Vijay Divas Celebrations: రాజకీయాల్లో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం చాలా కామన్. మన కళ్ల ముందు జరిగిన ఇలాంటి ఘటనలు అనేకం. కానీ పవర్ చేతిలో ఉన్న పదేళ్లు మరిచి.. ఇప్పుడు అధికారం చేజారాక ఉత్సవాలు జరుపుకోవడం అనేది మాత్రం చాలా కొత్త. అదే సమయంలో వింత కూడా. మనం మాట్లాడుకునేది ఎవరి గురించి అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. కానీ దేని గురించి అనేది తెలుసుకోవాలనకుంటే మాత్రం చూసేయండి.
విజయ్ దివస్ను సెలబ్రేట్ చేయాలని బీఆర్ఎస్ పిలుపు..
డిసెంబర్ 9.. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన రోజు. అందుకే ఈ రోజును విజయ్ దివస్గా జరుపుకుంటోంది తెలంగాణ. అయితే భారత రాష్ట్ర సమితి ఈ వేడుకను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపు రాజకీయ వర్గాలకే కాదు.. పార్టీ నేతలకు కూడా కాస్త షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
డిసెంబర్ 9ని ఎప్పుడూ సెలబ్రేట్ చేయని బీఆర్ఎస్
డిసెంబర్ 9 అంటే.. తెలంగాణ ఏర్పాటు గురించి చిదంబరం ప్రకటన చేసిన రోజు. కానీ ఆ రోజును బీఆర్ఎస్ ఎప్పుడూ గుర్తించలేదు. ఎందుకంటే ఆ రోజు కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసినా.. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కావడంతో వెనక్కి తగ్గి.. మళ్లీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి నచ్చలేదు. అందుకే డిసెంబర్ 9ని ఎప్పుడూ సెలబ్రేట్ చేయలేదు. దీనికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే ఆ రోజు సోనియాగాంధీ పుట్టినరోజు కాబట్టి.
సోనియాగాంధీ బర్త్డే రోజు తెలంగాణ ప్రకటన వచ్చిందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలకు అది రుచించలేదు. అధికారంలో ఉన్న పదేళ్లు ఏనాడూ డిసెంబరు 9న ఎలాంటి కార్యక్రమాన్ని జరపలేదు. ఆ రోజు తెలంగాణకు సంబంధించి ఏమీ జరగనట్లే వ్యవహరిస్తూ వచ్చారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన రోజు నవంబరు 29ని దీక్షా దివస్గా జరుపుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా భారీగానే కార్యక్రమాలు నిర్వహించారు.
విజయ్ దివస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న కాంగ్రెస్..
కానీ ఈ ఏడాది ఎన్నడూ లేనట్టు విజయ్ దివస్ను సెలబ్రేట్ చేయాలని నిర్ణయించింది బీఆర్ఎస్. దీనికి కారణం లేకపోలేదు.. విజయ్ దివస్ను కాంగ్రెస్ పార్టీ ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది. కానీ తెలంగాణ గురించి ఎలాంటి పాజిటివ్ వార్త వచ్చినా అది తమ ఘనతేనని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకోవడం ఆనాదిగా వస్తున్నదే. కానీ ఇన్నేళ్లుగా డిసెంబర్ 9 విషయంలో మాత్రం సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. దీంతో క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది అనుకున్నారేమో.. వెంటనే ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో షాక్ అవ్వడం ప్రజలతో పాటు బీఆర్ఎస్ నేతల వంతు అయ్యింది. బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయంపై కల్వకుంట్ల కవిత కూడా రియాక్ట్ అయ్యారు. అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు.. విజయ్ దివస్లు సెలబ్రేట్ చేస్తున్నారు.. ఇది ఉద్యమాల గడ్డ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్తోనే అర్ధమవుతుంది.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఎలా బూమారాంగ్ అయ్యిందో.
Also Read: కామారెడ్డి జిల్లాలో స్కూల్ ఆటో బోల్తా.. స్పాట్లో 14 మంది విద్యార్థులు
కాంగ్రెస్కు కౌంటర్ గానే కార్యక్రమాలనే చర్చ..
నిజానికి గతేడాది కూడా కాంగ్రెస్ పార్టీ విజయ్ దివస్ని సెలబ్రేట్ చేసింది. అప్పుడు సైలెంట్గానే బీఆర్ఎస్. కానీ ఈ ఏడాది ఆ జోష్ను మరింత పెంచింది అధికార పార్టీ. దీంతో కౌంటర్గా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది బీఆర్ఎస్. కానీ ఇది కూడా ఇప్పుడు రివర్స్ అవుతుంది. చేస్తే మొదటి నుంచి చేయాలి.. లేదంటే చేయకూడదు. అలాకాకుండా.. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా.. విపక్షంలో ఉన్నప్పుడు సెలబ్రేట్ చేయడం రాజకీయ ఎత్తుగడకాకపోతే మరేంటి అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తున్న మాట.
Story By Vamshi Krishna, Bigtv