KCR: ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి తిరిగి ప్రజల్లోకి రానున్నారట. అందుకోసం ఈ నెల 21వ తేదీన బీఆర్ఎస్ఎల్పీ, కార్యవర్గ సమావేశానికి రానున్నారట. ఇంతకీ ఈ సమావేశాల్లో కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు? ఏం మాట్లాడబోతున్నారు? అసలు గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి రీజన్సేంటి? సర్పంచ్ ఎన్నికల్లో చేతులు కాలాక ఇప్పుడు బయటికి వచ్చి నేతలకు ఎలాంటి దిశానిర్ధేశం చేయబోతున్నారు?
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్హౌస్ను వదిలి బయటికి రాబోతున్నారట. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి మేజర్ కార్యక్రమాలు జరిగినా.. ఆఖరికి జూబ్లీహిల్స్ బైఎలక్షన్స్లో బరిలోకి దిగినాఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఫామ్హౌస్కే పరిమితమైన కేసీఆర్.. ఇప్పుడు బయటికి రాబోతున్నారనేది నిజంగా చాలా పెద్ద విషయం. అసలింతకు కేసీఆర్ బయటికి ఎందుకు వస్తున్నారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.
ఈ నెల 21న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రజలతో పాటు.. పార్టీ నేతలకు కూడా కేసీఆర్ పార్టీకి దూరమవుతున్నారనే ఫీలింగ్ వచ్చేసింది. దీంతో అప్పుడప్పుడైనా కనిపించకపోతే ఇక మొత్తానికే చెడ్డ పేరు వస్తుందనుకున్నారో లేక తనను మర్చిపోతున్నారనుకున్నారో కానీ.. బయటికి రావాలని మాత్రం డిసైడ్ అయ్యారు గులాబీ బాస్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది.. పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. మరి ఇప్పుడు కేసీఆర్ నేతలకు ఏం దిశానిర్దేశం చేస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను కూడా ఫిక్స్ చేశారట. రైతులు, సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపైనే ఈసారి చర్చ ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు సంబంధించిన నీటి కేటాయింపులనే ఇప్పుడు టార్గెట్ చేసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అంశాన్ని లేవనెత్తడం రాజకీయ వ్యూహమే అనిపిస్తోంది.
గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ గురించి సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు ప్రస్తావించా . బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్ట్ను అటకెక్కించారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీల ఇస్తే చాలని కేంద్రం ముందు ఎలా ఒప్పుకుందనే అంశాన్ని లెవనేత్తాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి, పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందనేది ఇప్పుడు గులాబీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఈ వైఖరిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం నీటి కేటాయింపులను కొల్లగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అవసరమైతే తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదనే అంశాన్ని నేతలకు చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని కూడా ఎండగట్టాలని గులాబీ బాస్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి కారణంగా నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్నా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ సమావేశాల ప్రస్తావన కూడా ఈ భేటీలో వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో దీనికి సంబంధించిన దిశానిర్ధేశం చేస్తారనే చర్చ అయితే పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
ఈ సమావేశాల్లో కవిత అంశంపై గులాబీ బాస్ చర్చిస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే తన అన్న కేటీఆర్, బావ హరీష్రావు, ఇతర ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారు కవిత. మొదటి నుంచి తన తండ్రి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయంటూ చెబుకుంటూ వచ్చిన కవిత.. కొన్ని రోజులుగా టోన్ మార్చారు. తండ్రి కేసీఆర్ను కూడా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. పార్టీపై, బీఆర్ఎస్ ముఖ్య నేతలపై, ఆఖరికి మేనల్లుడు, కొడుకుపై విమర్శలు వచ్చినా ఎప్పుడూ కేసీఆర్ రియాక్ట్ కాలేదు. మరి ఈసారి నేరుగా తననే టార్గెట్ చేశారు కవిత. మరి ఇప్పుడైనా ఈ అంశంపై స్పందిస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తానికి కేసీఆర్ ఫామ్హౌస్ను వీడటం గులాబీ నేతల్లో కొత్త జోష్ను అయితే నింపుతుంది. కానీ ఆయన ఏం మాట్లాడుతారు? నేతలతో ఏం మాట్లాడుతారు? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
Story by Ramireddy, Big Tv