KCR: భారత రాష్ట్ర సమితి.. ఈ పేరును తెలంగాణా ప్రజలు పెద్దగా గుర్తు పట్టకపోవచ్చేమో.. కానీ తెలంగాణా రాష్ట్ర సమితి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే అలాంటి బీఆర్ఎస్ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు.. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ఆలోచనలు చేస్తున్నారట.. అందులో భాగంగానే ఈసారి ఏకంగా పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి తిరిగి టీఆర్ఎస్ గా మార్చేందుకు చూస్తున్నారట.. మరి గులాబీ పార్టీ యూటర్న్ తీసుకుని పేరు మార్చుకుంటే వర్కౌట్ అవుతుందా?
గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ప్రజాక్షేత్రం నుంచి దూరంగా ఉంటూ ఫామ్ హౌజ్ నుంచే పార్టీ కార్యాకలాపాలను పర్యవేక్షించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గత కొంతకాలంగా మీడియా ముందుకు కూడా రావడం తగ్గించేశారు.. అయితే ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట..
అయితే దీనికోసం స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.. అనంతరం ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి మాట్లాడారు.. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ టాపిక్ మొదలైంది.. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే స్వయానా కేసీఆర్ నోటి నుంచే టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఏర్పాటుచేసుకున్నాం అని సంభోదించడం.. అయితే కేసీఆర్ కావాలనే టీఆర్ఎస్ ఎల్పీ అని అన్నారా? దీని వెనుక ఇంకేదైనా ఆంతర్యం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.
మొదట ఉద్యమ పార్టీగా ప్రజల్లోకి వచ్చిన టీఆర్ఎస్ అదే తెలంగాణా సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చింది. అనంతరం రెండు పర్యాయాలు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకుంది. రెండో సారి గెలిచాక టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని పార్టీ పేరును కాస్త బీఆర్ఎస్ గా మార్చుకుంది. అది స్వయంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ప్రతిపాదించారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి.. అయితే ఈ బీఆర్ఎస్ అనే పేరు వల్ల తెలంగాణాకు, పార్టీకి పేగుబంధం తెగిపోతుందని అప్పట్లో పార్టీ నాయకులు, శ్రేణులు వద్దని చెప్పినా కేసీఆర్ వినిపించుకోకుండా పార్టీ పేరుని మార్చారు.
కానీ ఇప్పుడు తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కేసీఆర్ తమ పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు, మళ్లీ పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చుతారంటూ ఆ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.. బీఆర్ఎస్ ను గతంలో జాతీయ స్థాయి పార్టీగా నిలిపేందుకు కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటనలు చేసి బీఆర్ఎస్ లోకి అనేకమంది నాయకులను చేర్చుకున్నారు. అందులో ప్రధానంగా మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ ను తెరిచే సమయంలో పెద్ద ఎత్తున కార్లతో ర్యాలీ గా వెళ్లారు కేసీఆర్.
తెలంగాణాలో అధికారం కోల్పోవడంతో మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు వేరే పార్టీల్లోకి జంప్ అయ్యారు.. దీంతో బీఆర్ఎస్ అనే పేరు పార్టీకి సక్సెస్ తీసుకొస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఇప్పుడు తిరిగి తెలంగాణాపై మాజీ సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లుగా తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. 2023 ఎన్నికల తర్వాత జాతీయస్థాయి రాజకీయాల మీద బీఆర్ఎస్ ఫోకస్ పెట్టడంలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ కేవలం తెలంగాణాకు మాత్రమే పరిమితమైంది.. అయితే తిరిగి తెలంగాణాలో పార్టీ పుంజుకోవాలంటే పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చాలంటూ నేతలందరూ కేసీఆర్ కు సూచనలు చేస్తున్నారట..
అయితే కేసీఆర్ నిజంగానే పార్టీ పేరును టీఆర్ఎస్ గా మారుస్తారా? లేక నేతల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం అని కావాలనే టీఆర్ఎస్ ఎల్పీ అని ప్రస్తావించారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారిస్తే ప్రజల్లో మొదట లభించిన ఆదరణ మళ్లీ తిరిగి వస్తుందా? లేదా? నిజంగానే పార్టీ పేరును మారిస్తే ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.
Story by Ramireddy, Big Tv