Congress Vs BJP: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానంటున్న బీసీ రిజర్వేషన్లపై కాషాయ పార్టీ పోరాటానికి సిద్దమవుతోంది. బీసీ పోరుబాటకు బీజేపీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోందంట.. బీసీ సంఘాలను కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్లాన్ చేస్తోందంట.. 42 శాతం బీసీ రిజర్వేషన్లలకు వ్యతిరేకమని బీజేపీ ఎందుకు చెబుతోంది..? కాంగ్రెస్ సర్కారు వేసుకుంటున్న మైనార్టీ లెక్కలు కమలనాథులకు మింగుడు పడటం లేదా? బీసీ రిజర్వేషన్లపై హిందుత్వ అజెండానే నమ్ముకున్న కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై బీజేపీ పోరుబాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాటకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. వచ్చేనెల 2న బీసీ రిజర్వేషన్లపై మహాధర్నాను చేపట్టాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ ధర్నాను చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ హామీని ఇచ్చింది. అయితే బీజేపీ 42 శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆ 42 శాతంలోనే ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం వల్ల బీసీలు నష్టపోతారని బీజేపీ ముందు నుంచే ఆందోళన వ్యక్తంచేస్తోంది. అందులో భాగంగానే ఈ మహాధర్నాతో రిజర్వేషన్లపై ప్రజలకు వాస్తవాలు వివరించాలనే ప్లాన్ చేస్తోంది.
42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని డిమాండ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైన తర్వాత ఈ మహాధర్నా ఫస్ట్ టాస్క్ కానుంది. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానకి ఇప్పటికే ఆయన ఇఫ్పటికే కసరత్తు మొదలుపెట్టారు. కానీ ప్రజా పోరాటాల్లో మాత్రం ఈ మహాధర్నాని పార్టీ కొత్త చీఫ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంట. అందుకే పూర్తిస్థాయిలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలుచేసి స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారంట. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. గవర్నర్ ఆమోదం తెలిపాక పార్లమెంట్ కు సైతం పంపించింది. అయితే రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందని విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అంతేకాదు అంతటితో ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చింది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలనే యోచనలో కమలం పార్టీ మహాధర్నాకు ప్లాన్ చేస్తోంది.
లీగల్ సమస్యలు వస్తామని తెలిసినా ఆర్డినెన్స్ తెచ్చారని విమర్శలు
ఇప్పటికే రామచంద్రరావు బీసీ రిజర్వేషన్ల అంశంపై కౌంటర్లు ఇచ్చారు. అంతేకాకుండా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన 50 శాతం క్యాప్ మించుతుందని చెప్పుకొస్తున్నారు. మత రిజర్వేషన్ల వల్ల అనేక లీగల్ సమస్యలు ఎదురవుతాయని తెలిసిన కూడా ప్రభుత్వం కావాలనే ఆర్డినెన్స్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలని కుట్ర చేస్తుందని బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. అంతేకాకుండా బీజేపీ మతపరమైన, రాజకీయపరమైన రిజర్వేషన్లకు ముందు నుంచే పూర్తిగా వ్యతిరేకమని తనదైన వాదన వినిపిస్తోంది. ఈ అంశంలో కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై విమర్శలు చేయడం తగదని మండిపడుతోంది.
1973లో కేశవనంద భారత కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ లో చర్చ చేసినప్పుడు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా అన్నది అనుమానంగా ఉందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 లో సవరణ చేయాల్సి ఉంటుందని బీజేపీ చెబుతోంది. దీనికి ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను ఆధారంగా చూపిస్తోంది. ఎందుకంటే 1973లో కేశవనంద భారతీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, 9వ షెడ్యూల్ లో చేర్చినా, ఆ చట్టం జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుందని వాదిస్తోంది. అంతేకాకుండా జయలలిత తమిళనాడులో చేసిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చినా, అది ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉందని. ఇంకా తుది నిర్ణయం రాలేదని కాషాయ పార్టీ చెబుతోంది.
Also Read: మళ్లీ ఆ ఇద్దరి మంత్రుల మధ్య ఏం జరిగింది? స్థానిక ఎన్నికల్లో కష్టమేనా?
స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబరు 30కి పూర్తి చేయాలన్న కోర్టు
కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా కేంద్రం మోకాలడ్డుతోందని చెప్పడంపై కాషాయ దళం ఆగ్రహంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 నాటికి పూర్తిచేయాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అంతేకాకుండా రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. ఈ గడువు ముగియనుండటంతోనే రాష్ట్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ను చూపిస్తూ మళ్లీ మళ్లీ ప్రజలను మభ్యపెడుతోందని బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలను చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. అందులో బాగాంగానే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ మహాధర్నా చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ ధర్నాకు పార్టీతో పాటు ఇతర బీసీ సంఘాలను సైతం కలుపుకుని వెళ్లేలా కాషాయ పార్టీ యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకుందట.
Story By Vamshi Krishna, Bigtv