ఈట్ కా జవాబ్ పత్తర్ సే.. అన్నట్టుగా ఉండాలి.. పాలక పక్షం నుంచి ప్రతిపక్షానికి కౌంటర్. కానీ ఇలాగ మాత్రం కాదు. ఎక్కడో హరీశ్రావు పూజలు చేపించాడట. అవి మామూలు పూజలు కావట.. క్షుద్ర పూజలట. అదీ రేవంత్ సర్కార్ పడిపోవడానికట. పడిపోవడమంటే.. ఆ సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత పెరగాలని, వర్షాలు కురవరాదని పూజలు చేపించాడట.
ఈ విషయాన్ని అద్దంకి దయాకర్ కనుక్కుని, ఆ రహస్యాన్ని తెలంగాణ సమాజానికి, యావత్ దేశానికీ తెలియజేశాడు. ఇదేం పద్దతి అని ప్రశ్నించాడు. దీనిపై సీఎం కూడా సీరియస్గా స్పందించాలని కూడా కోరాడు. అన్ని చేశారు.. ఇక లాభం లేదని ఇలా తాంత్రిక పద్దతులనూ వదలడం లేదని ఆరోపించాడు అద్దంకి. అద్దంకి మాటలు విన్న తరువాత.. ఈ క్షుద్ర పూజల మీద జనాల్లో మాత్రం ఇంకాస్త నమ్మకైతే పెరుగుతుంది.
ఇదో మూఢనమ్మకం. ఇప్పటికే జనం ఈ మూఢత్వంలో ఉన్నారు. క్షుద్ర పూజలు చేశారని చెబుతున్న అద్దంకి, అలా చేయడం వల్ల మాకేం కాదు.. మీ పూజలతో పప్పులు ఉడకవు.. మేం ప్రజాపాలన చేస్తున్నాం.. జనామోదం పొందేలా పాలించి..వారి ఆశీస్సులతో మరోసారి గెలుస్తామనే మాట మాట్లాడలేకపోయాడు. అంటే ఈ పూజలు చేయడం ద్వారా తమ పార్టీకీ, ప్రభుత్వానికి అరిష్టం జరగబోతుందనే భయమే కనిపించింది ఆయన మాటల్లో.
అందుకే సీఎం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మాట్లాడి.. ఇది లైట్గా తీసుకోవాల్సిన విషయం కాదు.. చాలా సీరియస్ మ్యాటర్ అన్నట్టుగానే చెప్పుకొచ్చాడు. ఒకవేళ అద్దంకి అనుకున్నట్టు.. హరీశ్ రావు పూజలు ఫలిస్తే.. ఇక జనంతో పనేముంది? జనం మూడ్ మార్చేసి.. తమకు అనుకూలంగా తిప్పుకునే విధానాలు కూడా ఆ క్షుద్ర పూజల్లో ఉండి ఉంటాయి.
అంతెందుకు? సీఎంపైనే క్షుద్రపూజలు చేయొచ్చు కదా..? బీఆరెస్ నేతలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. తమను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడని. పనిలో పని ఆ కవిత మీద కూడా ఓ క్షుద్రపూజ చేపించేస్తే సరి. ఎందుకంటే బాగా ఇబ్బంది పెడుతున్నది. పంటి కింద రాయిలా.. చెవిలో జోరీగలా.. కాలులో ముల్లులా.. అబ్బబ్బ తమను బొంద పెట్టడానికేనా అన్నట్టుగా ఆమె మాటలుంటున్నాయి.
కాబట్టి ఆమె మీద కూడా ఓ క్షుద్ర ప్రయోగం చేసి పూర్తిగా రాజకీయాలకు దూరం చేసేస్తే…? ఈ ఐడియా వచ్చి ఉంటుందా? అమలు చేసి ఉంటారా? ఇది కూడా అద్దంకి తెలుసుకుని చెబితే బాగుండేది. కవిత అలర్ట్ అవుతుండె. హరీశ్ ఈ పూజుల చేయించాడంటే.. దీని వెనుక కేసీఆర్ ఉండే ఉంటాడు. అంతేగా.. హరీశ్ వేసే ప్రతి అడుగూ కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ చెప్పిన పనినే హరీశ్ చేస్తాడు. ఆచరిస్తాడు.
మరి కేసీఆర్కు ఈ క్షుద్ర పూజల మీద నమ్మకం ఉందనుకోవాలా? అయుత చండీయాగాలు చేసి, వేద బ్రహ్మాణులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా, వారి కాళ్లను కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకుంటే పాపాలు పోతాయనే నమ్మకాలున్నాయని తెలుసు. జాతకాల పిచ్చి ఉందనీ తెలుసు.
కొడుకు సీఎం అవుతాడా? కాడా? ఆ యోగ్యం అసలు ఉందా లేదా? జైలుకు పోతే అవుతాడా? పోకుండానే అవుతాడా? అసలు తను బ్రతికి ఉండగా.. కొడుకును సీఎంగా చేస్తానా? చూస్తానా? ఇవన్నీ కేసీఆర్ను వేధిస్తున్న ప్రశ్నలే. వీటి కోసం జాతకాలు చూపించుకున్నాడు… దోషాలు నివారించుకున్నాడు.. అడ్డుగా ఉన్నవారిని.. (అదేనండీ బిడ్డె కవితను) తొలగించేసుకున్నాడు.. అంటే నమ్మొచ్చు.
కానీ ఈ క్షుద్రపూజలను ఆశ్రయించేంత బలహీనుడా కేసీఆర్. అసలు ఈ పూజలు జరిగాయంటావా? జరిగితే కేసీఆర్కన్నా నీచమైన, దారుణమైన నేత మరొకరుండరు అనుకోవాలి. ఆ జరిగిన పూజలపై అధికార కాంగ్రెస్ పార్టీ స్పందించిన తీరు ఇంకా దారుణాతి దారుణం అని కూడా అనుకోవాలి.
ఒకవేళ జరగలేదు కావొచ్చు అనుకుంటే.. అనవసరంగా ఈ టాపిక్ను తీసుకొచ్చిన కాంగ్రెస్ ఎంతగా దిగజారి పోయి క్షుద్ర రాజకీయాలు చేస్తుందో కదా! అని చీదరించుకోవాలి. మొత్తానికి ఈ టాపిక్ను రాజకీయాల్లోకి తెచ్చినందుకు మనమంతా సిగ్గుపడాలి. తెలంగాణ ప్రజలు రాజకీయ నేతల ఇలాంటి తీరుపై ఉమ్మేయాలి.