AI Warfare: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా AI గురించే చర్చ. మనుషులు గంటలు, రోజుల పాటు చేసే పనులను క్షణాల్లో చేసి పెడుతుంది AI. ఇప్పుడ టెక్నాలజీ కదనరంగంలోకి వచ్చేసింది. ఇప్పటికే రణరంగం రూపురేఖలను మార్చేసింది AI. అలాంటి AI టెక్నాలజీని అందిపుచ్చుకుంది ఇండియన్ ఆర్మీ. సరికొత్త AI పాలసీని తీసుకొచ్చి మరీ ఇండియన్ ఆర్మీలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇండియన్ ఆర్మీ AI పాలసీపై ఒక్కసారి ఫోకస్ చేస్తే దానిలో చాలా కీలక విషయాలు ఉన్నాయనేది అర్థమవుతోంది. లీథల్ అటానమస్ వెపన్స్ సిస్టమ్స్కు రంగం సిద్ధం చేసింది కొత్త AI పాలసీ. AI పాలసీ బ్రెయిన్ అయితే.. LAWS అనేది శరీరం లాంటిదని చెప్పవచ్చు. ఇండియన్ ఆర్మీలో AIని ఎలా వాడాలి.. ఎలా డేటాను అనలైజ్ చేయాలనేది ఇప్పుడు తేల్చేసింది ఇండియన్ ఆర్మీ.
నిజానికి LAWS అనేది ఒక గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. ఇవి ప్రత్యేక రకమైన ఆయుధాలు. మనుషులతో ప్రమేయం ఉండదు. శత్రువులను, లక్ష్యాలను సొంతంగా ఐడెంటిఫై చేయగలవు.. సొంతంగానే వాటిపై దాడి చేయగలవు. ఇప్పుడు ఇలాంటి ఆయుధాలను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తుంది. మనుషుల అవసరం లేకుండానే యుద్ధ క్షేత్రంలోకి వెళ్లి నిఘా ఉంచడం.. అవసరమైతే దాడులు చేసే ఆయుధాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో కిల్లర్ రోబోట్స్, అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఉన్నాయి. హైరిస్క్ ఏరియాల్లో సైనికులను రోబోలతో రిప్లేస్ చేసే అవకాశం ఉంది. సరిహద్దుల్లో కూడా అవసరమైన చోట్లలో ఈ రోబోలను మోహరించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
అంతేకాదు అన్మ్యాన్డ్ కాంబాట్ ఆపరేషన్స్ను నిర్వహించే టైమ్లను సిద్ధం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్లో కూడా AI వాడాకాన్ని పెంచే పనిలో ఉన్నారు. ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రా రెడ్ ఇమెజనరీ, రాడార్, సోనార్, స్పేస్ బేస్డ్ ఫీడ్.. ఇలా అన్నింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేలా AIని డెవలప్ చేస్తున్నారు. రియల్ టైమ్లో శాటిలైట్ ఇమేజ్లను, UAV ఫీడ్ను అనలైజ్ చేస్తూ పక్కా డేటాను కమాండర్లకు అందించనుంది ఈ AI సిస్టమ్. ప్రస్తుతం జరుగుతున్న యుద్దాలను చూసిన తర్వాత డ్రోన్ టెక్నాలజీ డెవలప్మెంట్పై మరింత ఫోకస్ చేయనుంది ఇండియన్ ఆర్మీ. ముఖ్యంగా స్వార్మ్ డ్రోన్లను డెవలప్ చేయడంపై ఫోకస్ చేసింది. అటానమస్ ట్యాంకులు, మ్యూల్స్ అంటే మనుషులు లేకుండా యుద్ధ క్షేత్రంలోకి వెళ్లి నిఘా పెట్టే లేదా కాల్పులు జరిపే రోబోటిక్ వాహనాలను డెవలప్ చేయనున్నారు. అంతేకాదు సరిహద్దుల్లో చొరబాటుదారులను గుర్తించి ఆటోమేటిక్గా హెచ్చరించమో.. లేదా కాల్పులు జరిపే సెంట్రీ గన్స్ను డెవలప్ చేయనున్నారు.
అయితే AIకి పూర్తిగా కంట్రోల్ ఇచ్చేస్తే ప్రమాదం కాదా? అనే ప్రశ్నను తనకు తానే వేసుకుంటుంది ఇండియన్ ఆర్మీ. అందుకే హ్యూమన్ ఇన్ ది లూప్ విధానాన్ని అనుసరిస్తోంది. అంటే ఆయుధం లక్ష్యాన్ని గుర్తించినప్పటికీ, కాల్పులు జరపాలా వద్దా అనే తుది నిర్ణయం మనిషి చేతిలోనే ఉండాలనేది ఆలోచన. దీనివల్ల పొరపాట్లు జరగకుండా చూడవచ్చు.
ఆర్మీలో AI టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కింద ప్రత్యేక నిపుణులతో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అంతేకాదు సైన్యం కోసం ప్రత్యేకంగా ఒక AI ల్యాబ్ను ఏర్పాటు చేసి, కొత్త పరికరాలన్నింటిలోనూ AI ఫీచర్లు ఉండేలా నిబంధనలు మార్చారు. ఇండియన్ ఆర్మీలో AIని అడాప్షన్ చేసుకునే విధానాన్ని పర్యవేక్షించే బాధ్యత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ హెడ్క్వార్టర్స్కు అప్పగించారు. AI స్ట్రాటజీని సిద్ధం చేసే బాధ్యత CDS నేరుగా పర్యవేక్షిస్తారు. ఇప్పటికే డైరెక్టరేట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రతి ఏడాది 400 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
నిజానికి ఇండియన్ ఆర్మీలోకి రోబోల ఎంట్రీ ఓ గేమ్ ఛేంజర్ అని చెప్పాలి. భూమికి 20వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్లాంటి హిమాలయ పర్వతప్రాంతాల్లోని కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లోకి వాహనాలుకానీ, హెలికాప్టర్లు కానీ చేరుకోలేవు. ఇక్కడ యుద్ధం చేయడం కాదు.. బతికుండటానికే పోరాటం చేయాలి. ఇలాంటి ప్రాంతాల్లో పనులు చేయడంతో పాటు.. యుద్ధం చేసేందుకు మ్యూల్ను సిద్ధం చేస్తున్నారు. మ్యూల్ అంటే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అని అర్థం. ఇవి చూడ్డానికి నాలుగు కాళ్లతో ఉండి… కుక్కలని పోలిన రోబోలు. ఏఐతో పని చేస్తాయి. మైనస్ 40 డిగ్రీల చలి నుంచి 50 డిగ్రీల ఎండవరకూ ఎలాంటి కఠినమైన వాతావరణాన్నైనా తట్టుకుంటాయి. ఇప్పటికే వీటిని కొన్ని ప్రాంతాల్లో మోహరించారు కూడా. నిటారుగా ఉండే పర్వతాలైనా, వేగంగా ప్రవహించే నదులైనా.., అగ్ని ప్రమాదాలూ ఇలా ఏవీ కూడా వీటిని అడ్డుకోలేవు. మందుపాతరలని ముందుగానే పసిగట్టేందుకు వీటి దగ్గర ప్రత్యేకమైన సెన్సర్లూ, థెర్మల్ కెమెరాలూ ఉంటాయి. ఇది మొదటి అడుగు మాత్రమే.. ఇంకా ఇలాంటి మార్పులు చాలా ఉంటాయని చెబుతోంది ఇండియన్ ఆర్మీ.
యుద్ధక్షేత్రంలో ఏఐని బ్యాంక్ ఎండ్ టూల్గా వాడటం పాత పద్ధతి. ఇప్పుడు ఫ్రంట్ లైన్స్లో కూడా తన సత్తా చాటుతుంది ఏఐ. టార్గెట్లను గుర్తించడం.. ఇంటెలిజెన్స్ను సేకరించడం, అనలైజ్ చేయడం.. మిషన్ను ప్లాన్ చేయడం ఇప్పుడు కామన్గా మారిపోయింది. ఉక్రెయిన్ వార్ నుంచి మొదలు పెడితె.. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం వరకు ఇది ప్రూవ్ అయ్యింది.
ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం తెలుసుకోవాలి. 2024లో ప్రపంచంలోని అన్ని దేశాల బడ్జెట్లను గమనిస్తే.. వాటి రక్షణరంగ బడ్జెట్కే 2.7 ట్రిలియన్ డాలర్లు కేటాయించాయి. ఇది అంతకుముందు బడ్జెట్తో పోలిస్తే 9.4 శాతం ఎక్కువ. కోల్డ్ వార్ నాటి పరిస్థితుల తర్వాత ఈ స్థాయి పెంపు ఇదే తొలిసార. ఇక 2015 నుంచి 2024 మధ్య బడ్జెట్లను పరిశీలిస్తే.. ఏకంగా 37 శాతం బడ్జెట్లను పెంచేశాయి ఆయా దేశాలు. ఇందులో ఎక్కువ శాతం AIతో పనిచేసే వెపన్స్, సైబర్ వార్ఫేర్ సిస్టమ్స్, శాటిలైట్ లేదా సొంతంగా పనిచేసే డ్రోన్స్ కోసం ఖర్చు చేశాయి.
ఇలా ఏఐపై ఎక్కువ ఖర్చు చేసే దేశాల్లో అమెరికానే టాప్ ప్లేస్లో ఉంది. అమెరికా 997 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఆ దేశ జీడీపీలో ఇది 3.40 శాతం. ఇందులో 384 బిలియన్ డాలర్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తుంది. ఇందులో 9.8 బిలియన్ డాలర్లు అటానమస్, అన్మ్యాన్డ్ సిస్టమ్స్ కోసమే ఖర్చు చేస్తుంది. ఇక సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. చైనా కూడా తన రక్షణరంగం కోసం 314 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చైనా 2024లో ఆర్ అండ్ డీ కోసం ఏకంగా 785 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఇది అమెరికా కంటే చాలా ఎక్కువ.
రష్యా కూడా తన డిఫెన్స్ బడ్జెట్ను గణనీయంగా పెంచింది. ఏకంగా 149 బిలియన్ డాలర్లను కేటాయించింది. అమెరికా, చైనాతో పోల్చితే తక్కువే కానీ.. జీడీపీ పరంగా చూస్తే అన్ని దేశాల కంటే ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ఆరు నుంచి 7 శాతం నిధులను రక్షణ రంగానికే కేటాయిస్తుంది రష్యా. అంతేకాదు రక్షణరంగంలో కొత్త టెక్నాలజీని తీసుకురావడం, AI డెవలప్మెంట్ కోసం పదేళ్ల ప్రణాళికను రచించి అమలు చేస్తోంది రష్యా. ఇక ఇండియా విషయానికి వస్తే.. 93.5 బిలియన్ డాలర్లను రక్షణరంగానికి కేటాయించింది. ఇందులో 29 వేల 100 కోట్లను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు కేటాయించింది. ముఖ్యంగా సుదర్షన్ చక్ర పేరుతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను రూపొందిస్తోంది. ఇండియన్ నేవీ, DRDO సంయుక్తంగా ఈ వ్యవస్థను డెవలప్ చేస్తున్నాయి.
నిజానికి అన్ని దేశాలు AI ప్రాముఖ్యతను తెలుసుకున్నాయి. అందుకే కోట్లాది రూపాయలను ఈ టెక్నాలజీ కోసం కుమ్మరిస్తున్నాయి. కానీ ఈ విషయంలో అమెరికా ఓ అడుగు ముందుకేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అనేక యుద్ధాల్లో ఈ టెక్నాలజీని సక్సెస్ఫుల్గా అమలు చేసి సక్సెస్ కూడా అయ్యింది. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో అనేక AI వ్యవస్థలను ఉపయోగించింది. ది గాస్పెల్ పేరుతో ఓ ఆటోమెటిక్ టార్గెట్ సిస్టమ్ను రూపొందించింది. ఈ సిస్టమ్ టార్గెట్లను 50 రెట్లు వేగంగా గుర్తిస్తాయి. ఇక లావెండర్ పేరుతో అనుమానితులను గుర్తించే వ్యవస్థ ఒకటి.. మిలటరీ ఆపరేటర్లను గుర్తించే ట్రాకింగ్ టూల్స్.. డ్రోన్లను గుర్తించి కూల్చేసే AI పవర్ గన్లను ఈ యుద్ధంలో ఉపయోగించారు.
ఉక్రెయిన్ రష్యా వార్లో కూడా AIని గట్టిగానే వాడారు. రష్యన్ జీపీఎస్ సిస్టమ్ను జామ్ చేసి దాడులు చేసే ఆటనమస్ డ్రోన్లను ఉపయోగించారు. అంతేకాదు.. అన్క్రూడ్ గ్రౌండ్ వెహికల్స్ను కూడా ఈ యుద్ధంలో ఉపయోగించారు. యుద్ధం చేసే సైనికులకు కావాల్సిన ఆయుధాలు అందించడం.. సైనికులను సురక్షితంగా చేరవేయడం.. కొన్ని సార్లు నేరుగా యుద్ధం చేయడం కూడా చేశాయి. అంతేకాదు శాటిలైట్లు, డ్రోన్లు, గ్రౌండ్ రిపోర్ట్లను అనలైజ్ చేసి రియల్ టైమ్ టార్గెట్ల డేటాను కమాండర్లకు అందించే డేల్టా సిస్టమ్ కూడా సక్సెస్ఫుల్గా పనిచేసింది. లెటెస్ట్గా వెనిజుయెలాపై అమెరికా చేసిన ఆపరేషన్లో కూడా ఏఐ కీలకపాత్ర పోషించింది. అంత్రోపిక్ తీసుకొచ్చిన క్లాడ్ AIని ఉపయోగించింది అమెరికన్ ఆర్మీ. ఈ సిస్టమ్ ద్వారానే నికోలస్ మదురోను అతి తక్కువ టైమ్లో కిడ్నాప్ చేయగలిగింది అమెరికా.
ఇక ఇరాన్ వార్లో కూడా ప్రాజెక్ట్ మావెన్, క్లాడ్ AI కీలక పాత్ర పోషించిందని తేలింది. ఒకే వారంలో అమెరికా 3 వేల టార్గెట్లను నాశనం చేయడంలో AIది కీలకపాత్ర. AIతో రణరంగంలో పైచేయి సాధించింది అమెరికా. చాలా దేశాలు ఇంకా డెవలప్ చేసే పనిలో ఉండగానే కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికే అమలు కూడా చేసేస్తున్నాయి.
Also Read: శ్రీరామనవమి రోజే ‘జాగృతి’ జెండా.. కవిత కొత్త ప్రయాణం వెనుక అసలు కథ ఇదే!
Story by: Anup, Big Tv