ఈ వివాదానికి ఓ ముగింపు దొరికినట్టయ్యింది. అయినా జగన్ ఇంకా మావిగన్ అని.. కొత్త ప్రతిపాదనతో గందరగోళం సృష్టించే పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అచ్చంగా అమరావతి ఇష్యూలాగే మారింది ఫ్యూచర్ సిటీ పరిస్థితి. రేవంత్ ఎంత చెప్పినా.. దీన్ని తమ రాజకీయ మైలేజీ కోసం.. సర్కార్ను ఇరకాటంలో పెట్టడం కోసం పదే పదే ఉద్దేశ్యపూర్వకంగా ఫ్యూచర్ సిటీపై కామెంట్ చేస్తూ దాని ఫ్యూచర్పై నీలినీడలు అలుముకునేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది బీఆరెస్.