India: మనదేశంలోకి చైనా చొచ్చుకొస్తోంది. సరిహద్దులు మార్చేస్తోంది. ఇది మాదే, అది మాదే అంటూ నానా యాగీ చేస్తోంది. డ్రాగన్ కంట్రీకి ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమే చెబుతోంది. చైనా చొరబాట్లను అంతే స్ట్రాంగ్ గా తిప్పికొడుతున్నారు మనోళ్లు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చైనా బోర్డర్ లో పరిస్థితిని సమీక్షిస్తూ.. అలర్ట్ గా ఉంటోంది.
ఇలాంటి వార్తలే మనం రెగ్యులర్ గా వింటుంటా. కానీ, ఇప్పుడు చదవబోయే న్యూస్ కంప్లీట్ డిఫరెంట్. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టే.. కొందరు అనుమానిస్తున్నట్టే.. చైనా మనదేశంలోకి చొచ్చుకువచ్చేసింది. సరిహద్దుల్ని ఇప్పటికే మార్చేసింది. మన ఆర్మీ నిర్లక్ష్యం వల్ల.. తూర్పు లద్దాఖ్ లో ఏకంగా 26 గస్తీ పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఆ మేరకు ఆ ప్రాంత సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరు గతవారం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ విషయం నేషనల్ మీడియాలో బ్రేకింగ్ స్టోరీస్ గా హోరెత్తుతోంది.
“తూర్పు లద్దాఖ్, కారాకోరం పాస్ నుంచి చుమూర్ వరకు 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ క్రమం తప్పకుండా ఇక్కడ గస్తీ చేయాలి. కానీ, 26 పాయింట్లకు మన బలగాలు వెళ్లలేకపోతున్నాయి” అని లేహ్ ఎస్పీ పి.డి. నిత్య కేంద్రానికి అందించిన నివేదికలో వెల్లడించారు. ఆ రిపోర్ట్ ను గత వారం ఢిల్లీలో జరిగిన పోలీస్ సదస్సులో.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా, ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ సమక్షంలో కేంద్రానికి సమర్పించారు.
ఆ 26 చెక్ పోస్టుల్లో భారత్ గస్తీ లేకపోవడంతో.. ఆ భూభాగాలను చైనా కలిపేసుకుంటోంది. బఫర్ జోన్లను సృష్టించి సరిహద్దును వెనక్కి నెడుతోంది. చైనా ఆక్రమించుకొనే ఈ వ్యూహాన్ని ‘సలామీ స్లైసింగ్’ అంటారని ఆ నివేదిక తెలిపింది.
ఎత్తైన శిఖరాలపై కెమెరాలను అమర్చి.. భారత్ దళాల కదలికలను చైనా గమనిస్తోంది. బఫర్ జోన్లోకి మన సాయుధ బలగాలు ప్రవేశించిన వెంటనే ఈ భూమి తమదంటూ డ్రాగన్ ఆర్మీ అభ్యంతరం చెబుతోంది. ఆ తర్వాత మరింత బఫర్ జోన్ ఏర్పాటు పేరుతో భారత్ను మరింత వెనక్కి నెడుతోంది. ఇలా ‘సలామీ స్లైసింగ్’ వ్యూహంతో తూర్పు లద్దాఖ్ లో 26 గస్తీ పాయింట్లను మనకు కాకుండా చేయడంలో చైనా సక్సెస్ అయిందనేది ఆ ప్రాంత పోలీసుల నివేదిక. మరి, ఈ రిపోర్ట్ పై కేంద్రం స్పందిస్తుందా? ఖండిస్తుందా?