Indiramma Housing Lucky Draw: హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ టవర్స్లో నిర్మించనున్న ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి లక్కీ డ్రా ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ లక్కీ డ్రాలో ఊహించని విధంగా జరిగిన రెండు సంఘటనలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జరిగిన ఘటన అక్కడ ఉన్నవారందరినీ ఒక్కసారిగా షాక్కు గురిచేసింది.
ఘనంగా ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆగస్టు 28 నుంచి హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం లక్కీ డ్రా ప్రక్రియ మొదలైపోయింది. నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పారదర్శకత కోసం లక్కీ డ్రా టోకెన్లను అక్కడ ఉన్న చిన్న పిల్లల చేతుల మీదుగా తీయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టోకెన్ తీసిన బాబుకే దక్కిన లక్కీడ్రా
అయితే రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవుపల్లి లక్ష్మీగూడలో లక్కీ డ్రా జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అక్కడ ఒక చిన్నారిని పిలిచి లక్కీ డ్రా టోకెన్ తీయించారు. తీరా ఆ టోకెన్లో వచ్చిన పేరు చూసి అక్కడున్న లబ్ధిదారులు, అధికారులు అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఏ చిన్నారైతే వచ్చి టోకెన్ తీసిందో, సరిగ్గా ఆ పాప కుటుంబం పేరే ఆ లక్కీ డ్రాలో వచ్చింది మరి. ఇల్లు ఎవరికి దక్కుతుందో అని టోకెన్ తీసిన బాబుకే చివరికి ఆ అదృష్టం వరించడం ఇక్కడ విశేషం.
నాంపల్లి నియోజకవర్గంలో కూడా
ఇక సరిగ్గా ఇలాంటి ఘటనే నాంపల్లి నియోజకవర్గంలో కూడా జరిగింది. అక్కడ మొదటి టోకెన్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక బాబుతో తీయించారు. ఆ తర్వాత కొన్ని టోకెన్లు తీసిన తర్వాత , మొదట టోకెన్ తీసిన ఆ బాబు కుటుంబం పేరు కూడా లక్కీ డ్రాలో ఎంపికైంది. దీంతో ఈ రెండు సంఘటనలు ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో ప్రత్యేక నిలిచాయి.
సంతోషం కలిగించింది అన్న పొంగులేటి
ఈ విషయానిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. డ్రాలో జరిగిన ఈ రెండు సంఘటనలు తనకు చాలా సంతోషంతో పాటు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పారు. సాధారణంగా లక్కీ డ్రా అంటే ఎవరికి ఇల్లు వస్తుందో అని చివరి వరకు తీవ్ర ఉత్కంఠ ఉంటుంది, అలాంటిది టోకెన్ తీసిన చిన్నారుల కుటుంబాలకే సొంతిల్లు దక్కడంతో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
నిజమైన అర్హత ఉన్న మరొకరికి అవకాశం
అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్నది తుది కేటాయింపు మాత్రమే కాదని మంత్రి స్పష్టం చేశారు. లక్కీ డ్రా ద్వారా మొదటగా లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేపడతారు. వారి అర్హతలను మరోసారి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే తుది లబ్ధిదారులను సెలెక్ట్ చేసి మంజూరు పత్రాలు అందజేస్తారు. ఒకవేళ లక్కీ డ్రాలో పేరు వచ్చినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎవరైనా అనర్హులుగా తేలితే, వారి స్థానంలో నిజమైన అర్హత ఉన్న మరొకరికి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి డ్రాలో పేరు రాగానే ఇల్లు వచ్చినట్టు కాదని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలి.
కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే
మరోవైపు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులను వేగంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తుది ఎంపిక, మంజూరు పత్రాల ఇచ్చిన తర్వాత కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం జరుగుతున్న సమయంలో లబ్ధిదారులు ఎప్పుడైనా నిర్మాణ ప్రదేశాలకు వెళ్లి పనుల నాణ్యతను పరిశీలించుకోవచ్చని ఆయన తెలిపారు. నిర్మాణ నాణ్యతను ప్రశ్నించే పూర్తి హక్కు లబ్ధిదారులకు ఉంటుందని, ప్రభుత్వం ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పనులు పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఇల్లు రావడం నిజంగా అదృష్టం
హైదరాబాద్లోని మొత్తం 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయించే ప్రక్రియ జరగనుంది. మొత్తం 480 ఫ్లాట్లకు సంబంధించి 600 మంది లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ డ్రా ప్రక్రియ ఆగస్టు 31తో ముగుస్తుంది. ఆ తర్వాత చివరిగా పరిశీలించి అర్హులైన వారికి మంజూరు పత్రాలు ఇస్తారు. మొత్తానికి ఇల్లు వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్న వేళ, టోకెన్ తీసిన చిన్నోడికే ఇల్లు రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి.