KCR: పార్టీపై గులాబీ బాస్ ఫోకస్ చేశారట. పంచాయతీ ఎన్నికలు ముగియడం…వచ్చే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయనే చర్చ నడుస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయాలనే తలంపుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యచరణ రెడీ చేస్తున్నారంట. పార్టీలోని నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు….అధినేతకు తలనొప్పిగా మారినా…వాటి సెట్ చేయాలనే భావనలో కేసీఆర్ ఉన్నారనే టాక్ నడుస్తుందట.
గులాబీ పార్టీకి కొత్త ఇన్చార్జిలు రాబోతున్నారట. అందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేపట్టినట్టు గులాబీ నేతలు ఫీలర్లు వదులుతున్నారు. ఇప్పటివరకు పార్టీ బలోపేతంపై దృష్టి సారించని పార్టీ అధినేత…పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు టాక్. గతంలో పార్టీ అసెంబ్లీ ఇన్చార్జులను నియమించగా.. కొంతమంది పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వారిని ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారనే చర్చ నడుస్తుంది. సంక్రాంతి తర్వాత అందుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు గులాబీ శ్రేణులు అంటున్నాయి.
గులాబీ పార్టీ బలోపేతంలో భాగంగా తొలుత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ల నియామకం పై కేసీఆర్ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం పని చేస్తున్న ఇంచార్జ్లలోని కొంతమందిలో సీరియస్ నెస్ కొరవడం.. పార్టీ శ్రేణులను కలుపుకుని పోకపోవడం.. స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం.. పంచాయతీ ఎన్నికల్లో సైతం ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం.. కొంతమంది ఏజ్ అయినవారు ఉండడంతో పార్టీ బలోపేతంపై వారు దృష్టి సాధించడం లేదని పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రక్షాళన చేయాలని అందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. నియోజకవర్గ ఇన్చార్జ్లు గా యువతకు అప్పగిస్తే పార్టీ బలోపేతం అవుతుందని.. మనుగడ ఉంటుందని.. అందరిని కలుపుకొని పోతారని.. ప్రజా సమస్యలపై సైతం పోరాడతారని పార్టీ భావిస్తుంది. అందుకోసం యువత పేర్లను ఇప్పటికే సేకరించినట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను సుప్రీం చేసింది. నియోజకవర్గ పార్టీ బాధ్యతలు ఎమ్మెల్యేలు అప్పగించింది. అప్పటివరకు సాఫీగా కొనసాగిన పార్టీ.. ఎమ్మెల్యేలను ఇన్చార్జ్ చేసిన తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఉద్యమకారులు, మొదటినుంచి పనిచేస్తున్న వారు .. రెండోది ఎమ్మెల్యే అనుచర వర్గంగా విడిపోయింది. మరోవైపు ఇతర పార్టీలో గెలుపొంది గులాబీలో చేరిన ఎమ్మెల్యేలకు సైతం పార్టీ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో.. పాత కొత్త నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఆ క్రమంలో నియోజకవర్గాల పార్టీ రెండుగా చీలిపోయిందనే చర్చ నడుస్తుంది.
ఎమ్మెల్యే అనుచరులకే ఏ పదవుల్లో అయనా పెద్దపీట వేస్తుండటంతో ముందు నుంచి పనిచేసిన నేతలు వ్యతిరేకిస్తున్నారట. దాని ఫలితంగానే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడిందనే టాక్ గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇదే ప్రధాన కారణమని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పార్టీ అధినేత కేసీఆర్ యువతకు ఃబాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమయ్యారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో చెక్కర్లు కోడుతోంది. ఇప్పటివరకు నియోజకవర్గ బాధ్యతలు చూసిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు కేవలం పార్టీ పదవులు అప్పగించాలని.. ఇన్చార్జి బాధ్యతలు నుంచి తొలగించాలని భావిస్తున్నట్లు టాక్. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని.. పనిచేసే కేడర్ కు గుర్తింపు లభిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.
సంక్రాంతి తరువాతే పార్టీ కమిటీల ప్రకటన ఉంటుందని సమాచారం. 2017 తర్వాత రాష్ట్ర కమిటీని నియమించలేదు. ఖాళీలను సైతం భర్తీ చేయలేదు. అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా కమిటీలను సైతం పూర్తి స్థాయిలో నియమించలేదు. కేవలం అధ్యక్షులు మాత్రమే నియమించింది పార్టీ అధిష్టానం. గ్రామ స్థాయిలో సైతం కమిటీలు వేయలేదు. వీటన్నిటిని పరిధిలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అందుకే నియోజకవర్గ ఇన్చార్జిలుగా యువతకు బాధ్యతలు అప్పగించాలని… ప్రస్తుతం ఇన్చార్జిలుగా ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని పలువురు సీనియర్ల సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను సైతం యువతకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. బీసీలకు మెజార్టీ జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టాలని నిర్ణయిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి యువత వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి… సామాజిక వర్గాల్లో బలంగా ఉన్న వారికి.. విద్యార్థి ఉద్యమాల్లో యాక్టివ్ గా పని చేసిన వారికి సైతం కమిటీలో కీలక పదవులు అప్పగించబోతున్నట్లు సమాచారం. యువతకు పదవులు ఇస్తేనే పార్టీ మరో 20 ఏళ్లకు పైగా పట్టిష్టంగా ఉంటుందని భావించే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
Story By Ramireddy, Big Tv