Property Tax: హైదరాబాద్లో ఆస్తి పన్ను విధానంలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఇక నుంచి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా వసూలు చేయనున్నారు. దీంతో ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే చాలామందికి ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. అయితే పెంపును ఒక్కసారిగా అమలు చేయరు. అదనంగా పడే భారం ఏడాదికి 20 శాతానికి మించకుండా.. విడతల వారీగా పెంచుతారు.
పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం ఊరట ఇచ్చింది. 375 చదరపు అడుగులలోపు నివాసం ఉన్న వారికి.. ఏడాదికి కేవలం 101 రూపాయల నామమాత్రపు ఆస్తి పన్ను విధించనున్నారు. ఇకపై హైదరాబాద్లో భూమి, భవనం విలువను బట్టి పన్ను నిర్ణయిస్తారు. ఇళ్లకు రిజిస్ట్రేషన్ విలువలో కనీసం 0.10 శాతం నుంచి గరిష్ఠంగా 0.50 శాతం వరకు విధించే అవకాశం ఉంది. కమర్షియల్ వాటికి 0.20 శాతం నుంచి 2 శాతం వరకు పన్ను ఉండొచ్చు.
Also read: నాగార్జునసాగర్లో 200 టీఎంసీల నీరు మాయం.. సర్కార్ పై జగదీశ్వర్ రెడ్డి ఫైర్!
మునుముందు రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువలను సవరించినా.. దాని ప్రభావం ఆస్తి పన్నుపై పడ నుంది. అయితే.. విలువలను సెప్టెంబర్లో సవరించినా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను అమల్లోకి వచ్చేలా నిబంధనలు ఉంటాయి. ఈ మార్పులన్నీ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అమలు కానున్నాయి. బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించించగా గవర్నర్ సంతకం తర్వాత చట్టంగా మారనుంది.
మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల భారాన్ని మోపారని, ఆ షాక్ నుంచి కోలుకోకముందే.. సరికొత్త పన్ను విధానంలో మార్పులను తీసుకురావడాన్ని తప్పుపడుతున్నారు. సంపాదించిదంతా పన్నులు కట్టడానికే సరిపోతే బతకడం ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆస్తి పన్నుల విషయంలో మరోసారి పునరాలోచించాలంటూ కోరుతున్నారు.
Also read: నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?