KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ యాక్టీవ్ కాబోతున్నారా..? బీఆర్ఎస్ బలోపేతం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా…? మళ్లీ మనదే అధికారమంటూ కేసీఆర్ ఏ ధైర్యంతో చెప్పారు..? ఇన్నాళ్లు సైలెంట్ ఉండి..ఇప్పుడు రంగంలోకి దిగడానికి కారణాలేంటి..? వనమాసాన్ని ముగించి…జవావాసంలోకి రావాలని కేసీఆర్ నిశ్చయించుకున్నారా..? అసలు గులాబీ బాస్ నెక్ట్స్ ఏం చేయబోతున్నారు..?
తెలంగాణలో పంచాయితీ ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని పల్లెల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నర్సన్నపేటలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లతో కేసీఆర్..తన ఫాం హౌస్లో భేటీ అయ్యారు. ఈ సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయట.
ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు.. వార్డు మెంబర్లతో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు చర్చనీయంశంగా మారాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు….కష్టాలు వచ్చిన సమయంలో వెరవకూడదంటూ వారికి ధైర్యం చెప్పారట. అంతేకాదు.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందనే సంకేతాన్ని ఇచ్చారట కేసీఆర్. పల్లెల్లో తిరిగి మంచి రోజులు తప్పకుండా వస్తాయని…. అప్పటివరకు అధైర్యపడొద్దని దిశానిర్దేశం చేశారట. అయితే చాలా రోజులుగా రాజకీయంగా సైలెంట్గా ఉన్న కేసీఆర్.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై పొలిటికల్ సర్కిల్స్ తీవ్ర చర్చ నడుస్తోంది.
అంతేకాకుండా గ్రామాల్లో ఎన్నికల తీరుపై కూడా కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై డైరెక్ట్గా విమర్శలు చేయనప్పటికీ….బీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారట. దీని ద్వారా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్ధతో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు కేసీఆర్ వ్యాఖ్యలు కొంత బలం అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
పంచాయతీ ఎన్నికల పోరు పీక్కు చేరడంతో కేసీఆర్ రంగంలోకి దిగారనే చర్చ స్టార్ట్ అయిందట. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది…గ్రామాల్లో మంచి రోజులు వస్తాయి..! బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించడం వెనుక అంతర్యం ఏంటనే చర్చ నడుస్తోంది. పార్టీకి గడ్డుకాలం నడుస్తుందని కేసీఆర్ అంగీకరించారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయట. అందుకే సెలైంట్గా ఉన్నారా..? అనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పంచాయితీ ఎన్నికల తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారని… క్షేత్రస్ధాయిలో పార్టీ నిర్మాణం, పదవుల విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయట. అయితే కొందరు మాత్రం..బీఆర్ఎస్లో నెలకొన్న నైరాశ్యాన్ని పొగొట్టేందుకే కేసీఆర్ అలా మాట్లాడారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసే కేసీఆర్…మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారని విమర్శిస్తోందట. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయి…తనను.. తన పార్టీని నమ్మిన ప్రజలను, కార్యకర్తలను గాలికొదిలేసి..ఇప్పుడు ఎన్నికలనగానే..ఏ తప్పు చేయని వ్యక్తిలా.. వేదాంత ధోరణి ప్రదర్శిస్తూ…అబద్ధాలతో మళ్లీ అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారట. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన ద్రోహం, నష్టాన్ని జనం ఎప్పటికీ మర్చిపోరని ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారట.
తెలంగాణలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం సార్వత్రిక ఎన్నికలకు పార్టీలు సమాయత్తం కానున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారనే చర్చ నడుస్తోందట. అందుకే మెల్లమెల్లగా తిరిగి యాక్టీవ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది.
Story by Kishan, Big Tv