Kalvakuntla Kavitha: ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను .. మీ అందరి భరతం పడతాను .. మీరు చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టి మీ అందరిని రోడ్డు మీదకు ఈడుస్తాను..నాతో పెట్టుకుంటే మీ అందరి బాగోతం బట్టబయలు చేస్తా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. అసలు కవిత వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? కవిత వార్నింగులు ఇస్తుంది ఫ్యామిలీ మెంబర్స్కా? అధికారంలో ఉన్నప్పుడు కవితను బుల్డోజ్ చేయడానికి చూసిన సీనియర్ నేతలకా? అసలు జాగృతి ప్రెసిడెంట్ పొలిటికల్ వ్యూహమేంటి? ఆమె ఎవరిని టార్గెట్ చేస్తున్నారు?
దేవుడి దయవల్ల ఏదో ఒకరోజు తాను కూడా సీఎం అవుతానని.. అప్పుడు అందరి సంగతి చెబుతానని ఘాటుగానే హెచ్చరిస్తున్న కల్వకుంట్ల కవిత. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి అన్యాయాన్ని, అక్రమాల్ని తిరగతోడుతానని హెచ్చరించారు కవిత. ఆ దిశగా ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి
ఇటీవల తన గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మరికొంతమంది నాయకులకు కవిత లీగల్ నోటీసులు పంపించారు. జాగృతి జనం బాట పేరులో నియోజకవర్గాలు పర్యటిస్తున్న కవిత ఎక్కడికి వెళ్లినా చేస్తున్న ఆరోపణలు, విమర్శలు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి.. ఏదో ఒక రోజు సీఎం అవుతానన్న కవిత ఏం చేయబోతున్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తన ఎమ్మెల్సీ పదివికి కూడా రాజీనామా చేసిన కవిత రాజకీయంగా నిలదొక్కుకునేందుకు తెలంగాణ జాగృతి సంస్థ తరపున రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజలకు చేరువై, వారితో సొంతగా మమేకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణా అంతటా కలయతిరుగుతున్నారు.. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో హైదరాబాద్ లో తమ యాత్ర కొనసాగించారు..
రానున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కవిత ముందుకు వెళ్తున్నట్లుగా జాగృతి నాయకులు మాట్లాడుకుంటున్నారు. జాగృతిలో కవిత తర్వాత మరో బలమైన లీడర్ లేరు.. అలాంటిది సరైన నాయకత్వం లేకుండా కవిత మున్ముందు రోజుల్లో ముఖ్యమంత్రి ఎలా అవుతారు? అనే ప్రశ్న అందరి మదిలో ఉత్పన్నం అవుతుంది.. కేసీఆర్ దేవుడంటూ ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయంటున్న కవిత తన మాటల దాడిలో కేటీఆర్, హరీష్రావు, ఇతర బీఆర్ఎస్ నేతలను కూడా వదలడం లేదు. మరోవైపు తన తనయుడు ఆదిత్యను పొలిటికన్ స్కీన్పై ఫోకస్ చేస్తూ.. కేసీఆర్ నిజమైన వారసులం తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలా తండ్రి సెంటిమెంట్ తనకు ప్లస్ అవుతుందని జాగృతి అధ్యక్షురాలు భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేసిన అక్రమాలు, దాష్టీకాలను తాను బయటపెడుతుంటే తనపై, తన భర్తపై ఆ పార్టీ నేతలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇకనుంచి అలా చేస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని కవిత ఘాటుగా వార్నింగ్లు ఇస్తున్నారు. కాంగ్రెస్తొ అంటకాగుతున్నానని ఆరోపిస్తూ తన భర్త అనిల్ కుమార్, ఏవీ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వెకిలి ప్రయత్నాలు చేస్తున్న గుంటనక్కలు జాగ్రత్త అని తీవ్రంగా స్పందించారు. తాను కేవలం టాస్ వేశానని, ఇప్పటికే గెలిచామని టెస్ట్ మ్యాచ్ ముందు ఉందని వ్యాఖ్యానించారు.
ఇంతకీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కవిత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది కొంత ప్రశ్నార్థకంగా మారింది. తన బావ అయిన హరీష్ రావ్ నియోజకవర్గమైన సిద్ధిపేటకు కవిత వెళ్లినప్పుడు అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ సిద్ధిపేట ప్రజలు దీవిస్తే తాను ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్తానని చెప్పుకొచ్చారు. మరి నిజంగానే సిద్ధిపేట నుంచి పోటీ చేస్తారా? లేదా తాను ఎంపీ గా పనిచేసిన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఒకవేళ నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోటీకి దిగుతారా? లేకపోతే తాను రాజకీయ జీవితం ఇచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై బరిలోకి దిగుతారా? అదీ కాకుండా సేఫ్ సైడ్గా మరో నియోజకవర్గం వెతుక్కుంటారా? అన్నది ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో నిలబడి విజయం సాధిస్తే ఓకే.. కానీ ఒకవేళ గెలవకపోతే ఆ రూట్ మార్చుకుని తిరిగి నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా? అలా చేస్తే ధర్మపురి అరవింద్ పై పోటీ చేసే అవకాశం ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.. చూడాలి మరి రానున్న రోజుల్లో కవిత అనుసరించే కార్యచరణ ఎలా ఉంటుందో?
Story By Ramireddy, Big Tv