Ambati Rambabu: రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే రెండు కేసుల్లో బెయిల్ మంజూరైన అంబటి మరి కొద్ది గంటల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అవుతారనుకున్న తరుణంలో ఆయనపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. దాంతో ఆయన్ని పోలీసులు గురువారం తిరిగి కోర్టులో హాజరు పర్చనున్నారు. ఆయన విడుదల అవుతారని అనుచరులు గుంటూరులో అనుచరులు సంబరాలు చేసుకుంటున్న తరుణంలోనే మరో పీటీ వారెంట్ దాఖలు చేయడం గమనార్హం. దీంతో అంబటి విడుదల మరింత జాప్యం అయ్యే అవకాశముందంటున్నారు.
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుని అనుచిత పదజాలంతో దుర్భాషలాడి, పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో అంబటి రాంబాబు ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కేసులో ఆయనకు కండీషనల్ బెయిల్ లభించింది. ఇంతలోనే మరో కేసులో కూడా పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన అంబటి.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని వెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దానిపై పోలీసులు వేసిన పీటీ వారెంట్ను కోర్టు కొట్టి వేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్నూ కొట్టివేసి ఆ కేసులోనూ న్యాయస్ధానం బెయిల్ మంజూరు చేసింది.
రెండు కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన మరి కొద్ది గంటల్లో విడుదలయ్యే అవాకాశం ఏర్పడింది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, మాజీ మంత్రి అభిమానులు.. బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబు సైతం బెయిల్ రావడంతో తన సహజశైలిలో సోషల్ మీడియా వేదికలో పోస్టు పెట్టి రియాక్ట్ అయ్యారు. ‘దౌర్జన్యాలు, దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవని’ తెగ ధీమా వ్యక్తం చేశారు.
ఆ సంబరం ముగిసే లోపే అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. సత్తెనపల్లిలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్ల విక్రయాలు జరిగాయి. సచివాలయ వలంటీర్స్ ద్వారా ఈ టికెట్ల అమ్మకాలు జరిగాయి.
2023లో సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్లు అమ్మకాలపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో వైసీపీ అధికారంలో ఉండటం, అంబటి రాంబాబు మంత్రిగా కొనసాగుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దాంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సబ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబుపై 2023 జనవరి 16న సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ లక్కీ డ్రా కేసులో తాజాగా పీటీ వారెంట్ జారీ అయింది. మరికొద్ది గంటల్లో అంబటి గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో సత్తెనపల్లి పోలీసులు మరో పీటీ వారెంట్ దాఖలు చేయడం గమనార్హం. సదరు పీటీ వారెంట్పై విచారించిన న్యాయమూర్తి అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించడంతో.. ఆయన విడుదలకు ఇంకా టైమ్ పడుతుందంటున్నారు.
అంబటిపై కేసుల ఎపిసోడ్ చూస్తూ వైసీపీ క్యాడర్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గుర్తు చేసుకుంటున్నారంట. కిడ్నాప్ కేసులో అరెస్టైన వల్లభనేని వంశీపై తర్వాత వివిధ కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేశారు. ఆ ప్రభావంతో ఆయన దాదాపు 4 నెలలు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇప్పుడు అంబటి విషయంలో కూడా సేమ్ సీన్ తప్పదేమో అని కూటమి శ్రేణులు సోహల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నాయి.
Also Read:
Story by: Apparao, Big Tv