India Opens Doors for Autonomous Vehicles: దేశంలో అత్యాధునిక వెహికల్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమోటివ్ రాడార్, కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీలకు సంబంధించిన కీలక లైసెన్సింగ్ నిబంధనలను సడలించింది. భవిష్యత్తులో మరింత సేఫ్టీ, స్మార్ట్, ఆటోమెటిక్ వెహికల్ అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. తాజా నిబంధనల ప్రకారం, 77GHz నుంచి 81GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో పనిచేసే ఆటోమోటివ్ రాడార్ వ్యవస్థలకు ఇకపై ప్రత్యేక లైసెన్స్ అవసరం ఉండదు. ఈ రాడార్ సిస్టమ్స్ లేటెస్ట్ కార్లలో ఉపయోగించే అనేక భద్రతా ఫీచర్లకు అనుకూలంగా ఉంటాయి.
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ లాంటి అత్యాధునిక డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థలు ఈ రాడార్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తాయి. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి ఆటోమేటిక్ వాహనాల అభివృద్ధిలో కూడా ఇవి కీలక పాత్ర పోషించబోతున్నాయి. అదే విధంగా, వెహికల్ టు ఎవ్రీథింగ్ (V2X) కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే 5.9GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కు కూడా ప్రభుత్వం లైసెన్సింగ్ మినహాయింపు ఇచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్, హైవే ఇన్ ఫ్రాస్టక్చర్ సమాచారాన్ని పంచుకుంటుంది.
డ్రైవర్లు ముందున్న ప్రమాదాల గురించి ముందుగానే హెచ్చరికలు పొందే అవకాశం ఉంటుంది. బ్లైండ్ టర్నింగ్స్ దగ్గర జరిగిన ప్రమాదాలు, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వేసిన వాహనాలు, దగ్గరలోని అంబులెన్స్ వివరాలు సహా అన్ని వాహనాలను సమాచారాన్ని డ్రైవర్ కు ముందుగానే అందించే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయంతో భారత్ అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో అమలవుతున్న ప్రమాణాలకు మరింత దగ్గరైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న సాంకేతికతలను భారత మార్కెట్లోకి తీసుకురావడం వాహన తయారీ సంస్థలకు ఈజీ కానుంది. అడిషనల్ ఛేంజెస్ అవసరం లేకపోవడం వల్ల తయారీ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది.
ఈ మార్పులతో మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ లాంటి లగ్జరీ కార్ల కంపెనీలు తమ అధునాతన భద్రతా ఫీచర్లను మరింత ఈజీగా అందించే అవకాశం ఉంటుంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా లాంటి ఇండియన్ కంపెనీలు కూడా సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండే కార్లలో ఈ టెక్నాలజీలని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇక బాష్, కాంటినెంటల్, క్వాల్ కామ్ లాంటి సాంకేతిక భాగాల తయారీ సంస్థలకు కూడా ఈ నిర్ణయం లాభదాయకంగా మారనుంది. రాడార్, కనెక్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థల డిమాండ్ పెరగడంతో ఈ రంగంలో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది.
దేశంలో ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, అత్యాధునిక భద్రతా సాంకేతికత ద్వారా ప్రమాదాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం దేశంలో సేఫ్, స్మార్ట్, భవిష్యత్ ఆటోమేటిక్ రవాణా వ్యవస్థల అభివృద్ధికి కీలక మైలురాయిగా మారనున్నాయి.
Read Also: ఒకటి కాదు ఏకంగా నాలుగు డస్టర్లు వచ్చేస్తున్నాయ్.. రెనాల్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!