BRS Migrations: బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇతర పార్టీల్లో పదవులు రాక, సరైన గుర్తింపు దొరకని వారంతా ఇప్పుడు గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. అధికారంలో ఉన్న రెండుసార్లు ఇతర పార్టీల్లో గెలిచిన నేతల్ని బతిమలాడో, బలవంతంగానో తమలో కలిపేసుకుంది గులాబీ పార్టీ. దాంతో సొంత పార్టీ నేతల్ల అసంతృప్తి పెరిగిపోయి .. అది కూడా బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణమైంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కారు దిగేస్తుంటే.. ఇతర పార్టీల్లో అసంతృప్తి నేతల్ని, ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఆహ్వానించి గులాబీ కండువాలు కప్పుతుండటం గులాబీ శ్రేణులకే మింగుడు పడటం లేదంట. అసలు ఆ పార్టీ లెక్కలేంటి?
అధికారంలో ఉన్నపార్టీ ప్రతిపక్షంలోకి.. ప్రతిపక్షంలో ఉన్న వారు పవర్లోకి రావడం రాజకీయాల్లో కామన్. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు నిత్యం మారుతూనే ఉంటాయి. ప్రస్తుతం వారికి అధికార పార్టీ మీద మంచి అభిప్రాయం ఉండొచ్చు. సర్కారు ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేరని క్రమంలో వారిలో అసహనం పెరుగుతూ పోతుంది. గతంలో అదే విధంగా జరగడంతో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది.
బీఆర్ఎస్ ఓటమికి సవాలక్ష కారణాలున్నాయన్న టాక్ ఉంది. ఆ పార్టీ నాయకత్వ నియంతృత్వ పోకడలు, విపక్షాలను ఖాళీ చేయించాలన ప్రోత్సహించి వలసలు అందులో ప్రధానమైందిగా చెప్తారు. అదలా ఉంటే రాజకీయ నేతలు ఎవరైనా ఈ రోజుల్లో ప్రజాసంక్షేమం కోసం ఆలోచన చేయడం లేదని.. కేవలం వారి పదవులు, హోదాలు మాత్రమే చూసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ పార్టీలో పదేళ్లు మంత్రి లేదా ఇతర పదవులు అనుభవించిన నేతకు.. కొంచెం ప్రాధాన్యత తగ్గితే చాలు, వెంటనే పార్టీ మార్పు గురించి ఆలోచన చేస్తుంటారు.
వేరే పార్టీలో తనకు ప్రాధాన్యత దొరుకుతుందా? ఎన్నికల్లో పోటీకి బీఫాం ఆఫర్ చేస్తారా? మంత్రి పదవిపై భరోసా ఇస్తారా? తన అనుచరులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ లభిస్తుందా? ఈ లెక్కలన్నీ చూసుకున్నాక… ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుని, ముహూర్తం చూసుకుని మరీ నేతలుపార్టీ మారేందుకు సిద్ధం అవుతుంటారు. ఇాలాంటి ఉదంతాలు తెలంగాణలో ఇప్పటికే చాలా జరిగాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు. అంతకు ముందు గులాబీపార్టీ సైతం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కించింది.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. తమ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నాయకులు విపక్షాలను విమర్శిస్తునే ఉంటారు. తీరా తలరాతలు మారే సరికి పదవుల కోసం అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు గోడలు దూకుతూ.. ఇంత కాలం ఉన్న పార్టీనే ఆడిపోసుకుంటారు. మొన్నటిదాక ఎవర్నీ తిట్టిపోశారో, ఆ నోటితోనే పొగుడుతుంటారు. గతంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది.
రాజకీయ చదరంగంలో పార్టీలతో పనిలేదు. వ్యక్తులతోనూ సంబంధం లేదు. అలాంటి నేతలను చూస్తుంటే కేవలం పదవులు, హోదాలకే వారి ప్రాధాన్యతని స్పష్టమవుతుంది. మొత్తంగా దీనంతటిని డబ్బు, పరపతి, కులం వంటి అంశాలు ముందుండి నడిపిస్తుంటాయి. తాజాగా ఇదే విషయాన్ని అధికార పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి జీవన్రెడ్డి ప్రూవ్ చేశారని రాష్ట రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
సుమారు 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించిన ఆ సీనియర్ నేత.. సీఎం రేవంత్ ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత దక్కలేదని బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్లో కీలక పదవులు అనుభవించిన జీవన్రెడ్డి, ఏడు పదులు దాటిన వయసులోనూ పదవులు, టికెట్లు దక్కడం లేదని.. ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ మారడం ఎంత వరకు సమంజసం అని పలువురు విమర్శిస్తున్నారు. మంత్రిగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయనకు.. ఇంకేం పదవులు కావాలని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ రేపటి రోజున బీఆర్ఎస్లోనూ ప్రాధాన్యత దొరక్కపోతే ఆయన మళ్లీ పార్టీ మారుతారా? అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా, ఇప్పుడు కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానించి పదవులు ఆఫర్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. ఒక వేళ అధికారంలోకి వస్తే… ఇచ్చిన హామీల మేరకు కొత్త వారికి ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు ముందు నుంచి పార్టీనే నమ్ముకున్న వారికి ఎప్పటిలా అన్యాయమే జరుగుతుందా? అన్న చర్చ జరుగుతోంది.
Also Read: కథ రివర్స్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై తిరుగుబాటు
Story by: Apparao, Big Tv