Rajam constituency: గెలవక గెలవక గెలిచిన సెగ్మెంట్లో ఎమ్మెల్యే వైఖర సొంత పార్టీ వారికే మింగుడు పడటం లేదంట. కొండ్రు మురళీమోహన్ గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి రాజాం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన సెగ్మెంట్కు అతిధిగా మారడంతో రాజాంలో ఆయన తమ్ముడు జగదీష్ పెత్తనం చేస్తున్నారంట. ఇదే సమయంలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మ రాజంలో టీడీపీలో తనదైన శైలిలో దూసుకుపోతుండటంతో క్యాడర్ అంతా ఆమె కాంపౌండ్కే చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది.
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత సిక్కోలు నుంచి విజయనగరం జిల్లాలో కలిసిన రాజాం నియోజకవర్గంలో టీడీపీ గెలవడానికి 15 ఏళ్ల సమయం పట్టింది. అయితే 2024లో గెలిచిన తర్వాత పార్టీ బలపడే సూచనలు రాజంలో కనిపించడం లేదు. పార్టీని బలోపేతం చేయడం కంటే వర్గ పోరే ఎక్కువగా కనిపిస్తుంది. బయటికి అంతా సవ్యంగా కనిపిస్తున్నా.. కొండ్రు మురళి వర్సెస్ కావలి గ్రీష్మ పొలిటికల్ ఫైట్ చాప కింద నీరుల విస్తరిస్తోంది. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన వ్యవహార శైలే వర్గ పోరుకు కారణమని తెలుగు తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు
ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఒకరిద్దరికి మినహా మిగతావారు ఎవ్వరికి నియోజకవర్గంలో ప్రయారిటీ ఇవ్వట్లేదు అని ప్రచారం నడుస్తోంది. అంతేకాదు ప్రజలకి కార్యకర్తలకి అందుబాటులో కూడా ఉండట్లేదు అన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వచ్చి తర్వాత వైజాగ్ వెళ్లిపోవడం తప్ప నియోజకవర్గంలో నిలకడగా ఉండటం లేదని విపక్షంతోపాటు సొంత పార్టీలోనూ టాక్ ఉంది. దీంతో ఎమ్మెల్యే తమ్ముడు జగదీష్ తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని సొంతగూటి పక్షులే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గంలో ఏం జరగాలన్నా తమ్ముడు నిర్ణయమే ఫైనల్ అని అనుకుంటున్నారు. ట్రాన్స్ఫర్లు దగ్గర నుంచి రికమండేషన్ ల వరకు ఎమ్మెల్యే తమ్ముడు అంగీకారమే ఫైనల్ అవుతోందంట.
ఎమ్మెల్యే తమ్ముడు కొండ్రు జగదీష్ వ్యవహారంతో నియోజకవర్గంలో మెజారిటీ టీడీపీ నేతలు మింగలేక కక్కలేక ఉంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అధికారంలో ఉన్నాం కాబట్టి తప్పని పరిస్థితి నెలకొందని ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు ఇటీవల రాజాం ఏఎంసీ నియామకంతో ఈ అసహనం మరింతగా పెరిగింది. కొండ్రు మురళీమోహన్ వ్యవహారంతో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కావలి గ్రీష్మ గూటికి చేరుతున్నారు. తక్కువ కాలంలోనే ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న గ్రీష్మకు తల్లి కావలి ప్రతిభాభారతి రాజకీయ చతురత కూడా తోడవ్వడంతో ఆమె దూకుడు పెంచుతున్నారంట.
రాష్ట్ర విభజన తర్వాత కొండ్రు మురళీమోహన్ గత్యంతరం లేక టిడిపిలో చేరారని.. గ్రీష్మ కుటుంబం పార్టీ ఆవిర్భావం నుంచే కొనసాగుతున్నారని కార్యకర్తల్లో బలమైన అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయమే గ్రీష్మకు అనుకూలంగా మారింది. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాజం జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఇప్పుడు రాజంపై పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని మురళి మనసులో ఉందని కొంతమంది ఆయన వర్గీయులే చెబుతున్నారు.
అయితే ఇక్కడే గ్రీష్మ తనదైన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు అని తెలుస్తోంది. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగినప్పటికీ.. రాజంలో కొంత భాగం ఎస్సీ రిజర్వేషన్ లోకి వెళ్లి అవకాశాన్ని కూడా ఆమె కొట్టి పారేయలేకపోతున్నారు. అందుకే నియోజకవర్గంలోని అందరి నేతలతో మంచిగా మెసులుకుంటున్నారు. ఆ క్రమంలో మురళీమోహన్ దగ్గర ఉన్న నేతలంతా కావలి గ్రీష్మ కాంపౌండ్ లోకి చేరిపోతున్నారు. మొత్తానికి పెద్ద హడావిడి లేకుండా రాజాంలో గ్రీష్మ పట్టు సాధించే ప్రయత్నం చేస్తుండటం పెద్ద డిబేట్గా మారింది.
Story by Ramireddy, Big Tv