Hyderabad Rains: ఒక్క వాన.. ఒకే ఒక్క వాన.. రుతుపవనాలొచ్చిన తర్వాత కురిసిన ఆ ఒక్క వాన హైదరాబాద్కు తన ప్రతాపమేంటో చూపించింది. నగరవాసికి, వాహనదారులకు తాను గట్టిగా కురిస్తే ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చేసింది. మండే ఎండల నుంచి రిలీఫ్నిచ్చేలా కురుస్తుందనుకున్న వాన ఒక్కొక్కరిగా ఈ వానేంట్రా బాబూ అని మండిపోయేలా కురిసింది. ఎస్ కొండాపూర్-కొత్తగూడ రూట్ చెరువులా మారడం చూశాక ఒక్కొక్కరికి మైండ్ బ్లాంక్ అయింది. బయోడైవర్సిటీ ఏరియాలో కొన్ని నిమిషాల్లోనే కార్లు పడవల్లా తేలడం చూశాక చాలా మందికి దిమాక్ ఖరాబ్ అయింది. ఆ నీళ్లని చూసిన వాళ్లంతా ఇదెక్కడి వానరా నాయనా అని నోరెళ్లబెట్టారు. ఎస్ ఈ సీజన్లో కురిసిన తొలి వాన అదిరిపోతే హైదరాబాద్ బెదిరిపోయింది.
ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న నగరవాసులకు.. సూర్యుడు సైడ్ అయిపోయి.. ఆకాశం డల్ అయిపోయి.. వెదర్ కూల్ అయిపోతే.. ఫుల్ రిలీఫ్ ఫీల్ అవుతారు. రుతుపవనాలొచ్చాక కురిసే తొలి జల్లుల్లో తడిసి అలా గాల్లో తేలిపోతారు. కానీ.. ఆ చల్లదనం కాస్తా మొదటిరోజే ముంచేసింది. ఫస్ట్ వానే పది సెంటీమీటర్లకు పైగా పడుతుందని ఎవరూ ఊహించలేదు. తొలకరి పలకరింతకు పులకరించి పోదామనుకుంటే తడిసి ముద్దైపోయి, ఒక్కొక్కరికి తడారిపోయింది. సముద్రంలోని నీళ్లన్నీ వచ్చి హైదరాబాద్లోనే అన్లోడ్ అయిపోయాయా అన్నట్లుగా గట్టిగా ఓ వాన కురిసేసరికి భాగ్యనగరం రోడ్లు చెరువుల్లా మారిపోయాయ్. కాస్త లోతుగా ఉన్న ప్రతి ఏరియా ఇలాగే కనిపించింది. నడుము లోతు నీళ్లు.. వాహనాలనూ, వాటిని నడిపేవాళ్లనూ ముంచేశాయ్. గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్ ఒక్కొక్కరికీ నరకం చూపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వానాకాలం మొదటి వానకే.. మహానగరం అతలాకుతమైపోయింది.
సరిగ్గా ఆఫీస్ టైమ్ అయిపోయే సయానికి మొదలైన వాన.. దంచికొట్టేసింది. ఎండల ఉక్కపోతల మధ్య కుండపోతలా కురిసి.. సిటీలోని అన్ని ఏరియాల్లోనూ కుమ్మేసింది. ఈ దెబ్బకు జంక్షన్లన్నీ జామైపోయాయ్. ఐటీ కారిడార్ అయితే అల్లాడిపోయింది. సిటీలోని చాలా జంక్షన్లు జామ్ అయిపోయాయ్. కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్పేట్, పంజాగుట్ట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ సిటీలో ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎటు వైపు చూసినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయ్. హైదరాబాద్ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే పరిస్థితి మరీ ఘోరం. బ్రిడ్జ్ మొత్తం రెడ్ సిగ్నల్ పడిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాల వరుస చూశాక ఐటీ కారిడార్ రెడ్ అలర్ట్లా కనిపించింది. కొండాపూర్, బయో డైవర్సిటీ లాంటి ఏరియాల్లో అయితే బైకులు, కార్లు వర్షపు నీళ్లలోనే చిక్కుకుపోయాయ్. కొందరి వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయ్. ఆ బాధ వర్ణనాతీతం. చాలా మంది వాహనాలు తోసుకుంటూ వెళ్లారు. అనేక సిగ్నళ్ల దగ్గర చుక్కలు కనిపించాయ్. సాధారణంగా అరగంట పట్టే జర్నీకి రెండు నుంచి మూడు గంటలు పట్టిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Also Read: భారతదేశంలో ఫుట్బాల్ సంబరం ఎక్కడంటే?.. ఎక్స్పర్ట్ ప్యానెల్లో భైచుంగ్ భూటియా!
రోడ్లపై ట్రాఫిక్ భయంతో.. హైదరాబాద్ జనం మెట్రో స్టేషన్లకు పోటెత్తారు. రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అమీర్ పేట్, ఎల్బీనగర్, మియాపూర్, కూకట్పల్లి లాంటి స్టేషన్లలో ప్లాట్ ఫామ్స్, కాన్కోర్స్ కిక్కిరిసిపోయాయ్. మెట్ల మీద నుంచి మొదలుపెడితే టికెట్ కౌంటర్ల దాకా కాలు పెట్టే సందు లేకుండా పోయింది. ఇలాంటి సీన్లు హైదాబాద్ మెట్రోకు కొత్తేం కాదు. ఎప్పుడు గట్టిగా వర్షం వచ్చినా ఇంటికెళ్లేందుకు జనానికి కనిపించే మొదటి ఆప్షన్ మెట్రోనే. అదొక్కటే సేఫ్ అని అందరి అడుగులు అటే పడతాయ్. దెబ్బకు మెట్రోపై ప్రెజర్ పెరుగుతుంది.
అసలు హైదరాబాద్లో చినుకు పడితే సిటికీ వణుకు పుట్టాల్సిందేనా? వర్షం ముంచెత్తితే భాగ్యనగరం మునగాల్సిందేనా? వానొచ్చినా.. వరదొచ్చినా ఎదుర్కొనేదెలా? అనే ప్రశ్నలు ప్రతి వానాకాలం సీజన్లో తలెత్తుతున్నాయ్. ఎప్పుడు కుండపోత వర్షం కురిసినా ఐటీ కారిడార్ నుంచి ఓల్డ్ సిటీ దాకా ట్రాఫిక్ జామ్లు, మోకాళ్ల లోతు నీళ్లు, కరెంట్ కోతలతో నగరం స్తంభించిపోతోంది. భాగ్యనగరం కాస్తా వానొస్తే వరదల నగరంగా మారుతోంది. హైదరాబాద్కు ఉన్న సిటీ ఆఫ్ లేక్స్ ట్యాగ్ కాస్తా చెరిగిపోయి సిటీనే ఇప్పుడు లేక్లా మారుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకే జనం అంటున్నారు. హైదరాబాద్ ఆఫీసర్లూ ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి అని! మాన్సూన్ యాక్షన్ ప్లాన్తో గ్రౌండ్లోకి దిగితేనే నగరవాసులకు రోడ్లపై ఇక్కట్లు తప్పుతాయని గుర్తు చేస్తున్నారు.
Also Read: India Nuclear: బిల్డప్ ఎక్కువ.. బాంబులు తక్కువ.. అణ్వాయుధాల మోహరింపులో పడిపోయిన పాకిస్తాన్..!