Graduate Elections: తెలంగాణలో మరో ఆసక్తికర రాజకీయం మొదలైంది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈసారి స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ మంత్రులను ఆరు నెలల ముందే రంగంలోకి దింపింది.
మహబూబ్నగర్ – హైదరాబాద్-రంగారెడ్డి రీజియన్ ఇన్చార్జ్ బాధ్యతలను సీనియర్ మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కు అప్పగించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం బాధ్యతలను ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భుజస్కంధాలపై ఉంచింది అధిష్టానం. క్షేత్రస్థాయి నుంచి వ్యూహాత్మకంగా వెళ్లాలనే కాంగ్రెస్ ఆలోచనకు ఈ నియామకాలే నిదర్శనం.
Also Read: తెలంగాణకు వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
అటు బీజేపీ కూడా ఈ పోరులో వెనక్కి తగ్గడం లేదు. పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాల్లో తమ బలాన్ని చాటుకోవాలని కమలం పార్టీ పట్టుదలతో ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఇప్పటినుంచే గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్లాన్లు వేస్తోంది. ఆరు నెలల ముందే పార్టీల్లో మొదలైన ఈ కోలాహలం రాబోయే రోజుల్లో రాజకీయాన్ని మరింత వేడెక్కించనుంది. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు, విద్యా రంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా సాగబోయే ఈ సమరంలో పట్టభద్రులు ఎవరి వైపు నిలుస్తారు? కాంగ్రెస్ మార్క్ వ్యూహాలు ఫలిస్తాయా?
Also Read: ఇది ఏపీకి దక్కిన గౌరవం అంటూ.. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్..!