Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదవుల పంపకాల పంచాయతీలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్రాంతానికే పదవులను కట్టబెడుతుందని..మరో ప్రాంతం వారు గుర్రుగా ఉన్నారట. అనుకున్న పదవి రాలేదని ఓ ఎమ్మెల్యే అలక భూనితే.. సీఎంకు ముఖ్య అనుచరుడైనా..పదవి యోగం లేకపోవడంతో ఓ ఎమ్మెల్యేకు నిరాశ కలిగిస్తుందట. ఇంతకీ ఆ ప్రాంతాలు ఏంటి..? ఆ ఎమ్మెల్యే ఎవరు..?
ఆదివాసీల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీలో మళ్లీ అలజడి రేగుతోంది. పదవుల కోసం ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అధిష్టానం వివక్ష చూపిస్తోందంటూ..కొందరు ఎమ్మెల్యేలు.. పార్టీ పెద్దలపై కారాలు మిరియాలు నూరుతున్నారట. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో..తమకు మంత్రి పదవులు, ప్రభుత్వంలో ఉన్నత పదవులు వస్తాయని ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని టాక్.
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పదవుల పంపకాల విషయంలో తేడాలు వస్తున్నాయని బొజ్జు..గరం గరం అవుతున్నారట. కాంగ్రెస్ పెద్దలు ..అదిలాబాద్ తూర్పు జిల్లాపై ప్రేమ కురిపిస్తూ.. పశ్చిమ జిల్లాను అసలు పట్టించుకోవడంలేదని అభిప్రాయాలు అక్కడి కాంగ్రెస్ వర్గాల్లోనూ నెలకొన్నట్లు సమాచారం. తూర్పు జిల్లాలో ఉన్న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే అవకాశాలు ఇస్తున్నారని.. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పశ్చిమ జిల్లాను పూర్తిగా విస్మరిస్తున్నారని హస్తం శ్రేణులు అసంతృప్తి వ్యక్తమవుతున్నాయట.
2023 ఎన్నిల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు ప్రాంతంలో మూడు ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ..చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ప్రేమ్ సాగర్రావు అధిష్టానంపై అలకభూనారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలే వచ్చిన ఆయన్ను భుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావుకు సివిల్ సప్లై శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చి చల్లబరిచారు. అయినా కూడా తను అనుకున్న పదవి రాకపోవడంతో..ప్రేమ్ సాగర్రావు అధిష్టానంపై ఇంకా అసంతృప్తితోనే ఉన్నారట.
ఇక పశ్చిమ జిల్లా నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారట. ఆదివాసి కోటాలో తన పేరు పరిశీలించాలని ఇప్పటికే తన మనసులో మాటను అధిష్టానం ముందు ఉంచారంట. దీనికి తోడు బొజ్జు పటేల్కు సీఎం సన్నిహితుడనే పేరుంది. దీంతో రెండో దశ విస్తరణలో ఖచ్చితంగా బొజ్జు పటేల్ పేరుంటుందని ..పశ్చిమ జిల్లా కార్యకర్తలు తెగ ఆశపడ్డారట. అయితే జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామి పేరు ప్రకటించడంతో…ఒక్కసారిగా బొజ్జు పటేల్, కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారట. అయితే మంత్రి పదవి దక్కకపోయినా కనీసం ప్రభుత్వ విప్ పదవి వస్తుందని బొజ్జు పటేల్ ఆశించారట. కానీ బొజ్జు పటేల్కు షాకిస్తూ…అధిష్టానం ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.
మంత్రి పదవి వస్తుందనుకుంటే రాలేదు..పోనీ..విప్ అయినా చేస్తారని ఆశిస్తే..అదీ దక్కలేదు. చివరకు డీసీసీతో సరిపెట్టడంతో…ఎమ్మెల్యే బొజ్జు పటేల్..ఆయన అనుచరులు..కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన వివేక్కు మంత్రి పదవి ఇచ్చి…కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసి బొజ్జు పటేల్ను విస్మరించడమేంటని రుసరుసలాడుతున్నారట. జిల్లాలో రెండు కీలక పదవులు..తూర్పు ప్రాంతానికి కేటాయించి..పశ్చిమానికి మొండిచేయి చూపించారని అక్కడి కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Story by Kishan, Big Tv