Karimnagar Municipal Election: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకొవడం ఆ మూడు పార్టీలకు అత్యంత కీలకంగా మారింది .. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, కరీంనగర్ ఎంపీ కేంద్రమంత్రిగా కొనసాగుతుండటం, అక్కడ ఎమ్మెల్యేగా ఓటమి ఎరుగని గులాబీ పార్టీ అభ్యర్ధి ఉండటంతో, అందరికి చూపు కరీంనగర్ కార్పొరేషన్ వైపు ఉంది. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేసేందుకు మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే డివిజన్ లలో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి.. ఆ క్రమంలో జంప్ జలానీలు పెరిగిపోవడంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నిక ఆసక్తి రేపుతోంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి సుమారుగా 3లక్షల 40వేల ఓటర్లు కార్పొరేషన్ పాలకవర్గం భవితవ్యం నిర్దేశించనున్నారు. కరీంనగర్లో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉపాధి కోసం వచ్చి జీవిస్తుంటారు. అంతేకాకుండా జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ గెలవడం రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు సార్లు తన హవా చాటింది. ఈసారి అధికార పార్టీ కాంగ్రెస్ కి ఇక్కడ గెలవడం అత్యంత కీలకంగా మారింది.
గత మన్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ ఒక్క డివిజన్లో కూడా గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఈ సారి మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుని, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే అధికారపక్షం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్కు ఈ మున్సిపాలిటీతో సంబంధం ఉంది. అక్కడ అప్రహితంగా గెలుస్తున్న గులాబీ పార్టీకి చెక్ పెట్టి 2009 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. దాంతో ఆ కార్పొరేషన్లలో గెలుపు కూడా ఆయనకు అత్యంత కీలకం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టింది.
అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో గద్దె దిగిన తర్వాత ఢీలా పడిపోయింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన ఆ పార్టీ అభ్యర్ధి గంగుల కమలాకర్ కి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. గతంలో కార్పొరేషన్లో గులాబీపార్టీ అవలీలగా మ్యాజిక్ ఫిగర్ దాటింది. అయితే ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో మరోసారి గెలవాలంటే పార్టీతో పాటు గంగుల కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మాజీ మంత్రి గంగుల కరీంనగర్లో మకాం వేసి గతంలో బీఆర్ఎస్ వీడిన వారిని మళ్లీ రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అదేవిధంగా గత ఎన్నికల్లో బిజెపి గట్టి పోటీ ఇచ్చింది. మంచి ఫలితం కూడా సాధించింది. 13 డివిజన్లో బిజెపి విజయం సాధించింది. అదేవిధంగా పలు డివిజన్లో మంచి ఓట్లను సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక్కడ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ కార్పొరేషన్లో గెలుపు బండి సంజయ్కి ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. సంజయ్ చొరవతో ఇప్పటికే వివిధ పార్టీల్లో బలమున్న నేతలు కూడా కాషాయపు కండువా కప్పుతున్నారు. అదేవిధంగా సమావేశాలు నిర్వహించి గెలుపు పై దృష్టి పెడుతున్నారు.
మొత్తానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పొన్నం ప్రభాకర్, గంగుల కమాలాకర్, బండి సంజయ్లకు పెద్ద పరీక్షలా తయారైంది. ఈ ఎన్నికల ఫలితం తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల పైన కూడా ప్రభావం చూపే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి కరీంనగర్ ఓటర్లు ఈసారి ఏ పార్టీని కరుణిస్తారో చూడాలి.
Story by: Apparao, Big Tv