Top 5 EV Scooter Brands in India 2026: భారత్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. జూన్ 2026కు సంబంధించిన తాజాగా సేల్స్ రిపోర్టు విడుదల అయ్యింది. దేశంలో మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా తొలిసారిగా 10 శాతాన్ని దాటింది. భారతీయులు పెట్రోల్ వాహనాల నుంచి క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన టాప్ 5 ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మొదటి స్థానంలో టీవీఎస్ మోటార్ నిలిచింది. కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా కొనసాగుతోంది. జూన్ నెలలో టీవీఎస్ మొత్తం 46,999 యూనిట్లను విక్రయించి దాదాపు 24 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. నమ్మకం, మంచి రేంజ్, విస్తృతమైన సర్వీస్ నెట్ వర్క్ ఈ సక్సెస్ కు కారణాలుగా చెప్పుకోవచ్చు.
రెండో స్థానాన్ని బజాజ్ ఆటో దక్కించుకుంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్కు పెరుగుతున్న ఆదరణతో కంపెనీ జూన్లో 43,234 యూనిట్లను అమ్మింది. దీంతో 22 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. చేతక్ ను పలు వేరియంట్లలో అందించడం కూడా అమ్మకాలకు తోడ్పడింది.
మూడో స్థానంలో బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ నిలిచింది. కంపెనీ జూన్ నెలలో 31,188 యూనిట్లను విక్రయించి 16 శాతం మార్కెట్ వాటాను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 95 శాతం వృద్ధిని సాధించింది. ఆధునిక టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లు, వేగవంతమైన పనితీరు ఈ బ్రాండ్కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
నాలుగో స్థానంలో హీరో విడా ఉంది. హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడా బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. జూన్ 2026లో కంపెనీ 21,792 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 175 శాతం వృద్ధి. ఈ ఫలితంతో హీరో విడా మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
ఐదో స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. ఒకప్పుడు ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఓలా ప్రస్తుతం 16,144 యూనిట్ల అమ్మకాలతో 8 శాతం మార్కెట్ వాటాను సాధించింది. అయినప్పటికీ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు రోడ్ స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను కూడా అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది.
Read Also: మారుతి బంపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.90 వేల డిస్కౌంట్!