ఫ్యూయెల్ ఖర్చులు తగ్గించడంతో పాటు పర్యావరణ హితమైన రవాణా పట్ల ప్రజలు మొగ్గు చూపడంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఫలితంగా వాయు, శబ్ద కాలుష్యం లేకుండా పర్యావరణ అనుకూల రవాణా మెరుగుపడుతోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు శబ్దం చేయకుండా సైలెంట్ గా వెళ్లడం మూలంగా పాదచారులు గమనించలేకపోతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు తక్కువ మొత్తంలో ఆర్టిఫీషియల్ గా సౌండ్ వినిపించేలా రూపొందించాలని ఆదేశించింది. అక్టోబర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురానున్నట్లు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) డైరెక్టర్ రెజి మథాయ్ వెల్లడించారు.
పాదచారుల భద్రతను మెరుగుపరచడానికి గంటకు 0-20 కి.మీ వేగంతో ప్రయాణించే అన్ని ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లకు అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (AVAS) తప్పనిసరి చేయనున్నట్లు మథాయ్ తెలిపారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలలోనూ అలాంటి వ్యవస్థను తీసుకొచ్చే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి వచ్చే సౌండ్ డిఫరెంట్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జనవరి 27 నుండి 30 వరకు మోషిలోని పూణే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న 19వ ఎడిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ టెక్నాలజీ (SIAT) గురించి ప్రకటించే సందర్భంలో మథాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల కోసం కాలుష్య-ఉద్గారాల జాబితాను అభివృద్ధి చేయడంలో పనిచేస్తున్న కన్సార్టియంలో ARAI ప్రమేయాన్ని కూడా మథాయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2027 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ రెండవ దశకు బాగా ఉపయోగపడుతుందన్నారు. రాబోయే భారత్ స్టేజ్ VII (BS-VII) ఉద్గార నిబంధనలకు సంబంధించి.. ఉద్గార పరిమితుల్లో గణనీయమైన మార్పులను తీసుకువచ్చే అవకాశం లేదన్నారు. దానికి కారణం, ప్రస్తుత నిబంధనలు ఇప్పటికే కఠినంగా ఉన్నట్లు చెప్పారు. అయితే, నాన్ ఎగ్జాస్ట్ ఉద్గారాలను, ముఖ్యంగా టైర్లు, బ్రేక్ల నుంచి ఉత్పన్నమయ్యే కణ పదార్థాలను నియంత్రించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కొత్త నిబంధనలు రియల్ డ్రైవింగ్ ఉద్గారాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయని వెల్లడించారు. ఇండియాలో BS-VII అధికారికంగా అమలు చేయబడటానికి ముందు, దేశం ప్రస్తుత వాహన పరీక్షలు జరుగుతున్నట్లు మథాయ్ తెలిపారు.
అటు పొగమంచు, రాత్రిపూట సవాళ్లతో కూడిన డ్రైవింగ్ పరిస్థితులను అనుసరించేలా ARAI అధునాతన పరీక్షా సౌకర్యాలను అభివృద్ధి చేస్తోందని మథాయ్ చెప్పారు. ఈ సౌకర్యాలు వెహికిల్ సెన్సార్లను, ముఖ్యంగా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్లకు సంబంధించిన వాటిని అంచనా వేయడానికి, మెరుగుపరచడానికి ఉపయోగించబడతాయన్నారు. హైడ్రోజన్ మొబిలిటీపై, 700 బార్ హై ప్రెజర్ హైడ్రోజన్ సిలిండర్ టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి ARAI ప్రతిపాదనలు పంపించింది. దీనికి రూ. 100 కోట్ల అంచనా పెట్టుబడి అవసరం. కేంద్రం నుంచి రూ. 65 కోట్లు అందించాలని కోరినట్లు మథాయ్ చెప్పారు. ఈ సౌకర్యం ప్రారంభించబడటానికి దాదాపు 18 నెలలు పట్టవచ్చన్నారు.
Read Also: ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్.. ఒకేసారి 17 ట్రక్కులు లాంచ్ చేసిన టాటా మోటార్స్!