Zomato Fee: ముందు ఈజీ వేను కస్టమర్లకు అలవాటు చేస్తారు. ఇక ఆ సేవలమీదే కస్టమర్లు ఆధారపడే స్టేజీకి వచ్చాక అదనపు మోత మోగిస్తారు. ఈ విషయం జొమాటో ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త రూల్ను చూస్తే అర్థమవుతుంది. ఫుడ్ ఆర్డర్ చేసి.. డెలివరీ బాయ్ చేతిలో క్యాష్ పెట్టే కస్టమర్లకు ఆన్లైన్ ఫుడ్ డెలివరి సంస్థ జొమాటో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లపై కొత్తగా పే ఆన్ డెలివరీ ఫీజును తీసుకొచ్చింది. అంటే ఫుడ్ బిల్లు ఎంతైతే ఉందో అంతే కాకుండా.. నగదుగా చెల్లించే వారికి అదనంగా ఈ ఫీజు కూడా పడనుంది. అయితే ఆన్లైన్లో పేమెంట్ చేసేవారికి మాత్రం ఈ ఛార్జీ వర్తించదు. ఆర్డర్ విలువ, కస్టమర్ లొకేషన్, ఇతర అంశాలను బట్టి ఫీజు మారుతుందని జొమాటో యాప్లో పేర్కొంది.
జొమాటో తీరుతో ఇప్పటికే ఫుడ్ డెలివరీ ధరలు, ప్లాట్ఫామ్ ఫీజులతో బిల్లు పెరుగుతోందని కస్టమర్లు అంటుంటే.. క్యాష్ చెల్లింపులకూ కొత్త ఫీజు ఏంటనే చర్చ మొదలైంది. ఇక అదనపు వడ్డింపులపై జొమాటో వాదన మరోలా ఉంది. నగదు చెల్లింపులను తగ్గించి ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సాహించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనను సాకుగా చెబుతోంది. అందుకే CODపై అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు చెబుతోంది. అయితే, నగదు చెల్లింపులపై ఎలాంటి అదనపు వసూళ్లు చేయరాదనే RBI గైడ్లైన్స్ ఉండనే ఉన్నాయి. మరి ఈ విషయంలో RBI నిబంధనలను జొమాటో తుంగలో తొక్కినట్టే కదా..!
మరోవైపు జొమాటోకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న స్విగ్గీ మాత్రం ప్రస్తుతం క్యాష్ పేమెంట్లపై ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీ వసూలు చేయడం లేదు. మరి జొమాటో తీసుకొచ్చిన కొత్త రూల్.. ఆ సంస్థ కస్టమర్లను తగ్గిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిన విషయమే.
Also read: బీసీ కులగణన పేరుతో కేంద్రం మోసం.. డేంజర్ జోన్లో ఆ రెండు కులాలు..?