YSRCP Strategy: ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్దత అంశం ఢిల్లీకి చేరింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి రాజముద్ర వేసేలా కేంద్రం చట్టం చేయనుంది. ఏపీ అసెంబ్లీ వేదికగా రాజధాని చట్టబద్దత తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు ముఖం చాటేశారు. సదరు కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమెదించి హుటాహుటిన కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇలా తరుణంలో పార్లమెంట్ వేదికగా జరిగే చర్చలో, రాజధాని అమరావతిపై వైసీపీ ఎలాంటి వైఖరిని అవలంభిస్తుందనేది హాట్ టాపిక్గా మారింది.
అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం. అయితే సభకు వైసీపీ హాజరుకాకపోవడం…మొత్తం కూటమి ఎమ్మెల్యేలే ఉండడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రాష్ట్ర రాజధాని అంశంపై చేసే తీర్మానానికి, అనుకూలమా, ప్రతికూలమా అన్నది వెల్లడించకుండా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది సభకు గైర్హాజరయ్యారు. వైసీపీ పార్టీ పరంగా తన స్టాండ్ ప్రకటించలేదు కాని, ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి తాము వ్యతిరేకం కాదని ఎప్పటిలాగే మీడియా ముందుకొచ్చి చెప్పి వెళ్లారు.
మరోవైపు వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజా వంటి వారు అమరావతిపై వ్యతిరేకత లేదంటూనే.. అసలు ఇంత హడావుడిగా తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం అంటే శాసనమండలిలో కూడా చర్చ జరగాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. అలా ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నేతలు అమరావతి విషయంలో పార్టీ స్టాండ్ ఏంటో అంతుపట్టకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడేస్తున్నారు.
అంతేకాని వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్తో సహా ఎవరూ రాజధాని చట్టబద్దత తీర్మానంపై నోరు మెదపడం లేదు. నెగ్గిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి చెబితేనే చట్టబద్ధంగా పార్టీ స్టాండ్ ఏంటన్నది స్పష్టమవుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఆసెంబ్లీలో ఆమోదించిన రాజధాని తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఏప్రిల్ 1న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి…ఆమోదించే అవకాశం ఉందని మంత్రి నారాలోకేశ్ వెల్లడించారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత…ఈ వారంలోనే కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు.
కేంద్రం కేబినెట్ ఆమోదం తర్వాత ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతుంది. దీంతో పార్లమెంట్ వేదికగా మరోసారి ఏపీ రాజధాని అంశంపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో జరిగిన చర్చకు దూరంగా ఉన్న వైసీపీ, పార్లమెంటులో ఏం చేయబోతుందనేది చర్చినీయంశంగా మారింది. లోక్ సభలో వైసీపీకి నలుగురు, రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఆ రెండు సభలలోనూ అమరావతి రాజధాని మీద కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లును ఆమోదించాల్సి ఉంది. మరి అప్పుడైనా వైసీపీ తన స్టాండ్ ఏమిటో చెబుతుందా లేదా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతి బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని అంటున్నారు. దాని కోసం ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణ చేయాలి. ఉమ్మడి రాజధాని అన్న చోట ఏపీ అసెంబ్లీ తీర్మానించినట్లు అమరావతి అని పేర్కొనాలి. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా విభజన చట్ట సవరించి ప్రవేశపెట్టే బిల్లు, ఉభయ సభల ముందుకు వస్తుంది.
రాష్ట్రానికి సంబంధించిన కీలమైన రాజధాని విషయంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీ రాకపోవడంపై కూటమి పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే తీవ్ర విమర్శలు గుప్పించారు. 2019లో వైసీపీ శాసనసభ్యులుగా ఎన్నికై…ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు….రాజధాని విషయంలో వైసీపీ విధానంపై ఆరోపణలు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలతో జగన్ నివాసంలో జరిగిన సమావేశంలోనే తాను 3 రాజధానులను వ్యతిరేకించానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సభముఖంగానే పేర్కొన్నారు.. మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడాలని తనపై అనేకమార్లు వైసీపీ పెద్దలు ఒత్తిడి తేచ్చారని వసంత వెల్లడించారు..
దీంతో రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరి మారలేదని స్ఫష్టమైందంటున్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదు అంటున్న వైసీపీ నేతలు … అదే పార్టీ స్టాండ్ అయినప్పుడు, నేరుగా అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు తెలపడమో? లేదా తమ అభ్యంతరాలను వ్యక్తం చేసి ఉంటే.. రాజకీయంగా సరైన వ్యూహం అనుసరించినట్లు అయ్యేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సభకు గైర్హాజరు కావడమే విమర్శలకు తావిస్తోందని అంటున్నారు. వైసీపీ అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో అమరావతికి చట్టబద్ధత కల్పించే క్రెడిట్ మొత్తం కూటమి ప్రభుత్వానికి దక్కిందనేది పొలిటకల్ సర్కిల్స్లో నడుస్తున్న చర్చ. అసెంబ్లీకి రాకుండా వైసీపీ మౌనంగా ఉండటంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లి, ముఖ్యంగా రాజధానికి భూములిచ్చిన రైతుల్లో వ్యతిరేకత మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది.
అదలా ఉంటే వైసీపీ తన వైఖరిని పార్లమెంట్ వేదికగా అయినా స్పష్టం చేస్తుందా? … పార్టీ స్టాండ్ ఏంటో వైసీపీ ఎంపీలు వెల్లడిస్తారా? … లేకపోతే వారు కూడా చర్చలో పాల్గొనకుండా ముఖం చాటేస్తారా? అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే లోక్సభలో కేంద్రం బిల్లును ప్రవేశపెడితే…వైసీపీ చర్చలో పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని…కానీ రాజధాని పేరుతో జరిగే దోపిడికి పూర్తి వ్యతిరేకమని వైసీపీ వాదిస్తోంది. అసెంబ్లీ తీర్మానం చేసిన సందర్భంలోనే…సభ బయట వైసీపీ వాదనను ప్రెస్మీట్ల ద్వారా ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అదే వాదనను లోక్సభలో వినిపించి, జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పేరిట కూటమి ప్రభుత్వం భూ దందాలకు పాల్పండుతోందన్న ఆరోపణలను పార్లమెంట్ ముందు పెట్టవచ్చని అంటున్నారు.
ఆ విధంగా వైసీపీ తాము అమరావతికి అనుకూలం అంటూనే కూటమి ప్రభుత్వం అక్కడ అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని పార్టమెంట్ వేదికగా హైలెట్ చేయడానికి వైసీపీ రెడీ అయిందంట. మొత్తంగా రాజధాని అమరావతి విషయంలో మరోసారి వైసీపీ డిఫెన్స్ పడిన నేపధ్యంలో.. పార్లమెంటు వారి వాయిస్ ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.
Story by: Apparao, Big Tv