శత్రువుకు శత్రువు మిత్రుడంటారు. ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులయ్యారు. ఒకరు కేటీఆర్, మరొకరు నిజామాబాద్ బీజేపీ ఎంపి ధర్మపురి అర్వింద్. మరి శత్రువెవరు? రేవంత్ రెడ్డే కదా? కాదు ఇక్కడే తప్పులో కాలేశారు. కవిత. ఇదేం ట్విస్టు. అవును.. అర్వింద్కు బద్ద శత్రువు కవిత. కవితను ఓడించి ఎంపీగా గెలిచాడు. తన తండ్రి బీఆరెస్లోకి వెళ్లడానికి కవితే కారణం అని బలంగా నమ్ముతాడు అర్వింద్.
తన గెలుపు కోసం తండ్రి రాజకీయాన్ని ఆగం చేశారనే కోపం ఉంది అర్వింద్కు. అందుకే కవిత ప్రస్తావన రాగానే విరుచుకుపడతాడు. కేసీఆర్నూ తుక్కు తుక్కు తిడతాడు. కానీ ఈ మధ్య రేవంత్నే టార్గెట్ చేస్తున్నాడు. అచ్చం కేటీఆర్లాగే. తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్లే చేస్తున్నాడు సీఎంపై.
రేవంత్రెడ్డి.. ఇంజినీరింగ్ విద్యనుద్దేశించి.. కనీసం వారికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా రాదు.. అని కామెంట్ చేయడం.. క్రిమినల్ వేస్ట్ అనే పదం వాడటం వివాదానికి తెర తీసింది. దీనిపై బీఆరెస్ గగ్గోలు పెడుతోంది. విమర్శలు చేస్తోంది. కేటీఆర్ మొన్న ప్రెస్మీట్లో స్పందిస్తూ.. అసలు నీకు నీ ఎన్నికల అఫిడవిట్ను నింపడానికి వస్తుందా? నువ్వేం చదువుకున్నావు? గోడకు సున్నాలేసుకుని బతికావు.. అంటూ పర్సనల్ అటాక్ చేశాడు.
సేమ్ ఇదే టైప్ కామెంట్లు చేశాడు అర్వింద్ కూడా. నీ ఎన్నికల అప్లికేషన్ ఫామ్ నీకు నింపుకోవడానికి వస్తదా? చదువు లేని సీఎం.. విద్యాశాఖకు మంత్రా? ఆ మంత్రిత్వ శాఖను చదువుకున్న శ్రీధర్ బాబుకు ఇవ్వు.. అని అంటూ హేళనగా మాట్లాడాడు. ఈ మధ్య కేటీఆర్ను ఏం విమర్శించడం లేదు. అడపా దడపా కేసీఆర్ను పొగుడుతున్నాడు. బీజేపీని బొంద పెట్టిండంటే కేసీయారే… ఈ రేవంత్తోని ఏమీ కాదు.. అంటూ .. బీఆరెస్ను లేపే ప్రయత్నం చేస్తున్నాడు.
ఫామ్హౌజ్లో ఉన్న కేసీఆర్కు బూస్టింగ్ ఇస్తున్నాడు. తద్వారా కేటీఆర్ను ఇండైరెక్టుగా ఎత్తుకుంటున్నాడు. కవిత ఎప్పుడైతే బయటకు వచ్చారో.. కొత్త పార్టీ పెట్టారో.. ఆమె కేటీఆర్ను, బీఆరెస్ను టార్గెట్ చేస్తున్నారు. పదేళ్ల పాలన పాపాలను ఎత్తి చూపుతున్నారు. కేసీఆర్ పాలన తీరులోని వైఫల్యాల వల్ల ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ షాడో సీఎంగా కొనసాగిన వైనాన్నీ, అప్పుడు పట్టింపులేనితనాన్ని, నిర్లక్ష్యాలపై విరుచుకుపడుతున్నారు.
ఇదంతా చూసిన తరువాత బహుశా కేటీఆర్కు రక్షణగా ఉండాలని అర్వింద్ ఏమైనా భావించి ఉంటాడా? అనే అనుమానాలు వచ్చేలా ఆయన కామెంట్స్ ఉంటున్నాయి. కవిత తనకు శత్రువు.. ఇప్పుడు కేటీఆర్కూ శత్రువే.. శత్రువుకు శత్రువు మిత్రుడే అనే సమీకరణతో లోపాయికారిగా ముందుకు పోతున్నాడా? అనే చర్చ కూడా రాజకీయ సర్కిళ్లలో మొదలైంది.
బీజేపీ, బీఆరెస్ కలవబోతున్నాయనే ప్రచారం ఉన్న నేపథ్యంలో .. ఇప్పుడు బీఆరెస్ను కాదని, ఎక్కువగా సీఎం రేవంత్రెడ్డినే టార్గెట్ చేశాడు అర్వింద్. ఎంతలా అంటే.. మిగిలిన బీజేపీ సీనియర్ నేతలెవరూ కూడా సీఎం రేవంత్రెడ్డి ని ఇంతలా టార్గెట్ చేయడం లేదు. తన సొంత ఎజెండా అమలు చేయడం అర్వింద్కు ఆది నుంచి అలవాటే కానీ, ఈ మధ్య బీఆరెస్ను కాపాడుతున్నట్టు.. దానికి మైలేజీ చేకూరేలా తన పొలిటికల్ స్టాండ్ మార్చుకున్నట్టుగా అనిపిస్తున్నది.
కవిత పార్టీ విషయంలో కూడా అతడు స్పందిస్తూ… అదొక పార్టీనా? అని హేళనగా మాట్లాడటం ద్వారా కవిత తనకు ఎప్పటికీ శత్రువే.. అనే సందేశమిస్తున్నాడు మీడియా ముఖంగా. అంటే ఆమెను రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలనే భావన అర్వింద్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు దోస్తులయ్యారు. కవిత వల్ల. కవిత కోసం…!