Urea shortage: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ సకాలంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది రైతులకు అండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు లేక, ఉన్నవారు యాప్ ఓపెన్ చేసి బుక్ చేసుకుందామనుకునే సరికి సెకండ్లలోనే బుక్ అవుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పంపిణీకేంద్రాల్లో సరిపడ యూరియా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రైతులు పేర్కొంటున్నారు. దీనికి తోడు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతోనూ ఇబ్బందులు పడుతున్నామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో 50 నుంచి 100 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు సరిపడ యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని వ్యవసాయశాఖ పేర్కొంటుంది. రాష్ట్రంలోని పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం), ఏఆర్ఎస్ కే (రైతు సేవా కేంద్రాలు)సెంటర్లకు ప్రతి రోజూ యూరియాను సరఫరా చేస్తున్నామని, రైతులు యాప్ లో బుక్ చేసుకుంటే సరఫరా చేస్తున్నారని అధికారులు ప్రకటిస్తున్నారు. అయితే యూరియా కేంద్రాలకు వచ్చిందని తెలియగానే రైతులు యాప్ లో బుక్ చేసుకుందామనుకునే సరికి 10 నుంచి 15 సెకండ్లలోనే బుక్ అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కొంతమంది రైతులకు అండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడంతోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది రైతులు పీఏసీసీఎస్, ఏఆర్ఎస్ కే సెంటర్లకు వెళ్లే సరికి అప్పటికే బుకింగ్ అయిపోతుంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
Also Read: Collector Harichandana: ప్రజా అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించాలి : కలెక్టర్ హరిచందన దాసరి
ప్రభుత్వం పీఏసీఎస్ లకు, ఏఆర్ఎస్ కే సెంటర్లకు రవాణా ఖర్చులేకుండా యూరియా సరఫరా చేస్తుంది. బస్తా 266 ఎమ్మార్పీకి అందజేయాల్సి ఉంటుంది. కానీ ఈ కేంద్రాల్లో మాత్రం 350 నుంచి 400వరకు అమ్ముతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్పీకి విక్రయించాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు అతిక్రమించి అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు యాప్ లో యూరియా బుక్ చేయాలని ఏఆర్ఎస్ కే సెంటర్లకు వెళ్లిన రైతులకు ఆ కేంద్రయజమానులు 4 బస్తాలు బుక్ చేసి రెండు బస్తాలే ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు అదనంగా హమాలీ చార్జీ అని, ట్రాన్స్ పోర్టు చార్జీ అని వసూలు చేస్తుండటం గమనార్హం. పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా జిల్లాకు ఒక ఏరాష్ట్ర స్థాయి అధికారిని నియమించారు. అయినప్పటికీ యూరియా దందా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో ఎఫ్పీఓ(రైతు ఉత్పత్తిదారుల సంఘం)లు ఉన్నాయి. ప్రతి మండలంలో ఒకటి ఉంటుంది. అందులో సుమారు 800 మందికి పైగా రైతులు సభ్యులుగా ఉంటారు. అయితే ఈ ఎఫ్పీఓలకు అధికారులు యూరియా సరఫరా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నెలలో ఒకటిరెండు సార్లు మాత్రమే సరఫరా చేస్తుండటం, ట్రాన్స్ ఫోర్టు చార్జీతో సరఫరా చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పీఏసీఎస్, ఏఆర్ఎస్ కే లకు మాదిరిగా ట్రాన్స్ పోర్టు చార్జీ లేకుండా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ ను గతేడాది డిసెంబర్ లో ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, జనగాం, పెద్దపల్లి జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. యాప్ సేవలు అమలు చేసింది. నేరుగా యూరియా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. విజయవంతం కావడంతో అన్ని జిల్లాల్లో అమలు చేసింది. యాప్ ను మండలాల వారీగా యూరియా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కానీ ఈ ఐదు పైలట్ జిల్లాల్లో మాత్రం నియోజకవర్గాల యాప్ కొనసాగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. మండలాలవారీగా బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.