AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్ర సెగలు మొదలయ్యాయి. ఓటమి తర్వాత పెద్దగా జనంలోకి రాని మాజీ సీఎం జగన్ ‘పాదయాత్ర 2.0’ యాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే అది ఇప్పుడే కాదంట. ఏడాదిన్నర తర్వాత మొదలుపెట్టి మళ్లీ వచ్చే ఎన్నికల వరకు జనంలోనే ఉంటానని వెల్లడించారు. 2019 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారా? అసలు వైసీపీ అధ్యక్షుడి వ్యూహం ఏంటి?
2004 నుంచి 2014 వరకు అధికారానికి దూరంగా ఉన్న తెలుగు దేశం పార్టీలో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద సాహసమే చేశారు. అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, కొత్తగా ఆవిర్భవించిన వైసీపీని ఎదుర్కొనేందుకు అప్పట్లో టీడీపీ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, వైసీపీల మధ్యే నెలకొంది. టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. ఈ నేపధ్యంలో 2014 ఎన్నికల ముందు 62 ఏళ్ల వయసున్న చంద్రబాబు ‘వస్తున్నా … మీకోసం’ అంటూ జనంలోకి వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో కుటుంబానికి దూరంగా ఉండి దాదాపు ఏడు నెలల పాటు ఉమ్మడి రాష్ట్రంలో 2,817 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర 2012 అక్టోబర్ 2న హిందూపురంలో ప్రారంభమై, 2013 ఏప్రిల్ 26న ముగిసింది. ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో నైతిక స్థైర్యాన్ని పెంచి, 2014 ఎన్నికల్లో టీడీపీ విజయానికి దోహదపడింది. అభివృద్ధి కాముకుడిగా రాజధాని లేకుండా విడిపోయిన ఏపీని చంద్రబాబే ప్రగతిపథం పట్టించగలరని ప్రజలు ఆయనకు పట్టం కట్టారు.
ఇక 2024 ఎన్నికల ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యకర్శి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే లక్షంగా లోకేష్ ప్రజల్లోకి వచ్చి నడిచారు. సుమారు 400 రోజుల పాటు 3,132 కిలోమీటర్లకు పైగా సాగిన యువగళం పాదయాత్ర నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంగా నిలిచింది. రాజకీయాల్లో యువతను భాగస్వామ్యం చేసేందుకు, చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు, నిర్భయంగా తమ గళాన్ని వినిపించేందుకు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అద్భుత స్పందన లభించింది. కుప్పంలో మొదలైన పాదయాత్ర తంబళ్లపల్లె నియోజకవరంలో ముగిసే లోపే వైసీపీ ప్రభుత్వం టీడీపీ వారిపై 25 కేసులు నమోదు చేయగా.. అందులో 3 లోకేష్ మీదే నమోదయ్యాయి. ఆ క్రమంలో 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయంలో ‘యువగళం’ఒక కీ ఫ్యాక్టర్గా నిలిచింది.
ఇక ఏపీలో ఇంకా మూడేళ్లు సమయం ఉండగానే వైసీపీ జగన్ చేసిన పాదయాత్ర ప్రకటన చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘంగా 16 నెలల పాటు సాగింది. దాని ప్రభావంతోనే ఆయన 2019 ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్ని అందించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు, పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలపరచేందుకు అటువంటి పోరాటపటిమ అవసరమని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
తాజాగా తాడేపల్లిలోని పార్టీ క్యాంపు ఆఫీసులో ఏలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ ఆ ప్రకటన చేసి క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం, నియోజకవర్గాల్లోని క్యాడర్తో మమేకం కావడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని, దీనికోసం ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమే అని.. ఆ క్రమంలో మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని జగన్ ప్రకటించారు. అలా అలా ఏడాదిన్నరపాటు.. అంటే దాదాపు వచ్చే ఎన్నికల వరకుప్రజల్లోనే ఉంటానని పేర్కొన్నారు. అలాగే ఇక ప్రతి శనివారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానన్నారు. ఏలూరు నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమం మొదలుపెడుతున్నామన్నారు.
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏమైనా చేయవచ్చనే అహంకారంతో ఉన్నారన్న వైఎస్ జగన్.. రాష్ట్రంలో ఎక్కడా పోలీస్ వ్యవస్థ కనిపించడం లేదని ఆరోపించారు. ఆరోగ్య శ్రీని కనుమరుగు చేశారని.. 108,104 వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. కూటమి పాలనలో వ్యవసాయ రంగం నాశనమైందని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందన్న జగన్.. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని అంటున్నారు.
అయితే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీని మళ్లీ నిలబెట్టాలంటే.. గత పాదయాత్రల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీయపాదయాత్రే మార్గమని జగన్ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల సమయానికి పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే తన అయిదేళ్ల పాలనలో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్, ఇప్పటికీ జనంలోకి పెద్దగా రావడం లేదు. అసెంబ్లీకి కూడా హాజరవ్వడం లేదు. పైపెచ్చు తాజాగా మరోసారి అమరావతిపై విషం కక్కి తీవ్ర విమర్శలపాలయ్యారు. మరి ఈ నేపధ్యంలో ఆయన పాదయాత్ర స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Story by: Apparao, Big Tv