Banswada Politics: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టడానికి నిజామాబాద్ రూరల్ మీజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధనరెడ్డిని అక్కడ నుంచి పోటీ చేయమని గులాబీ బాస్ ఆదేశించారంట. అయితే బాజిరెడ్డి మాత్రం అసలు తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశమే లేదని, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం పాత సెగ్మెంట్ నుంచే పోటీ చేయించాలని కోరుతున్నారంట. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేస్తున్నానని, నిజామాబాద్ రూరల్లో తన కొడుక్కి టికెట్ ఇస్తే దగ్గరుండి గెలిపించుకుంటానని అంటున్నారంట. అదే ఇప్పుడు అటు బాస్సువాడ, ఇటు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారింది
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజవర్గంలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచి, తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ పార్టీ పంచకు చేరిన పోచారం.. ఆ పార్టీ తరపున వరుస విజయాలు సాధించి కేసీఆర్కు అత్యంత సన్నిహితులయ్యారు. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి తర్వాత గత టర్మ్లో అసెంబ్లీ స్పీకర్గా అయిదేళ్లు పనిచేశారు.
అంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్కు జై కొట్టడంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రగిలిపోతున్నారంట. అందుకే వచ్చే ఎన్నికల్లో పోచారంకు చెక్ పెట్టడానికి బీఆర్ఎస్కు చెందిన మరోసీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డిని బాన్సువాడ నుంచి పోటీ చేయాలని పురమాయించారంట. బాజిరెడ్డి కూడా గులాబీబాస్కు అత్యంత సన్నిహితుడే. పార్టీ అధినేత ఆదేశాల మేరకు బాజిరెడ్డి బాన్సువాడ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టి పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
కానీ ఇప్పుడు బాన్సువాడ నుంచి పోటీ చేయలేనని బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి అధిష్టానానికి చెప్తున్నారంట. ఆరోగ్యరీత్యా రాజకీయాల్లో ఇక కొనసాగలేనని, తన కుమారుడు బాజిరెడ్డి జగన్ ను వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెలిపించుకునే బాధ్యత తనదని కోరుతున్నారంట. ఇప్పటికే బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ తరపున బాన్సువాడ నుంచి ఒకసారి, ఆర్మూర్ నుంచి ఒకసారి, తర్వాత గులాబీ పార్టీలో నిజామాబాద్ రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ క్రమంలో బాజిరెడ్డి తన రాజకీయ అనుభవన్నానంతా ఉపయోగించి, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొడుకును ఎమ్మెల్యేగా చూడాలని తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే ఆయన తనయుడు జగన్ బీఆర్ఎస్ హయంలో జెడ్పిటిసిగా గెలిచి జడ్పీ చైర్మన్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దాంతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకొని తన ఆశయం నెరవేర్చుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ ఆశిస్తున్నారట..
అయితే బాన్సువాడకు షిఫ్ట్ అవ్వడానికి బాజిరెడ్డి గోవర్ధన్ ససేమిరా అంటుండటంతో.. నెక్ట్స్ బీఆర్ఎస్ నుంచి బాన్సువాడ బరిలో దిగేదెవరన్నది అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాన్సువాడలో పోచారం గులాబీ పార్టీలో ఉన్నంత కాలం పార్టీకి ఆల్టర్నేటివ్ నేత అనేవారెవరూ లేకుండా పోయారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్రెడ్డి కూడా తన తనయుడు భాస్కర్రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకొని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట… బాజిరెడ్డి బాన్సువాడ అంటే సుముఖంగా లేకపోవడంతో… మరి అక్కడ పోచారం వారసుడిపై బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దింపుతుందనేది అసక్తికరంగా మారింది.
Also Read: ఎవరీ ఎల్ మంచో? అతను చస్తే ఇంత విధ్వంసమా?
Story by: Apparao,Big Tv