FCRA Amendment: విదేశీ నిధులపై మరింత నిఘా పెడుతోంది కేంద్రం. వాటిపై పారదర్శకత, ప్రభుత్వ నియంత్రణ పెంచాలని భావిస్తోంది. ఇందుకోసం FCRA సవరణ బిల్లును లోక్సభ ముందుకు తీసుకురాబోతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు, అక్రమ మత మార్పిడులకు ఒడిగట్టడం వంటి చర్యలకు విదేశీ నిధులు దుర్వినియోగమవుతున్నాయన్న ఆరోపణలతో పకడ్బందీ చర్యలు చేపడుతోంది.
విదేశీ నిధులతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలపై కఠిన ఆంక్షలు విధించేలా అడుగులు వేస్తోంది. లైసెన్స్ రద్దయిన లేదంటే సస్పెండైన సంస్థల ఆస్తుల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. ఐతే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని NGOలు, మతపరమైన సంస్థల ఆస్తులపై నియంత్రణ పెంచాలనుకోవడం ప్రమాదకరమని వాదిస్తున్నాయి. విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలు అందించే సంస్థలకు ఈ రూల్స్ అడ్డంకిగా మారుతాయని ఇది పౌరహక్కులను అణిచివేయడమేనని ఆరోపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, మైనారిటీ సంస్థలు, విమర్శకుల గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశముందని విమర్శిస్తున్నాయి విపక్షాలు.
Also Read: గల్లీలో కొట్లాటలు.. ఢిల్లీలో కౌగిలింతలు.. బీజేపీ నేతల నాటకానికి హైకమాండ్ చెక్!
ఐతే విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, దేశ భద్రతను కాపాడటానికి ఈ సవరణలు అత్యంత అవసరమని స్పష్టం చేస్తోంది కేంద్రం. చట్టవిరుద్ధమైన మత మార్పిడులు, అసాధారణ కార్యకలాపాలకు విదేశీ విరాళాలు వాడుతున్న వారికే ఈ నిబంధనలు వర్తిస్తాయంటోంది కేంద్రం. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జాతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యమని చెబుతోంది. దీంతో FCRA సవరణ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధంతో పార్లమెంట్ సమావేశాలు హాట్హాట్గా నడిచే అవకాశముంది.
Also Read: తక్కువ ధరలో క్రేజీ ఏథర్ స్కూటర్.. లాంచ్ కు ముందే లుక్ రివీల్!