YSRCP VS TDP: మేము చేస్తే సక్రమం మీరు చేస్తే అక్రమం అన్నట్లుంది తిరుపతి వైసీపీ నేతల తీరు..గతంలో తమ అస్మదీయులకు ఏకంగా నగర పాలక సంస్థ నిధులతో పది వేల చదరపు అడుగులలో హోటల్ నిర్మించి నామమాత్రపు లీజుకు ఇచ్చారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్వాకముతో అగిపోయిన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఓ నిరర్ధక అస్తిని అమ్మాలనే ప్రతిపాదన తీసుకువస్తే అంతా అక్రమంటూ హోరేత్తిస్తున్నారు. అసలు ఎందుకు నగర పాలక సంస్థల ఆస్తులు విక్రయించే ప్రయత్నం జరుగుతోంది? వైసీపీ నేతలు ఎందుకు దాన్ని విమర్శిస్తున్నారు?
తిరుపతిలో లీజుకిచ్చిన కార్పొరేషన్ భవనంలో చాళుక్య హోటల్
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కన నగరపాలక సంస్థకు చెందిన ఓ భవనాన్ని 1991 ఏప్రిల్ 1న ఒకరికి 25 ఏళ్ల కాలపరిమితితో లీజుకి అప్పగించారు. ఆ భవనానికి చాళుక్య హోటల్గా పేరుపెట్టి వ్యాపారం నిర్వహించుకున్నారు. 2016 మార్చి 31న లీజు గడువు ముగియడంతో కార్పొరేషన్ స్వాధీనపరుచుకునే క్రమంలో లీజుదారుడికి పలుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. దీంతో పోలీసుల సమక్షంలో హోటల్కు కార్పొరేషన్ సీలు వేసింది. తనకు జీవనాధారమైన హోటల్ను తిరిగి ఇప్పించాలని లీజుదారుడు కోర్టును ఆశ్రయించారు. చాలాకాలంపాటు సదరు భవనం వినయోగంలో లేకుండా శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల ఇరువర్గాలు రాజీపడి, కేసు విత్ డ్రా చేసుకోవడంతో సదరు స్థలాన్ని కార్పొరేషన్ సొంతం చేసుకుంది.
అక్విజేషన్ అండ్ ట్రాన్సఫర్ ఆఫ్ ఇమ్యూవబుల్ ప్రాపర్టీస్
ఏపీ మున్సిపాలిటీస్ అక్విజేషన్ అండ్ ట్రాన్సఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 1967 నిబంధనలు, 1955 సెక్షన్ 148 మేరకు ప్రభుత్వ అనుమతితో కార్పొరేషన్ ఆస్తులను టెండరు ద్వారా విక్రయించుకోవచ్చు. ఆమేరకే 77 సెంట్లు ఉన్న చాళుక్య హోటల్ స్థలాన్ని నిబంధనల మేరకు బహిరంగ వేలం ద్వారా విక్రయించి వచ్చిన నిధులతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ఆపరేషన్ సెంటర్ బిల్డింగ్నిర్మాణాన్ని పూర్తిచేయాలని కార్పొరేషన్ యంత్రాంగం భావించింది.
సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణుల అబద్దపు ప్రచారం
ఆ మేరకు వైసీపీకి చెందిన మేయర్ ఆమోదంతో కౌన్సిల్ అనుమతి కోసం అజెండాలో సదరు అంశాన్ని చేర్చింది. అందులో ఎక్కడా కూడా సెంటు ఎంతకు విక్రయిస్తారన్న విషయం లేదు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియాలో కాకిలెక్కలు వేసి నడిరోడ్డుపై దోపిడీ అంటూ అబద్దపు ప్రచారం మొదలుపెట్టారు. అంకణం రూ.15లక్షలుంటే రూ.60వేలకు అమ్మేస్తున్నారంటూ సోషల్ మీడియాలో హాడావుడి చేస్తున్నారు.కూటమి అక్రమాలు అంటు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పిస్తున్నారు
గత పాలకుల నిర్వాకమే అంటున్న కూటమి నేతలు
చాళుక్య హోటల్ స్థలాన్ని అమ్మడానికి కారణం గత ప్రభుత్వ పాలకుల నిర్వకమే కారణమని కూటమి నేతలు అంటున్నారు. నగరపాలక సంస్థ పరిపాలన భవనం సిటీ ఆపరేషన్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణం కోసం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో వైసీపీ హయాంలో రూ.71 కోట్లతో టెండరు పిలిచారు. తమిళనాడుకు చెందిన ఆర్ఆర్ తులసి బిల్డర్స్ టెండరు దక్కించుకుంది. 2022 ఆగస్టు 21న అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ రూ 94.50 కోట్లకు పెంచారు.
2019-24 మధ్య మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ను రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు పైసా కూడా ఇవ్వలేదు. ఇంతలో స్మార్ట్ సిటీ గడువు పూర్తవ్వడంతో కేంద్ర నిధులు నిలిచిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చొరవ చూపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ308 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.98కోట్లు కలిపి మొత్తం సుమారు రూ.406కోట్లు స్మార్ట్ సిటీకి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో తిరుపతిలో స్మార్ట్ సిటీ నిధులతో మొదలైన భారీ ప్రాజెక్టులకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.
కాంట్రాక్టరుకి రూ.16.60 కోట్లు మాత్రమే చెల్లింపు
సిటి అపరేషన్ సెంటర్ బిల్డింగ్ 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ కాంట్రాక్టర్కు ఇప్పటివరకు రూ16.60 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన సుమారు రూ.78కోట్లను మున్సిపల్ సాధారణ నిధుల నుంచి మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనను కౌన్సిల్ సమావేశంలో చర్చించారు.. ఇప్పటివరకు చేసిన పనులకు కాంట్రాక్టర్కు రూ.40కోట్లు చెల్లించాలి. బకాయిలిస్తేనే పనులు మొదలుపెడతామని కాంట్రాక్టర్ పేచీ పెట్టారు. దీంతో కార్పొరేషన్ యంత్రాంగానికి ఎటూ పాలుపోక సదరు స్థలాన్ని విక్రయించడానికి నిర్ణయించిందంట.
రూ.80 కోట్ల పాత అప్పులు తీర్చిన కూటమి
వైసీపీ హయంలో తిరుపతి కార్పొరేషన్ బడ్జెట్ను జీరో చేయడమే కాకుండా రూ.150కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారు. తమ ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.80 కోట్ల పాత అప్పులను తీర్చాల్సి వచ్చిందని కూటమి నేతలు మండిపడుతున్నారు. దీంతో చాళుక్య స్థలాన్ని అమ్మడానికి ఓ కమిటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత అక్కడ మార్కెట్ రేటు అంకణము 8లక్షల వరకు ఉంది.అయితే దాన్ని అరవై వేలకు అమ్మడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టాయి.
వైసీపీని ప్రశ్నిస్తున్న కూటమికి మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లు
దీనికి తోడు తాము ఆ స్థల సంరక్షకుల మంటూ ప్రతిపాదన ఆమోదం పొందకుండా ఉండటానికి ఏకంగా తమ కార్పోరేటర్లకు విప్ జారీ చేసారు..అయితే అజెండా ప్రతిపాదనలు ముందుగా మేయర్ వద్దకు వెళ్ళి కౌన్సిల్ ముందుకు వచ్చాయి. అప్పుడు మేయర్ ఎందుకు అపలేదు, మేయర్ డాక్టర్ శీరీష వైసీపీ చెందిన వ్యక్తే కదా?అమె అడ్డుకోవచ్చు కదా? చర్చించేటప్పుడు అవసరమయితే టేబుల్ అజెండా పెట్టుకోవచ్చు కదా అని కూటమికి మద్దతు ఇస్తున్న కార్పోరేటర్లు అంటున్నారు..
మెరిడియన్ హోటల్ని చౌకగా లీజుకి తీసుకున్న వైసీపీ నేత
కపిలతీర్థం సర్కిల్లో 10వేల చదరపు అడుగుల్లో రూ2 కోట్ల స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన భవనాన్ని కారుచౌకగా కొట్టేసిన వైసీపీ నాయకులకు అందరూ అలాగే కనిపిస్తుంటారని కూటమి వర్గాలు మండిపడుతున్నాయి. మెరిడియన్ హోటల్ పేరిట వెలిసిన భవనానికి ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చేది. అలాంటిది నెలకు 1.5లక్షకే అద్దెకు ఇస్తూ వైసీపీ ప్రభుత్వంలో వారి అనుచరులకు కట్టబెట్టేసిన విషయం మరిచారా? అని ప్రశ్నిస్తున్నారు. చాళుక్య హోటల్ స్థలం విక్రయాన్ని తాము విజయవంతంగా అడ్డుకున్నామని చెబుతున్న వైసిపి నేతలు అసలు మెరిడియన్ హోటల్ వ్యవహారంలో ఎందుకు నగర పాలక సంస్థకు నష్టాన్ని కలిగించారని ధ్వజమెత్తుతున్నారు.
Also Read: వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే
స్థలం విక్రయానికి అడ్డం పడుతుండటంపై విమర్శలు
మెరేడియన్ హోటల్ ముప్పయి సంవత్సరాల పాటు లీజు ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీదా సిటి అపరేషన్ సెంటర్ పూర్తి చేయడంతో పాటు గతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం మొదలుపెట్టిన నగర పాలక సంస్థ కమిషనర్ గెస్ట్ హౌస్ను పూర్తి చేయాల్సి ఉంది.గతంలో స్మార్ట్ సిటి నిధులు తమ అడంబరాలకు , మాస్టర్ ప్లాన్ రహాదారుల పేరుతో ఖర్చు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు సంరక్షకులం అంటూ హోటల్ స్థలం విక్రయానికి అడ్డం పడుతుండటం విమర్శల పాలవుతోంది.
Story By Apparao, Bigtv