YSRCP Kanigiri: కనిగిరి నియోజకవర్గ వైసీపీలో అయోమయ పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ ఇంచార్జిగా ఉన్న నారాయణయాదవ్ కేడర్ నుంచి లీడర్ల వరకూ ఎవరినీ మెప్పించలేకపోతున్నారట ఎవరిని నొప్పింపక.. తానొవ్వక.. తప్పించుకు తిరుగువాడు అన్న పాత పద్యాన్ని గుర్తు చేసేలా ఉన్న ఆయన వ్యవహార తీరు పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోందంట .. అసలు ఇంచార్జ్ గా నారాయనే ఉంటారా?.. కొత్తవాళ్లు వస్తారా? అన్న చర్చ కనిగిరి నియోజకవర్గ వైసీపీలో మొదలైందట .. అసలు అక్కడ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్నట్లుగా మారాయని సొంతపార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట.. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన దద్దాల నారాయణ యాదవ్ ప్రస్తుతం అక్కడ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే పార్టీ శ్రేణులను సమన్వయం చేయటం మాత్రం నారాయణకు తలకు మించిన భారంగా మారుతుందట.. హనుమంతునిపాడు జడ్పీటీసీ గా ఉన్న దద్దాల నారాయణ అనూహ్య రీతిలో కనిగిరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు .. 2019 ఎన్నికల్లో గెలిచి కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ పై అసమ్మతి బాణం ఎక్కుపెట్టి వార్తల్లోకి వచ్చిన నారాయణ గత ఎన్నికల్లో ఆయన స్దానంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దిగా సీటు దక్కించుకున్నారు. కానీ టీడీపీ అభ్యర్ది ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చేతిలో 14 వేల చిలుకు ఓట్ల తేడాతో ఓడారు.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేసి ఓడినా… నారాయణను ఇంకా జడ్పీటీసీ గానే అందరు చూస్తున్నారంట.. వైసీపీ కేడర్ నుంచి లీడర్ల వరకూ అలాగే ట్రీట్ చేస్తుండటం కూడా నారాయణకు పార్టీ నేతలపై పట్టు రాకపోవటానికి ఓ కారణంగా చెబుతున్నారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల కుటుంబాల్లో పెళ్లిళ్లకు.. ఫంక్షన్లకు వెళ్లటం వరకూ ఓకే కానీ.. పార్టీ కార్యక్రమాల నిర్వహణ మాత్రం ఆయనకు తలకు మించిన భారంలా మారుతోందంటున్నారు.. స్వతహాగా సౌమ్యుడిగా పేరున్న నారాయణ గట్టిగా ఎవరికీ చెప్పలేని సమయాల్లో పలాయన మంత్రం జపించటం తప్ప, గ్రామాల్లోని వర్గ రాజకీయాలను కూడా పరిష్కారం చేయలేకపోతున్నారనేది లోకల్ వైసీపీలో వినిపిస్తున టాక్.. కనిగిరి టౌన్ లో ఉండే పార్టీ కార్యాలయాన్ని కూడా ఉన్న చోట నుంచి తీసేసి, ఎక్కడో ఊరి చివరన ఉన్న తన ఫాంహౌస్ కు మార్చటం వెనుక కూడా గట్టిగా మాట్లాడలేక పోవటమే ఓ కారణంగా చెబుతున్నారు.
అద్దె భవనంలో ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి రావటం. పార్టీ నేతలు కలిసి రాకపోవటం వల్ల టౌన్ లో మరోచోటకు కార్యాలయాన్ని మార్చాల్సి వచ్చిందని చెపుతున్నారు. అయితే పార్టీ నేతలందరితో మాట్లాడి ఉన్న చోట కొనసాగించినా.. లేక టౌన్ లోనే మరోచోటకు కొత్త కార్యాలయం ఏర్పాటు చేసినా పార్టీ కార్యకర్తలు కార్యాలయానికి వెళ్ళి కూర్చోవటానికైనా అవకాశం ఉండేదని.. కానీ ఊరి చివరన ఉన్న తన ఫాంహౌస్ లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటం వల్ల సొంత పార్టీ కార్యకర్తలు కూడా అక్కడకు వెళ్లలేకపోతున్నారంటున్నారు. .మరోవైపు పార్టీ అదిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహించటం తప్ప నియోజకవర్గంలో ఆయన పెద్దగా కార్యక్రమాలు స్పీడప్ చేసింది కూడా లేదని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన నారాయణకు అదేస్దాయిలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ఉన్నా గెలుపు సాధ్యం కాలేదు.. దీనికి ఆయనకు తగినంత అర్ద, అంగబలం లేకపోవటం కూడా ఓ కారణమన్న విశ్లేషణలున్నాయి.
కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు వ్యతిరేకంగా పనిచేసిన అసమ్మతి వర్గం వారిని, నియోజకవర్గ కీలక నేతలను ఆ తర్వాత సమన్వయం చేసుకోలేక పోవటం కూడా నారాయణకు మైనస్ లా మారుతుందట.. పార్టీ కేడర్ కు విడి సమాయాల్లో దొరికే నారాయణ.. నిజంగా వారికి అవసరమైనప్పుడు కాల్ చేస్తే మాత్రం ఫోన్ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో దొరకరంట.. పార్టీలోని కీలక నేతలు తన మాట వినరు అనే సందర్బాల్లో ఎవరిని నొప్పింపక.. తానొవ్వక.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న ఫేమస్ పద్యాన్ని గుర్తు చేసుకుంటారంట అయన .. మరోవైపు గత ఎన్నికల్లో ఓటమికి కూడా గట్టి కారణాలనే చెబుతుంటారు పాత రోజులు గుర్తున్న నేతలు. మరోవైపు గత ఎన్నికల్లో ఓటమికి కూడా గట్టి కారణాలనే చెబుతుంటారు పాత రోజులు గుర్తున్న నేతలు..నారాయణ రాజకీయ ఆరంగ్రేటం చేసే రోజుల్లో బీసీ కులాల ఐక్యవేదికను ఏర్పాటు చేసిన ఆయన ప్రధాన కులాలను టార్గెట్ చేసుకుని మాట్లాడటాన్ని నియోజకవర్గ ఓటర్లు ఇప్పటి ఎన్నికల్లో గుర్తు చేసుకున్నారని అంటారు.
అటు సొంత సామాజికవర్గంపై పట్టు లేకపోవటం.. వైసీపీకి సపోర్ట్ చేసే ప్రధాన సామాజికవర్గాల నేతలు ఆయనతో కలసి రాకపోవటం కూడా నియోజకవర్గంలో వైసీపీని మరింత అయోమయంలో పడేస్తున్నాయట.. వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కల్తీ మద్యంపై నిరసన కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.. కార్యకర్తలు, నేతలు ఆశించిన స్దాయిలో రాకపోతే కార్యక్రమం తేలిపోతుందని.. తానే రాకపోతే ఎలా జరిగినా ఏదో ఒకటి చెప్పుకోవచ్చన్న లెక్కలతోనే ఆయన దూరంగా ఉండి ఉండవచ్చంటున్నారు కనిగిరి వైసీపీ నేతలు.. కొన్ని సందర్బాల్లో ఆయన ఇదే తరహా రాజకీయాలు చేస్తుంటారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అయోమయం.. గందరగోళం నెలకొని ఉండటం వల్లే తరచూ పలు సెగ్మెంటుల్లో ఇంచార్జులను మారుస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతున్నా .. ఆయన మాత్రం తన పని తీరు మార్చుకోరని అంటున్నారు.
మరోవైపు గత ఎన్నికల్లో కందుకూరు నుంచి పోటీ చేసిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ కూడా తిరిగి ఇక్కడకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.. అలాగే కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, వైఎం ప్రసాదరెడ్డి వంటి కీలక నేతలు ఆయనకు ప్రత్యామ్నామంగా ఉండటంతో వైసీపీ అధిష్టానం ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న అనుమానాలున్నాయి.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో ఏకంగా 11 మంది సిట్టింగులను మార్చి పలువురిని ఇతర నియోజకవర్గాలకు వైసీపీ మార్చింది. మరికొందరు కొత్తవారికి అవకాశం ఇచ్చినా ఎన్నికల్లో ఫలితం దక్కలేదు.
పనితీరు సరిగా లేకపోవటంతో ఇఫ్పటికే అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చింది. సర్వేల పేరు చెప్తూ పనితీరు సరిగా లేని ఇంచార్జ్ లను మారుస్తూ వస్తుంది.. పార్టీ బూత్ లెవల్ కమిటీలు సహా పార్టీ అన్ని విభాగాల్లో పూర్తిస్దాయిలో టీంని రెడీ చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశించటం.. ఇప్పటికీ అన్నింటిలొ కనిగిరి నియోజకవర్గంలో వెనుకబడి ఉందన్న లెక్కలుండటంతో నారాయణ మార్పు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ఎంత మంచోడయినా అన్నీ లెక్కలు వేసుకోవాల్సిందేనని.. ఆయన దగ్గర అన్నీ లెక్కలు సరిగా లేకపోవటం కూడా ఆయన ఓటమికి కారణమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. మరి నారాయణ విషయంలో వైసీపీ అధిష్టానం ఆలోచన ఏంటి.. ఆయననే కొనసాగిస్తారా.. కొత్తవారికి అవకాశం ఇస్తారా.. అధినేత ఆలోచన ఏంటి.. కనిగిరి వైసీపీలో అయోమయానికి ఎలా తెర పడుతుందనేది చూడాలి.
Story By Apparao, Big TV
Also Read: Narsingi Minor Rape Case: నార్సింగిలో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు నిందితుల అరెస్ట్!