Crime News: వరుస రోడ్డు ప్రమాదాలు.. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. బయటకు వెళితే చాలు మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. సావర్గావ్ గ్రామం నుండి ఖండే బల్లూరులోని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న ఒక స్కూల్ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ అనే పదో తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.
డ్రైవర్ నిర్లక్ష్యంతో.. 14 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మొత్తం 14 మంది విద్యార్థులు తీవ్ర గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వారు అక్కడి సమీపంలోని ప్రమాదానికి స్పందించి వెంటనే గాయపడిన విద్యార్థులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది. గాయపడిన విద్యార్థుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Also Read: అయ్య బాబోయ్.. బంగారం ధర మళ్లీ పెరిగిందిగా.. ఇవాళ తులం ఎంతంటే?
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్పారు. ఆటోను వేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.