Jana Sena: ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆశించిన స్థాయిలో జరగలేదా? చాలా ప్రాంతాల్లో ఆవిర్భావ వేడుకలకు కార్యకర్తలు నేతలు ఎందుకు దూరంగా ఉన్నారు? ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేదికల మీదే జనసేన నాయకులు బాహాబాహీ కి దిగడం దేనికి సంకేతం? గ్రౌండ్ లెవెల్ లో జనసేన పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఆవిర్భావ వేడుకల్లో బయట పడిందా? జనసేన పార్టీ ఇలాంటి పరిణామాలు ముందే ఊహించిందా? అందుకే రాష్ట్రస్థాయి వేడుకలకు దూరంగా ఉందా? ఇంతకీ జనసేన ఆవిర్భావ వేడుకలు అంత వివాదాస్పదంగా ఎందుకు తయారయ్యాయి?
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీలో రాజకీయ దుమారాన్ని రేపాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేయాలని పార్టీ ఆదేశించినప్పటికీ.. నాయకులు సమష్టిగా కాకుండా, ఎవరికి వారు ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.. మొదటిసారి పవన్ కళ్యాణ్ మాటను, ఆ పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ… నాయకులు ఎవరికి వారు .. వారి బల ప్రదర్శన చూపిస్తూ జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.. అంతేకాదు చాలాచోట్ల జనసేన ఆవిర్భావ వేడుకలు ఆశించిన స్థాయిలో జరగలేదన్న చర్చ జనసేన వర్గాల్లో నడుస్తోంది.
దానికి ప్రధాన కారణం 20 నెలలకు పైగా జనసేన పార్టీలో ఉన్న అసంతృప్తి సెగలే అనే చర్చ నడుస్తుంది.. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి విషయంలో, నీటి సంఘాల పదవుల విషయంలో పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా… ఇతర పార్టీ నుండి వచ్చిన వారికి పెద్ద పీట వేయడం పై గత ఎన్ని రోజులుగా అంతర్గతంగా అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయంట… అంతేకాదు పార్టీలో పని చేసిన వారికి ప్రాధాన్యత దక్కలేదంటూ చాలామంది నేతలు బహిరంగగానే విమర్శలు ఎక్కు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజా జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు చాలామంది నేతలు, కార్యకర్తలు దూరంగా ఉన్నట్లు సమాచారం. పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి న్యాయం జరగనప్పుడు… పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఎందుకు పాల్గొనాలంటూ కొంతమంది బహిరంగంగానే కామంట్లు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు చాలా చోట్ల ఆశించినంత స్థాయిలో జరగలేదు అనే చర్చ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తుంది.
వాస్తవానికి జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు విషయంలో గత వారం నుండి కొంత వివాదం జరుగుతూనే వస్తుంది… పార్టీ ఆవిర్భావ వేడుకలు మొదటిగా పిఠాపురంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావించినా… వేరే రాజకీయ కారణాల వాటిని రద్దు చేశారు… తర్వాత రాష్ట్ర స్థాయి యూత్ మీటింగ్ నిర్వహించాలని భావించినా అది కూడా కార్యరూపం దాల్చలేదు… పార్టీ ఆవిర్భావ వేడుకల విషయంలో జనసేన పార్టీ ఎందుకో సరైన స్పష్టత లేకుండా రకరకాలు నిర్ణయాలు తీసుకోవడంపై రాజకీయంగా పెద్ద చర్చే సాగింది.
జనసేన పార్టీలో గ్రౌండ్ లెవెల్ లో ఆశించినంత పాజిటివిటీ లేకపోవడం, నేతలు, కార్యకర్తల్లో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలోనే.. పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రస్థాయిలో నిర్వహించకుండా వెనక్కి తగ్గారని ప్రచారం సాగింది… అయితే జిల్లా స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గస్థాయిలో పార్టీ వేడుకలు నిర్వహించాలని ఆదేశించినప్పటికీ… పార్టీ ఆదేశాలను ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక పార్టీ రాష్ట్రస్ధాయి ఆవిర్భావ వేడుకలు జరగకపోవడం పక్కనపెడితే…. నాయకుల మధ్య విభేదాలు, కొట్లాటలకు జిల్లా, నియోజకవర్గాల్లో జరిగిన ఆవిర్భావ వేడుకలు వేదికగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా రాజమండ్రిలో అక్కడ స్థానిక జనసేన నేతలు ఎవరికి వారు విడివిడిగా ఆవిర్భావ వేడుకలు జరపడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.. స్థానిక నాయకుల విభేదాలు దెబ్బకు.. జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జులు ఎక్కడ ఆవిర్భావ వేడుకలలో పాల్గొనాలో తెలియక… సైలెంట్ గా ఇంటికి పరిమితమయ్యారని టాక్ వినబడుతుంది.
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను… ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో చేసిన కామెంట్స్ రాజకీయంగా వైరల్ గా మారాయి… కూటమి నేతలను తాము గౌరవిస్తుంటే.. జనసేన పార్టీ నాయకులను కూటమి నేతలు సరిగా గౌరవించడం లేదని… ముఖ్యంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో .. జనసేన పార్టీ నాయకులను చాలా చులకనగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇవే కాకుండా చాలా ప్రాంతాలలో .. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలలో స్థానిక నాయకులు.. తమ మనసులోని ఆవేదనలు వెళ్ళగక్కారు.. పార్టీని నమ్ముకుని, పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తుంటే … నియోజకవర్గాల్లో కనీస గౌరవం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు .
ఆ క్రమంలో పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల పైన… జనసేన పార్టీ అధిష్టానం సీరియస్గానే ఫోకస్ పెట్టినట్టు సమాచారం… ఆవిర్భావ వేడుకలు ఆశించినంతగా జరగకపోవడం, నాయకులు మధ్య విభేదాలు బయటపడటం వంటి విషయాల పైన అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదటిసారి ఈ విధమైన పరిణామాలు చోటే చేసుకున్న నేపథ్యంలో.. ఏం చేయాలనే దానిపైన పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు సమాచారం.. మరి దీనిపైన జనసైన్యమే తన బలమని నమ్ముతున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళతారో? తన వారినందర్నీ ఎలా గాడిలో పెడతారో చూడాలి.
Also Read: గన్నేరు పప్పు తిని ఎస్సై భార్య ఆత్మహత్య.. కారణం తెలిస్తే?
Story by: Apparao, Big Tv