Telangana BJP: తెలంగాణ బీజేపీలో రాష్ట్ర స్థాయిలో నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ ఢిల్లీలో మాత్రం ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఐక్యంగా కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలో ఒక్కో నాయకుడు ఒక్కో దారిలో రాజకీయాలు చేస్తుండగా, జాతీయ రాజధానిలో మాత్రం అందరూ కలిసి కేంద్ర మంత్రులను కలవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హైకమాండ్కు పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా ఒక్కటేననే సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ భేటీలు నిర్వహించారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. మౌలిక వసతులు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి, కేంద్ర నిధుల కేటాయింపు వంటి అంశాలపై మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేస్తున్నామనే సందేశాన్ని పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ సమావేశాలను విశ్లేషిస్తున్నారు.
అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలువురు నేతల మధ్య సమన్వయం లోపించడం, వర్గ రాజకీయాలు, వ్యక్తిగత ఆధిపత్య పోరు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో మాత్రం అందరూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. ముఖ్యంగా ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా వెంట తీసుకెళ్లడం వెనుక అంతర్గత విభేదాల ప్రభావం బయటపడకుండా చూసే ప్రయత్నమా? అనే చర్చ సాగుతోంది. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ఢిల్లీ పర్యటనను కేవలం అభివృద్ధి కోణంలో మాత్రమే చూడడం లేదు. పార్లమెంట్ సమావేశాల హడావుడితో పాటు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: ‘నా వయసు 15 ఏళ్లే.. నన్ను క్షమించండి’.. మోదీ విషయంలో యువతి యూటర్న్!
కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా ప్రజల్లో తమ ఉనికిని గట్టిగా చాటుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. అందులో భాగంగానే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఒకే తాటిపైకి వచ్చి ఢిల్లీకి క్యూ కట్టడం వెనుక పార్టీ హైకమాండ్ ప్రమేయం ఉందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అనుసరించాల్సిన విధానాలపై కేంద్ర పెద్దలతో వీరు ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది.
పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం పెంచడంపై కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు కమలదళ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేసమయంలో బీజేపీ ఎంపీల మధ్య ఐక్యత ఉందనే సంకేతాలను పంపించేలా సమావేశమవ్వడం ప్రాధాన్యతన సంతరించుకుంది. అధిష్టానం ముందు అంతా ఐక్యంగా ఉన్నామని చెప్పే ఉద్దేశ్యంతోనే ఫొటోలకు పోజులిచ్చారా? అనే చర్చ జరుగుతోంది. రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతం నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల ఈ ఐక్యత ఎంతవరకు కొనసాగుతుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
Also Read: మహిళా సంఘాలకు సర్కార్ బంపర్ ఆఫర్.. 11 రకాల వ్యాపార రుణాలు!