Putta madhukar: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతుల హత్య కేసు సీబీఐ చేతికి వెళ్ళడంతో ఇప్పుడు ఏం జరగుతుందోనన్న ఉత్కంఠ మొదలైంది మంధని నియోజకవర్గంలో… సీబీఐ దూకుడుగా ఉన్న నేపథ్యంలో అటు విచారణకు హాజరైన అక్కడి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అధికార పార్టీపై ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది.
నాలుగున్నరేళ్ల కిత్రం కరీంనగర్ జిల్లా మంథని సమీపంలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి 600 పేజీలకు పైగా చార్జిషీట్ దాఖలు చేసారు పెద్దపల్లి పోలీసులు. కేసు హైకోర్టులో విచారణ సాగుతున్న తరుణంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్థానిక పోలీసులు అసలు నిందితులను ఉద్దేశ్యపూర్వకంగా వదిలివేశారని పిటిషన్ వేయడమే కాకుండా సీబీఐ తో విచారణ జరిపించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
రెండేళ్ల పాటు కిషన్రావు పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు చివరికి సీబీఐ కి కేసును అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 న రంగంలోకి దిగిన సీబీఐ బృందం రామగిరి పీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాదాపు రెండు నెలల పాటు నిందితులను, సాక్షులను విచారించారు సీబీఐ అధికారులు… హత్య జరిగిన ప్రదేశాన్ని… హత్య కేసు నమోదయిన రామగిరి పోలీసు స్టేషన్, కేసు చార్జిషీట్, అప్పట్లో చేసిన విచారణ రిపోర్టులను రామగుండం పోలీసు కమిషనరేట్లను సందర్శించి స్వాధీనం చేసుకుని అధ్యయనం ప్రారంభించింది…
ఆ తర్వాత… హత్యకేసులో నిందితులుగా ఉన్న వారిని, గుంజపడుగు గ్రామానికి చెందిన వారిని, వామన్రావు సన్నిహితులను కొందరిని సీబీఐ విచారించింది… ఈ నేపథ్యంలో… ఇటీవల ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది…మొదటి నుండి వామన్ రావు తండ్రి కిషన్ రావు అరోపిస్తున్నట్లుగా మంథని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్టా మధుకర్ను విచారించారు సీబీఐ అధికారులు.
అయితే సిబిఐ విచారణకు హాజరైన తర్వాత పుట్టా మధుకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ ని పెంచాయి… వామన్ రావు దంపతుల హత్యతో తనకు సంబంధం లేదని రాజకీయంగా తనని అణచివేసేందుకు కుట్ర చేసి సీబీఐ విచారణ చేయిస్తున్నారని ఆరోపించారు.. అంతటితో ఆగకుండా మంథని మధుకర్ హత్య కేసును కూడా సీబీఐకి ఇవ్వాలని కోరారు… తన మేనల్లుడు బిట్టు శ్రీను నిందితుడిగా ఉన్నంతమాత్రన తనపై కేసు పెడతారా? సొంత కొడుకు పై కేసు ఉంటేనే తండ్రిని అరెస్ట్ చేయరని అలాంటిది అక్క కొడుకు నేరం చేస్తే తనపై కేసు ఎలా పెడతారని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
అయితే మధుకర్ చేసిన వ్యాఖ్యలను వామన్ రావు తండ్రి ఖండించారు… హత్యతో సంబంధం లేకపోతే మధుకర్ తనకు కోట్లాది రూపాయలు ఎందుకు ఆఫర్ చేశారని, వామన్ రావు మరణ వాంగ్మూలంలో పుట్టా మధు పేరు ఉందని కౌంటర్ వేశారు కిషన్ రావు… తన వెనక కాంగ్రెస్ లేదని చెప్పారు కిషన్ రావు… సీబీఐ దూకుడు అలా ఉంటే… ఆరోపణలు కౌంటర్లతో ఒక్కసారి మంథని లో హీట్ రైజ్ అయింది..
అయితే సీబీఐ ఎంక్వైరీ జరుగుతున్నది పుట్టా మధుకర్ దంపతుల పాత్ర, స్థానిక పోలీసులు విస్మరించిన అంశాలపై కావడంతో ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోందట.. నిందితులను విచారించి, రికార్డులను పరిశీలించిన తరువాత తాజాగా పుట్టా మధుకర్ దంపతులు సీబీఐ ముందు అటెండ్ అవడం ఇపుడు చర్చనీయాంశంగా మారిందట.. బిట్టు శ్రీను కేవలం తనకు మేనల్లుడు మాత్రమే అని మధుకర్ చెప్పిన నేపథ్యంలో ఆయన ఛైర్మెన్ గా ఉన్న పుట్టా లింగమ్మ ట్రస్ట్లో శ్రీను బాధ్యతలు ఏంటని, అతనికి ఆర్థిక వనరులు ఎవరు సమకూర్చారనే కోణంలో సీబీఐ ప్రశ్నించింది అనే ప్రచారం సాగుతోంది
వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐ విచారణ చేస్తుంది పుట్టా మధుకర్ పాత్ర ఉందా లేదా అనేది తేల్చేందుకే… ఆ క్రమంలో సీబీఐ మధును విచారణకు పిలిచి ఎంక్వైరీ కంప్లీట్ చేసింది… సీబీఐ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమి ఇవ్వబోతోంది… మధు విచారణ ఇంతటితో పూర్తి అయినట్టేనా..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది… మరో వైపు విచారణతో సరిపెడతారా..? అరెస్ట్ లు ఏమైనా చేస్తారా అనే చర్చలు కూడా మంథనిలో సాగుతున్నాయట … మొత్తానికి మంథని పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.
Story By Apparao, Big Tv