Himalayan Glaciers: కేవలం అర డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా.. ఆ ముప్పు 200 కోట్ల మంది జీవితాలను శాసిస్తుందా? ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటే భవిష్యత్ గాడాంధకారమేనా? హిమానీ నదాలు కరిగిపోతుండటంతో.. మనం ప్రస్తుతం ప్రమాదపుటంచుల్లో ఉన్నామా? మన పెట్టని జల రాశులైన హిమానీ నదాలు రాన్రాను కరిగిపోతున్నాయా? హిమాలయ పర్వతాల్లోని హిందూ కుష్ పర్వతాల ప్రస్తుత పరిస్థితేంటి? రానున్న రోజుల్లో ఎలాంటి కరువు కాటకాలను తేనున్నాయి? వీటి ద్వారా రానున్న కష్టనష్టాలేంటి?
హిమాలయాల్లో 800 కి. మీ పొడువున
క్లీన్ ఎనర్జీ వాడాలంటోన్న నిపుణులుహిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోటల్లాంటివి. హిమాలయాల్లో 800 కిలోమీటర్లకు పైగా పొడవైన హిందూ కుష్ పర్వత శ్రేణిలో ఎన్నో హిమానీ నదాలున్నాయి. ఇవి మరెన్నో నదులు, సరస్సులకు ఆధారం. మధ్య దక్షిణాసియాలో హిందూ కుష్ గ్లేసియర్స్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి ఏకంగా 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఈ హిమానీ నదాలు వేగంగా పెరిగిపోతున్నాయి.
75 శాతం గ్లేసియర్స్ పెరిగే అవకాశం
ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలకంటే మరో 2 డిగ్రీల సెల్సియస్ కు పైగా పెరిగినా చాలు.. ఈ శతాబ్దం చివరినాటికి.. హిందూ కుష్ లోని గ్లేసియర్స్ లో 75 శాతం కరిగిపోయే ప్రమాదముంది. ఈ విషయం తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. సుమారు 2 బిలియన్ల మంది బతుకులకు జలగండం పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది.
సైన్స్ జర్నల్లో ప్రమాద హెచ్చరిక
ఈ అధ్యయనాలను సైన్స్ జర్నల్లో ప్రచురించడంతో.. ప్రస్తుతం ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడుతోంది. ఎందుకంటే భూగోళంపై మానవ మనుగడ సజావుగా సాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ అత్యంత ముఖ్యం. ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
10 దేశాలు, 21 మంది సైంటిస్టులు
పది దేశాలకు చెందిన 21 మంది సైంటిస్టులు ఈ అధ్యయనం నిర్వహించగా.. ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్ మోడల్స్ ని శాంపిల్స్ గా తీస్కున్నారు.
భవిష్యత్ బాగుండాలంటే గ్లేసియర్ సేఫ్ గా ఉండాలి
ఉష్ణోగ్రతలు పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ.. గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదని అంటున్నారు శాస్త్రవేత్తలు. రాబోయే దశాబ్దాల పాటు ఈ పరిమాణం కొనసాగుతూనే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రతల్లో అర డిగ్రీ తేడా వచ్చినా కూడా దాని ప్రభావం హిమానీ నదాలపై ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెబుతున్నారు సైంటిస్టులు. అందుకే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ దశ దిశా నిర్దేశిస్తాయని హెచ్చరిస్తున్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే, జల నిధులైన గ్లేసియర్లను కాపాడుకోవాలని సూచించారు.
ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో భాగంగా
పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం.. భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదల1. 5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్ పర్వతాల్లో 40- 45 శాతం మంచును కాపాడుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక వేళ2. 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 75 శాతం మంచు పెరిగిపోతుంది. దీంతో ఈ శతాబ్దం చివరినాటికి కేవలం 25 శాతం మాత్రమే మిగిలి ఉంటుందని అంటున్నారు.
యూరప్ ఆల్ఫ్స్, యూఎస్ రాకీస్..
యూరప్లో ఆల్ఫ్స్, ఉత్తర అమెరికాలోని రాకీస్ తో పాటు ఐస్ ల్యాండ్ లోని గ్లేసియర్స్ మానవాళికి జీవనాధారంగా ఉంటున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మొత్తం ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలకు మరో రెండు డిగ్రీలకు పైగా పెరిగితే.. మంచు కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే మిగిలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 90 శాతం మంచు కనుమరుగైతే.. పరిస్థితి తీవ్రత చాలా చాలా దారుణంగా తయారవుతుందని అంటున్నారు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే మరో ప్రపంచ ముప్పునకు ఆస్కారమేర్పడుతుందని అంటున్నారు.
అమాంతం మునగనున్న సముద్ర తీర ప్రాంతాలు
హిమానీనదాలపై ఐక్యరాజ్య సమితి సదస్సు తజకిస్తాన్ లోని దుషాన్బేలో జరుగుతోంది. యాభైకి పైగా దేశాలు ఇందులో పాల్గొన్నాయి. గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండటం వల్ల ఏషియాలోని 200 కోట్ల మందికి కష్టకాలం రాబోతోందని హెచ్చరించారు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ యింగ్ మింగ్ యాంగ్. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరవు కాటకాలు వచ్చే ప్రమాదముందనీ.. మంచు కరిగే కొద్దీ.. సముద్ర నీటి మట్టాలు పెరిగిపోతాయని చెబుతున్నారు. ఒక వేళ అదే జరిగితే.. సముద్ర తీర ప్రాంతాలు అమాంతం మునిగిపోతాయని అంటున్నారు.
క్లీన్ ఎనర్జీ వాడాలంటోన్న నిపుణులు
ఉష్ణోగ్రతలకు, హిమానీ నదాల కరుగుదలకూ లింకు. ఒక వేళ అలా జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలంటే, శిలాజ ఇంధనాల వాడకం పక్కన పెట్టాలి. క్లీన్ ఎనర్జీ వినియోగించాలని అంటారు నిపుణులు. భూమి అగ్నిగుండంగా మార్చుతోన్న కాలుష్య ఉద్గారాలకు కళ్లెం వేయాలని అంటున్నారు.
హిమాలయాలు కరిగితే పరిస్థితేంటి?
ప్రపంచ వాతావరణ స్థితిగతులు అలాగుంటే.. మన హిమాలయాలు కరిగితే పరిస్థితేంటి? వీటి కారణంగా మనం ఎదుర్కోబోతున్న ముప్పు ఎలాంటిది? ఇంతకీ హిమాలయ శిఖరాల్లో ఎన్నేసి గ్లేసియర్స్ ఉంటాయి. అవి ఎన్ని నదులకు ఆధారభూతం? హిమాలయాల్లోని గ్లేసియర్స్ కరగకుండా ఉండాలంటే మన వంతుగా మనం ఏం చేయాల్సి ఉంటుంది?
ఎవరెస్ట్ ఎత్తు 29, 029 అడుగులు
అడవుల నరికివేత తగ్గించి.. చెట్లు పెంచాలిప్రపంచంలో ఎత్తైన పది శిఖరాల్లో 9 హిమాలయాల్లోనే ఉన్నాయని అంటారు. వీటిలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ కూడా ఉంది. దీని ఎత్తు 29, 029 అడుగులు. అంటే 8 వేల 848 మీటర్లు. ఇది కేవలం హిమాలయాల్లోనే ఎత్తయిన పర్వతం మాత్రమే కాదు.. ఈ భూగ్రహం మీదున్న ఎత్తైన శిఖరం కూడా.
టెక్టోనిక్ ప్లేట్స్ ఢీ కొట్టుకోవడంతో హిమాలయాలు
ఇండియా టిబెట్ భూభాగాల్లోని టెక్టోనిక్ ప్లేట్స్ ఢీ కొట్టుకోవడంతో హిమాలయాలు ఏర్పడ్డాయని అంటారు. కొన్ని కొన్ని కథనాలను అనుసరించి చెబితే.. ఐస్ ఏజ్ కాలంలో ఒక ఆఫ్రికా ఖండం ఆసియా వైపుగా వచ్చి.. ఢీ కొట్టుకోవడం వల్ల ఇక్కడ ఇంత పెద్ద పర్వత శ్రేణి ఏర్పడిందని కూడా అంటారు. ఆ రాపిడి ఎంతో ఎక్కువ కావడం వల్ల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఇక్కడ వెలసిందని చెబుతారు. అదే ఎవరెస్ట్ దాని ఇతర పర్వత శ్రేణులు.
సింధు, యాంగ్జీ, గంగా బ్రహ్మపుత్ర నదులకు మూలం
కార కోర, కైలాష్, కాంచన్ జంగ, నంగా పర్బత్, అన్నపూర్ణ వంటి ప్రముఖ శిఖరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ మొత్తం పర్వత సముదాయమే హిమాలయ పర్వతాలంటారు. సింధు, యాంగ్జీ, గంగా, బ్రహ్మపుత్ర నదులకు మూలం ఈ పర్వతాలే. ఆసియా ఖండానికే ఇవి ప్రధాన నదీ జలాలు. ఈ నదులకు ఇక్కడి హిమానీ నదాలే ఆధారం.
48 మైళ్ల సియాచిన్ అతి పెద్దది
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అంటార్కిటికా, ఆర్కిటిక్ తర్వాత హిమాలయాలు ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మంచు నిక్షేపాలున్న పర్వతాలు. పర్వత శ్రేణి మొత్తం మీద 15 వేల హిమానీ నదాలున్నాయి. 48 మైళ్ల పొడవున సియాచిన్ గ్లేసియర్ అతి పెద్దదిగా ఉంటోంది.
బాల్టోరో, బియాఫో, నుబ్రా, హిస్పూర్ కూడా
హిమాలయాల్లో ఇతర ముఖ్యమైన హిమానీ నదాల్లో.. బాల్టోరో, బియాఫో, నుబ్రా, హిస్పూర్ కూడా ఉన్నాయి. ఇవన్నీ యదా తథ స్థితిలో ఉంటే.. ఆసియాలోని 200 కోట్ల మంది ప్రజలు ఎంతో హాయిగా జీవించగలరు. ఒక వేళ అంచనాలకు మించి.. అర డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా కూడా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదముంది. ఎందుకంటే ఏసియా మొత్తం నీటి కట కట ఏర్పడే ప్రమాదముంది.
అప్పుడే 40- 45 డిగ్రీల హిమానీ నదాలు కాపాడగలం
సైన్స్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధనలు చెబుతున్నదాన్నిబట్టీ చూస్తుంటే.. పారిస్ ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. ఉష్ణోగ్రతల పెరుగుదల 1. 5 డిగ్రీలకు పరిమితం చేయగలిగితే.. హిమాలయాల్లోని 40- 45 శాతం హిమానీ నదాలను, వాటిలోని మంచును కాపాడవచ్చు. ఒక వేళ అలాజరగలేదంటే.. ప్రమాదమేనంటున్నారు నిపుణులు.
పునరుత్పాదక ఇంధనాలు వాడాలి
ఉష్ణోగ్రతలు పెరక్కుండా ఉండాలంటే ముందుగా మనం గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలి. శిలాజ ఇంథనాల ఉపయోగం ఆపాలి. అంటే బొగ్గు, చమురు, సహజ వాయువు వంటివి వాడకుండా దూరంగా ఉండాలి. వీటి బదులు.. పునరుత్పాదక ఇంధనాలను వాడాలి.
అడవుల నరికివేత తగ్గించి.. చెట్లు పెంచాలి
మరీ ముఖ్యంగా అడవుల నరికివేత అరికట్టాలి. అడవులను కాపాడుకోవడంతో పాటు.. పర్యావరణ అనుకూలమైన వ్యవసాయం చేయాలి. అలా జరగాలంటే మొదట అందరికీ తెలిసిన ఏకైక విద్య చెట్లను నాటాలి. వనజీవి రామయ్య వంటి వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చెట్లను నాటేలా ప్రతిజ్ఞ చేయాలి. అంతే కాదు పర్యావరణ పరిరక్షణగా ఎవరికి వారు ఉద్గారాలను తగ్గించడంలో బాధ్యత తీస్కోవాలి.