ఇప్పుడు కాళేశ్వరం లొల్లి మళ్లీ తెరపైకి వచ్చింది. కరువు ముంచుకొస్తున్న నేపథ్యాన్ని తెరపైకి తెచ్చిన కేటీఆర్.. కన్నెపల్లి పంప్హౌజ్ వద్ద మోటార్లు ఆన్చేయాలని, దాని ద్వారా 150 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చనే వాదనను బలంగా వినిపిస్తున్నాడు. మేడిగడ్డ సందర్శనకు వెళ్లేక్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
అయితే ఈ విషయంలో తాము రైతుల పక్షాన ఉన్నామని, కాంగ్రెస్ సర్కార్ ..కావాలనే రాజకీయం కోసం కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేయకుండా.. రైతుల పట్ల కక్షసాధింపు దోరణితో ఉందనే విధంగా తమను తాము ప్రొజెక్టు చేసుకుంటూ వస్తున్నది. అంతేకాదు.. రేవంత్తో చాతకాకపోతే చెప్పండి.. కేసీఆర్కు ఓ వారం రోజులు సీఎంను చేయండి.. ఆయనే అన్నీ చేసి చూపిస్తాడు. ఆ తరువాత సీఎంగా మీరే ఉందురుగానీ, అంటూ రేవంత్కు సవాల్ విసరడం కూడా రాజకీయంగా దుమారం రేపుతోంది.
మొన్నటి దాకా కాళేశ్వరం కూలేశ్వరమైందని, కేసీఆర్ను రైతు ద్రోహిగా చిత్రీకరించే పనిలో సక్సెసవుతూ వస్తున్న రేవంత్కు.. ఇది రివర్స్ గేర్లా మారింది. బీఆరెస్ వ్యూహం కూడా అదే. ఇంకెన్ని రోజులు కాళేశ్వరం పేరుతో తమను దోషులుగా నిలబెడతారనే కోపంతో ఉన్న బీఆరెస్కు.. ఎల్నినో మంచి అవకాశం ఇచ్చింది. అందుకే దాని పేరు చెప్పుకుని ఇలా కన్నెపల్లి పంప్హౌజ్ నింపడం.. తద్వారా కాళేశ్వరానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, ఇది కావాలనే రేవంత్ చేసే రాజకీయ స్టంట్ అని జనాలకు చెప్పడం కేటీఆర్ వ్యూహంగా ఉంది.
అందుకే ఈ వ్యూహానికి మరింత పదును పెట్టేందుకు కేసీఆర్ను ఓ వారం రోజులు సీఎంగా చేసి చూడండి.. అనే సరికొత్త ప్రతిపాదనను కూడా వేదికపైకి తెచ్చారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక మంత్రులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. కానీ ఇవాళ మహేశ్ కుమార్ గౌడ్ దీన్ని మంచిగానే తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. కేసీఆర్లా మేము సగం ఇంజినీర్లం కాదని ఎద్దేవా చేశాడు. వాస్తవానికి, కాళేశ్వరం నిర్మాణం, డిజైన్లలో కేసీఆర్దే ప్రధాన పాత్రగా ఉంది.
చాలా బహిరంగ వేదికల మీద ఆయనే ఈ విషయం ఒప్పుకున్నాడు. తనో సగం ఇంజినీర్ను అయ్యానని. అందుకే ఈ పదాన్ని ఇప్పుడు మహేశ్ కుమార్ బయటకు తీశాడు. అలా సగం ఇంజినీర్ చేసిన చేష్టల వల్లే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగాయన్నది అతని విమర్శకు బలాన్ని ఇస్తోంది. మేం మీలా ఆగం ఆగం చేయం.. మీరలా చేసే ఇలా అయ్యింది..!అని గతంలో తప్పులు తోడటంతో పాటు.. కన్నెపల్లిలో నీళ్లు నింపితే ప్రాజెక్టు ఉంటుందా? ఆ విషయం నీకు తెలియదా? అని ఉల్టా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నాడు మహేశ్.
అయితే ఇందులో కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నమే ఎక్కువగా జరుగుతున్నది. ఎందుకంటే.. ఎట్లాగూ కన్నెపల్లి వద్ద సర్కార్ మోటార్లను ఆన్ చేయదు. అప్పుడు ఎల్నినో ప్రభావంతో పంటలు ఎండితే రేవంత్ను విలన్గా చూపే ప్రయత్నం చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నాడు కేటీఆర్.
అదే జరిగేలా ఉంది. ఎందుకంటే కరువు, కరువు అంటున్నా.. వర్షాలు మాత్రం పలకరించుకుంటూ పోతున్నాయి. దీంతో రైతు కరువు మాటను పక్కనబెట్టి వరి నార్లు విరివిగా వేసుకోవడానికే సన్నద్దమయ్యాడు. దీంతో ఈసారి గతంలో కన్నా ఎక్కువ వరిసాగు విస్తీర్ణంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇదే జరిగితే సర్కార్కే పెద్ద తలనొప్పి అన్ని విధాలుగా.