దేశంలోనే అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ భారత మార్కెట్ మీద మరింత దృష్టి పెట్టింది. ఇండియన్ మార్కెట్ లోకి సుమారు డజన్ కు పైగా కొత్త మోడల్స్ ను లాంచ్ చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ప్రీమియం బైక్లు, 125సీసీకి పైన మోడళ్లపై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. FY27 నాటికి 12కుపైగా కొత్త టూ వీలర్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. హీరో ప్రస్తుతం కమ్యూటర్ బైక్ల మార్కెట్లో టాప్ లో ఉన్నప్పటికీ, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త సెగ్మెంట్లలో తన ఉనికిని చాటుకోవాలని భావిస్తోంది.
ఈవీలపై ఎక్కువ పెట్టుబడి!
హీరో ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో విడా ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. 2026 చివరి నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని దాదాపు మూడు రెట్లు పెంచాలనే లక్ష్యంతో హీరో ముందుకు సాగుతోంది. అంతేకాదు, భవిష్యత్లో మొత్తం స్కూటర్ అమ్మకాలలో ఎలక్ట్రిక్ మోడళ్ల వాటా 50 శాతానికి పైగా చేరుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో EV రంగంలో మరింత దూకుడుగా విస్తరణ చేపడుతోంది. విడా రిటైల్, సర్వీస్ నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరిస్తూనే, స్థానిక తయారీపై కూడా హీరో దృష్టి సారిస్తోంది. స్థానికంగా ఎక్కువ భాగాలు తయారు చేయడం ద్వారా ఖర్చులు తగ్గించడంతో పాటు సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కంపెనీ భావిస్తోంది.
ఇక స్కూటర్ మార్కెట్లో జూమ్ శ్రేణిపై కూడా హీరో భారీ ఆశలు పెట్టుకుంది. స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని జూమ్, డెస్టినీ మోడళ్ల ఉత్పత్తిని పెంచాలాని భావిస్తోంది. భారత మార్కెట్లో ప్రస్తుతం స్కూటర్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. రాబోయే కొత్త మోడళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన బైక్లు కూడా ఉండే అవకాశం ఉంది. 125సీసీకి పైన ఉండే సెగ్మెంట్ తో పాటు ప్రీమియం మోటార్ సైకిల్ మార్కెట్ ను టార్గెట్ చేసుకుని పలు కొత్త మోడల్స్ ను తయారు చేస్తోంది.
అటు ఇప్పటికే హీరో మావ్రిక్ 440, హార్లీ-డేవిడ్సన్ X440 లాంటి మోడళ్లతో మిడిల్ వెయిట్ బైక్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరిన్ని కొత్త మోడళ్లతో ఈ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్, హోండా, బజాజ్, టీవీఎస్ లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో హీరో ముందుకు సాగుతోంది.
ఇక గత ఆర్థిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్ దాదాపు 55 లక్షల మోటార్ సైకిళ్లు, 5.7 లక్షలకు పైగా స్కూటర్లను అమ్మింది. కంపెనీ లాభాలు కూడా భారీగా పెరిగాయి. హీరో కొత్త మోడల్స్ అభివృద్ధి, EV టెక్నాలజీ, పరిశోధన, కొత్త మొబిలిటీ సొల్యూషన్స్ కోసం FY27లో సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది.
Read Also: హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులపై క్రేజీ ఆఫర్లు.. ఎన్ని వేలు డిస్కౌంట్ ఇస్తుందంటే!