పార్టీ నిర్ణయాలకు కట్టుబడిన నేతగా దేవినేని ఉమకు పేరు
ఎంత సర్ది చెబుతున్నా కుతకుతలాడిపోతున్న ఉమ అనుచరవర్గందేవినేని ఉమ. ఈ పేరొక బ్రాండ్. ఉమ్మడి కృష్ణాజిల్లాకు పార్టీ నుంచి పెద్ద దిక్కుగా వ్యవహరించడం మాత్రమే కాదు. 2014- 19 మధ్య కాలంలో నీటిపారుదల మంత్రిగానూ వ్యవహరించారు. వైసీపీ హయాంలో పార్టీ వాయిస్ వినిపించడంలో ఎప్పుడూ ముందుండేవారు. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసి.. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయానికీ కట్టుబడిన నేతగా పేరు సాధించారు. ఈసారి ఎమ్మెల్యే కోటా- ఎమ్మెల్సీ రేసులో ఆయన పేరు కూడా వినిపించింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యే వారిలో దేవినేని ఉమ పేరు ముందు వరుసలో ఉంటూ వచ్చింది. అంతే కాదు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా అటు సోషల్ మీడియాలోనూ ఇతర వెబ్ సైట్లలోనూ ఆయన పేరు ప్రముఖంగా రాశారు కూడా.
ఎమ్మెల్యే కోటా- ఎమ్మెల్సీ రేసులో ప్రముఖంగా వినిపించిన ఉమ పేరు
ఇంతలో ఏమైందో ఏమో.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల లిస్టులో దేవినేని ఉమ పేరు మాయమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా.. ఈ సారికి మీకు సీటు ఇవ్వడం లేదన్న మాట వినడం. అది ఆయన అనుచరులకు తెలియడంతో.. ఒక్కసారిగా తీవ్ర నిరాశా నిస్పృహలు.
ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం లేదని తెలిసి ఉమ అనుచరుల్లో అసంతృప్తి
దేవినేని ఉమకు ఎమ్మెల్సీ సీటు దక్కక పోవడంతో.. ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇన్నాళ్ల పాటు పార్టీకి చేసిన సేవలకు ఇదేనా మర్యాద? అంటూ వారు లోలోన కుమిలిపోతున్నారట. తమ నాయకుడు ఎన్నేసి త్యాగాలు చేసినా ఫలితం దక్కక పోవడం పట్ల.. వారంతా.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
రాజ్యసభ ఆశించిన దేవినేని ఉమకు అక్కడా అడియాశ
ఒకటీ రెండు కాదు వరుస అవమానాలు. మా ఉమన్న చేసిన తప్పేంటి? పార్టీ చెప్పింది చెప్పినట్టు చేయడమేనా? నీటి పారుదల మంత్రిగా.. ఆయన ఎంత కష్టించి పని చేశారో అందరికీ తెలిసిందే. మొన్నంటే మొన్న బుడమేరు ఉప్పొంగినపుడు తనకున్న అనుభవమంతా వాడి.. ఆయన ప్రభుత్వానికి ఎన్నో సలహా సూచనలు చేయలేదా? మరి ఎందుకని మా నాయకుడికి ఇలా మొండి చేయి చూపుతున్నారంటూ.. దేవినేని అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ఇప్పుడు ఎమ్మెల్సీ దక్కక పోవడంతో అనుచరుల ఆవేదన
మైలవరం సీటును పార్టీలోకి వచ్చిన తన ప్రత్యర్థికే త్యాగం చేసినా.. ఆయనకెందుకు ఇంత అన్యాయం జరిగిందో అర్ధం కావడం లేదని వాపోతున్నారట దేవినేని అనుచరులు. తొలినాళ్లలో ఎమ్మెల్యే సీటు మిస్ అయితే.. రాజ్యసభ సీటు వస్తుందని భావించారనీ. అదీ మిస్ అయితే.. ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆశించారనీ… ఇప్పుడు అది కూడా దక్కక పోవడంతో.. ఉమ అనుచరులు లోలోన మదన పడుతున్నట్టు సమాచారం.
ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంటున్న దేవినేని ఉమ
అయితే ఇదంతా దేవినేని ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తనకు ఎన్ని సార్లు నిరాశ ఎదురైనా.. ఆయన్నుంచి మాత్రం ఎలాంటి అసంతృప్తి వ్యక్తం కావడంలేదనీ.. ఆయా సందర్భాల్లో ప్రత్యర్థులను చీల్చి చెండాడే ఉమేనా.. ఇంత శాంతం వహిస్తోందన్న మాట కూడా వినిపిస్తోంది. ఒక అసలైన కార్యకర్త అంటే, అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలను శిరసావహించడం. ఇదే తనకు తెలిసిందంటూ.. ఆయన ప్రతి అంశంలోనూ మౌనమే సమాధానంగా ఉంటూ వస్తున్నారనీ చెబుతున్నారు.
సరైన సంఖ్యాబలం ఉన్నా టీడీపీకి మూడే సీట్లు
ఏపీలో ప్రెజెంట్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీకి పూర్తి బలం ఉన్నప్పటికీ కేవలం మూడంటే మూడు మాత్రమే దక్కుతున్నాయి. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ చెరో స్థానం కేటాయించాల్సి రావడంతో.. ఉమలాంటి సీనియర్లకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు.
భవిష్యత్తోలో అవకాశాలున్నాయ్.. సంయమనం అవసరమంటోన్న అధిష్టానం
సామాజిక న్యాయం, ప్రాంత న్యాయం, ఇప్పటి వరకూ పార్టీకి చేసిన సేవల్ని.. బేరీజు వేసుకుని టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని.. అంటున్నారు. ఫలితంగా పిఠాపురం వర్మ, దేవినేని ఉమ లాంటి వారికి అవకాశాలు దక్కలేదనీ.. భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు రానున్నాయి కాబట్టి.. కాస్త సంయమనం అవసరమని సర్ది చెబుతోందట అధిష్టానం.
వచ్చే రోజుల్లో వైసీపీ నుంచి ఖాళీ అయ్యే ప్రతి పదవీ కూటమికే
వచ్చే ఐదేళ్ల పాటు వైసీపీ తరఫున ఖాళీ అయ్యే ప్రతి పదవీ.. టీడీపీ కూటమికే వస్తుందనీ.. ఆ పదవులతో వర్మ, ఉమ వంటి వారికి న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయనీ అంచనా వేస్తున్నారు. ఇటు రాష్ట్రం మాత్రమే కాదు.. అటు కేంద్ర స్థాయిలోనూ టీడీపీ నేతలకు అవకాశాలు లభిస్తే. ఈ అసంతృప్తి తాత్కాలికమే అవుతుందని అంటున్నారట.
ఎంత సర్ది చెబుతున్నా కుతకుతలాడిపోతున్న ఉమ అనుచరవర్గం
ఇందుకు ఉమ వంటి నాయకులు సరేనని సర్దుకు పోతుంటే.. అనుచరవర్గం మాత్రం.. ఇప్పటికీ కుతకుతలాడిపోతున్నట్టు సమాచారం. కారణం.. ప్రతి సారీ ఏవో ఒక ఈక్వేషన్లు అడ్డొచ్చి.. తమ అభిమాన నాయకులకు మొండి చేయి చూపుతున్నారనీ.. దీంతో ఫలాలు వారికి- త్యాగాలు తమకు మిగులుతున్నాయని వాపోతున్నారట ఉమ అనుచరులు.