Voice Plans: మీరు వాడండి.. వాడకపోండి.. ఇండియాలో మొబైల్ యూజర్లంతా ఇంటర్నెట్ డేటా కోసం కూడా ఛార్జీలు చెల్లించాల్సిందే! అలా.. దేశంలో డేటా వాడని వాళ్లంతా ఏడాదికి 20 వేల కోట్ల వరకు టెల్కోలకు అదనంగా చెల్లించాల్సి వస్తుందనే రిపోర్టులున్నాయి. దాంతో.. ఈ అనవసర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ట్రాయ్ కీలక ప్రపోజల్ తీసుకొచ్చింది. మొబైల్లో ఇంటర్నెట్ వాడని తక్కువ ఆదాయ వర్గాలు, వృద్ధులు, ఫీచర్ ఫోన్లు వినియోగించే వారి కోసం కేవలం వాయిస్ కాల్స్, SMS సర్వీసులతో కూడిన అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లను విధిగా తీసుకురావాలని ప్రతిపాదించింది. దీనిని.. దేశీయ టెలికాం దిగ్గజాలైన.. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయ్. టారిఫ్ నిర్ణయాలను మార్కెట్కే వదిలేయాలన్న పాలసీకి ఇది విరుద్ధమని వాదిస్తున్నాయ్. ప్రస్తుత టారిఫ్ విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా, యథాతథ స్థితి కొనసాగించాలని టెల్కోలు కోరుతున్నాయి.
ఒక్కో యూజర్పై వచ్చే సగటి రాబడిని పెంచుకునేందుకు టెలికాం సంస్థలకు డేటా ఛార్జీలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయ్. కొన్నేళ్లుగా తమ వినియోగదారులను బేసిక్ ఫీచర్ ఫోన్ల నుంచి.. 4జీ, 5జీ స్మార్ట్ఫోన్ల వైపు మళ్లించడం ద్వారా, డేటా వినియోగం అధికం చేసి, లాభాలు ఆర్జించేందుకు టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి టైమ్లో తక్కువ ధరకే వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లు తెస్తే.. తమ ఆదాయం తగ్గిపోతుందని ట్రాయ్ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు. అయితే, టెల్కోల తీరుని వినియోగదారుల హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయ్. దేశంలో దాదాపు 35 కోట్ల మంది ఫీచర్ ఫోన్లు వాడుతున్నారు. వీరిలో 10 నుంచి 15 కోట్ల మందికి ఇంటర్నెట్ అవసరమే లేదనే అంచనాలున్నాయ్. అయితే, అన్ని ప్రీపెయిన్ ప్లాన్లలో డేటా తప్పనిసరి చేయడంతో.. డేటా వాడని వారు ఏటా 15 వేల నుంచి 20 వేల కోట్ల వరకు టెల్కోలకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు.
Also read: సిద్ధిపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ కన్ను.. సీటు కొట్టేందుకు గాంధీభవన్లో వేసిన బిగ్ ప్లాన్ ఇదే..?
ఇప్పుడున్న 4జీ, 5జీ నెట్వర్క్లు పూర్తిగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ బేస్డ్ అని టెలికాం సంస్థలు చెబుతున్నాయ్. ఇందులో వాయిస్ కాల్స్ సైతం.. డేటా నెట్వర్క్పైనే, ఓ అప్లికేషన్లాగా పనిచేస్తాయని అంటున్నాయ్. అందువల్ల నెట్వర్క్ స్థాయిలో వాయిస్ని, డేటాను వేరు చేయడం టెక్నికల్గా కష్టమంటున్నాయ్. దేశమంతా డిజిటల్ వైపు పరుగులు తీసున్న వేళ డేటా లేని రీఛార్జ్ ప్లాన్లని తీసుకొస్తే సమాజంలోని ఓ వర్గాన్ని డిజిటల్ వ్యవస్థకు దూరం చేసినట్లే అవుతుందని అంటున్నాయ్ టెల్కోలు. డేటా లేని ప్లాన్లు ఇచ్చి, వాడినప్పుడే బిల్లు విధానం తెస్తే గతంలో మాదిరిగానే భారీ బిల్లులు వస్తాయని వివరిస్తున్నాయ్. మరి ట్రాయ్ తన ఆదేశాలకే కట్టుబడి ఉంటుందా? మరేదైనా కొత్త మార్గం చూపిస్తుందా? అని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also read: Hormuz Crisis: ప్రపంచ దేశాలకు పెద్ద షాక్.. చమురు నౌకలు వెళ్ళే మార్గాన్ని మూసివేసిన ఇరాన్ సైన్యం!