Khairatabad Ganesh: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి ఖైరతాబాద్ మహా గణపతిపైనే ఉంటుంది. సిటీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచే బడా గణేశుడు ఈసారి విభిన్న రూపంలో సిద్ధమయ్యాడు. ఏటా సరికొత్త రూపంలో కొలువుదీరే లంబోదరుడు ఈసారి పంచముఖ సంకటహర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. 69 అడుగుల ఎత్తుతో ఐదు పడగలు, పంచముఖాలతో గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం.. మరోవైపు కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహా గణపతి విగ్రహానికి కంటి పాపను అమర్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. దీంతో.. ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బడా గణేష్ ప్రాంగణం అంతా ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
భారీ విగ్రహం వెనక వందలాది మంది కళాకారుల శ్రమ దాగి ఉంటుంది. 3 నెలల పాటు తెలంగాణ, ఏపీ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా కళాకారులు మహా గణపతికి నిర్మాణానికి శ్రమించారు. బడా గణేష్ను పర్యావరణహితంగా రూపొందించారు. పలు రాష్ట్రాల నుంచి సేకరించిన ఎకో ఫ్రెండ్లీ పదార్థాలతో విగ్రహ తయారీ చేశారు. ప్రధాన గణేశుడే కాదు పక్కన ప్రతిష్ఠించే విగ్రహాలను కూడా ఇదే తరహాలో తయారు చేశారు. మట్టి పగుళ్లు రాకుండా సహజసిద్ధమైన మిశ్రమంతో విగ్రహ పైభాగాన్ని సున్నితంగా తీర్చిదిద్దారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఖైరతాబాద్ బడా గణేశుడు అంటే కేవలం భారీ విగ్రహం కాదు, దాని వెనక కళాకారుల కళ, శ్రామికుల శ్రమ దాగి ఉంది. ఇదే ఈ మహాగణపతి ప్రత్యేకత.
Also read: హైదరాబాద్ ప్రజలకు బిగ్ షాక్.. ఆస్తి పన్నులో కీలక మార్పులు..!