Karimnagar Municipal Elections: కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు మొదలుపెట్టాయి. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు మిగిలిన మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని రెండు పార్టీలు పంతంతో ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచే సత్తా, సామర్థ్యం ఉన్న నేతలకే టికెట్లు కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటినుంచే మునిసిపల్ ఎన్నికలకు ఈ రెండు పార్టీలు సన్నద్ధమవుతుండగా.. బీఆర్ఎస్లో మాత్రం ఎలక్షన్ ఊసే కనిపించకపోతుండటంతో గులాబీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోయిదంట.
ఫిబ్రవరి నెలలో దాదాపు ఎన్నికలు ఖాయమైనట్లుగా తెలుస్తోంది
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దానికి సంబంధించిన కసరత్తును కూడా ప్రారంభించింది. ఓటర్ల తుది జాబితా ప్రకటించే ముందు అవసరమైన చర్యల్ని తీసుకుంటుంది. ఓటర్ల జాబితా సవరణ చేపడుతోంది. దీంతో ఫిబ్రవరి నెలలో దాదాపు ఎన్నికలు ఖాయమైనట్లుగా తెలుస్తోంది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో తలపడేందుకు ఇప్పటినుంచే ఈ రెండు పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టాయి.
కరీంనగర్ లో డివిజన్లవారీగా పార్టీ సమావేశాలు
కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేసేందుకు ప్రణాళిక వేస్తోంది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కరీంనగర్ లో డివిజన్లవారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
గెలుపు గుర్రాలకే టికెట్లని మేడిపల్లి సత్యం ప్రకటించారు
గెలుపు గుర్రాలకే టికెట్లని మేడిపల్లి సత్యం ప్రకటించారు.. కరీంనగర్ కార్పొరేషన్ లో తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురనే లేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురుతుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కరీంనగర్ లో ఎమ్మెల్యే లేకపోవడంతో పాటుగా పార్టీ బలహీనంగా ఉండడంతో కరీంనగర్ కార్పొరేషన్ ఫరిధిలో జెండా ఎగురవేయడం అంత ఈజీ కాదంటున్నారు. కొంచెం కష్టం గా ఉన్న లీడర్లు అంతా ఏకతాటిపైకి వచ్చి గట్టి ప్రయత్నాలు చెయ్యాలని.. ఇప్పటినుండే కార్పొరేషన్ పై దృష్టి సారిస్తే మేయర్ పీఠం కైవసం చేసుకోవచ్చని డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం పట్టుదలతో ఉన్నారు.
పీసీసీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని ప్రకటించారు
ఇక మిగిలిన జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాల్టీలు హుజురాబాద్ నియోజక వర్గం లో ఉండడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే వాటితో పాటు చొప్పదండి మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు మేడిపల్లి సత్యం. అందుకు తగ్గట్టుగా ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామన్నారు. గెలుపు సామర్థ్యం, అర్హత ఉన్న వారి పేర్లను తాము అధిష్టానానికి సూచిస్తామని.. పీసీసీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని ప్రకటించారు. అవసరమైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు కేటాయిస్తామన్నారు. టికెట్ల కేటాయింపులో సీనియర్లు, జూనియర్లు అంటూ తేడా ఏమీ లేదని, గెలుపు ప్రాతిపదికన ఈసారి టికెట్ల కేటాయింపు ఉంటుందని కుండలు బద్దలు కొట్టారు. అందుకు తగ్గట్టుగానే మున్సిపల్ ఎన్నికల ప్రణాళిక ఉంటుందని ఆయన ప్రకటించారు.
బీజేపీ పార్టీ సైతం మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి సత్తా చాటాలని భావిస్తోంది
మరోవైపు నామమాత్రపు పోటీ నిచ్చే బీజేపీ పార్టీ సైతం మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకోలేదు. అయితే ఈసారి కరీంనగర్ కార్పోరేషన్ స్థానాన్ని ఎట్టి పరిస్థితులలోనూ బీజేపీ గెలుచుకోవాలని భావిస్తోంది. కరీంనగర్ ఎంపీ,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారు. గత రెండు నెలల నుంచి మున్సిపల్ ఎన్నికలపై ఆయన ఫోకస్ చేశారు. ఇటీవల కూడా చొప్పదండి మున్సిపాలిటీపరిధిలోని బిజెపి నేతలు, కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
కరీంనగర్ జిల్లాలో మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ధీమా
బెంగాల్,తమిళనాడు ఎన్నికల తర్వాత పార్టీ అధిష్టానం పూర్తిగా తెలంగాణపై దృష్టి సారించనుందని ప్రకటించారు. అందుకు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికల్లో మొదట బీజేపీ విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.అందుకే ఈసారి పార్టీ నేతలు, కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడాలని కోరారు. గెలుపు సామర్థ్యం ఉన్నవారికి టికెట్లు కేటాయిస్తామని ,టికెట్ల కోసం పైరవీలు చేయకూడదని సూచించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నేతలు ఎవరు పార్టీ వెళ్ళకూడదని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ జిల్లాలో మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్, బీజేపీలు ముందస్తు సమరానికి సిద్ధం
మొత్తానికి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్, బీజేపీలు ముందస్తు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఏకంగా అభ్యర్థుల టికెట్ల ఖరారు వరకు వెళ్లిపోయాయి. అయితే బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంతవరకు చడిచప్పుడు చేయడం లేదు. అసలు ఆ పార్టీ శ్రేణుల్లో మునిసిపల్ ఎన్నికల ప్రస్తావనే రావడం లేదు. సర్పంచ్ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ మునిసిపల్ ఎన్నికలకు ఆ స్థాయిలో మాత్రం సన్నద్ధం కావడం లేదు. ఏదేమైనా కరీంనగర్ జిల్లాలో మాత్రం అప్పుడే మునిసిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది.