Hormuz Crisis: ఒకవైపు శాంతి చర్చలు. మరోవైపు యుద్ధం ముగించేందుకు తాత్కాలిక ఒప్పందాలు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న టైమ్లో.. మరోసారి హైడ్రామా మొదలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి చుట్టూ మళ్లీ సస్పెన్స్ నెలకొంది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు నిరసనగా.. హర్మూజ్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. దాంతో ప్రపంచ దేశాలన్నీ షాక్కి గురయ్యాయ్. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంలోని నిబంధనలను, అమెరికా హెచ్చరికలను లెక్కచేయుండా.. లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. శనివారం చేసిన దాడుల్లో 30 మందికి పైగా చనిపోయారు. దాంతో.. తీవ్రంగా స్పందించిన ఇరాన్ మిలటరీ కమాండ్.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా వైఖరి దురుద్దేశపూర్వకంగా ఉందని, హామీలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించింది. ఇదిలాగే కొనసాగితే.. తదుపరి చర్యలకు దిగుతామని హెచ్చరించింది.
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో హర్మూజ్ జలసంధి తెరచుకుంది. దాని మీదుగా ఇప్పుడిప్పుడే చమురు నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఇంతలోనే.. ఇరాన్ నుంచి మళ్లీ మూసివేత ప్రకటన రావడంతో.. అనేక దేశాల్లో ఆందోళన నెలకొంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ ఇరాన్ మూసివేయడంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజుల్లో ఇరాన్తో ఆఖరి ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ వసూలు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు యూఎస్ అందించిన రక్షణ సేవలకుగానూ.. ఆ డబ్బు తీసుకుంటామన్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు టోల్ రహిత ప్రయాణం ఉండాలన్నారు ట్రంప్. యూఎస్ సెంట్రల్ కమాండ్ కూడా హర్మూజ్ మూసివేతపై స్పందించింది. జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని స్పష్టం చేసింది. హర్మూజ్లో సాధారణ పరిస్థితులే కొనసాగేలా.. అమెరికా దళాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. ఇప్పటికే.. 55 కమర్షియల్ క్రూడ్ ఆయిల్ నౌకలు హర్మూజ్ దాటాయ్.
Storey By: Anup Big Tv
Also read: రూ.1000 లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు.. తక్కువ బడ్జెట్లో అదిరిపోయే సౌండ్ గురూ!
లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడులు.. అమెరికాతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ చెబుతోంది. మరోవైపు.. అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య స్విట్జర్లాండ్లో చర్చల వేళ.. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు కొనసాగిస్తోంది. సరిహద్దుల దగ్గర ఇజ్రాయెల్ ప్రలు పాలస్తీనియన్లపై దాడులు చేసినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఎదుర్కొనేందుకు, తాము ఎదురుదాడులు చేయాల్సి వస్తోందని హెజ్బొల్లా చెబుతోంది. శనివారం ఒక్కరోజే.. లెబనాన్లోని వంద టార్గెట్లకు పైగా ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అమెరికా-ఇరాన్ చర్చల కోసం యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్విట్లర్జాండ్కు వెళ్లారు. అణ్వాయుధాల అంశం, లెబనాన్ కాల్పుల విరమణ అంశంపై పురోగతి ఉండొచ్చంటున్నారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని, ఉద్రిక్తత కొంత తగ్గుతోందని చెప్పారు.
ఓ వైపు యుద్ధాన్ని ముగించేందుకు రాయబారాలు, చర్చలు, ఒప్పందాలు కుదురుతున్నప్పటికీ.. హర్మూజ్ వేదికగా సాగుతున్న పరిణామాలు పొలిటికల్ మైండ్ గేమ్స్ శాంతి నెలకొనకుండా చేస్తున్నాయ్. హర్మూజ్ని ఇరాన్ తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుందా? అమెరికా, ఇజ్రాయెల్ని హెచ్చరించడానికే.. ఈ మైండ్ గేమ్ ఆడుతోందా? అన్నది త్వరలోనే తేలిపోనుంది. ఏదేమైనా హర్మూజ్ చుట్టూ నడుస్తున్న నడుస్తున్న సస్పెన్స్ ఎన్నో ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది.
Also read: వరంగల్, ఖమ్మంలో బీజేపీ అంత వీకా?.. మున్సిపల్ ఎన్నికల ముందే లీకైన బీజేపీ పార్టీ బలహీనతలు!