400+ Festival Special Trains: పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలో జరిగే ప్రముఖ జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లు, కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా 100కు పైగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు భక్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా గమ్యస్థానాలకు చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది సమ్మర్ సీజన్లో కూడా భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. జూన్ 30తో ముగిసిన సమ్మర్ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 15,000 ప్రత్యేక రైళ్లు నడపడం రికార్డు అన్నారు. ఇదే తరహాలో పండుగల సమయంలో కూడా అదనపు రైళ్లను నడిపి ప్రయాణికుల రద్దీని తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. జగన్నాథ రథయాత్ర కోసం 300కుపైగా ప్రత్యేక రైళ్లు, ఓనం పండుగ కోసం 100కు పైగా ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. సురక్షితమైన, అందుబాటు ధరల్లో ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ రైళ్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు.
భువనేశ్వర్లోని రైల్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వైష్ణవ్ పలు కొత్త రైలు సర్వీసులను ప్రారంభించారు. ఇందులో నాందేడ్–ముంబై ఎక్స్ప్రెస్, తానక్పూర్–నాందేడ్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపడంతో పాటు, తానక్పూర్–పిలిభిత్ రైలు సేవను షాజహాన్పూర్ వరకు పొడిగించారు. కొత్తగా ప్రారంభించిన రైలు సర్వీసులు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లోని సిక్కు సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడతాయన్నారు. ముఖ్యంగా తానక్పూర్ నుంచి నాందేడ్ హజూర్ సాహిబ్ వరకు నేరుగా రైలు నడపాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని, ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందన్నారు. సిక్కు భక్తులు తమ పవిత్ర క్షేత్రాలకు సులభంగా చేరుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఖతిమా, బన్ బాసా స్టేషన్లలో ఈ రైళ్లకు స్టాప్ ఇవ్వాలన్న ప్రజల విజ్ఞప్తులను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
నాందేడ్–ముంబై ఎక్స్ప్రెస్ వల్ల వాషిమ్, హింగోలి, బస్మత్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ లభిస్తుందని వైష్ణవ్ తెలిపారు. విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల ప్రయాణికులకు కూడా ఈ కొత్త సేవ ఉపయోగపడుతుందని చెప్పారు. అదేవిధంగా తానక్పూర్–పిలిభిత్ రైలు సేవను షాజహాన్పూర్ వరకు పొడిగించడం వల్ల మరింత మంది ప్రయాణికులకు లాభం కలుగుతుందన్నారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన తానక్పూర్–ఆగ్రా సర్వీసును కూడా ఇప్పుడు శాశ్వత సర్వీసుగా మార్చినట్లు వెల్లడించారు.
Read Also: ఈ రైల్వే స్టేషన్ల పేర్లు వింటే నవ్వు ఆపుకోలేరు.. ఇంతకీ అవేంటో తెలుసా?